Adani | న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టిన పదికిపైగా విదేశీ మదుపరులు నిబంధనల్ని ఉల్లంఘించినట్టు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గుర్తించిందని సమాచారం. పరిమితికి మించి పెట్టుబడులు పెట్టడం, సమాచారం ఇవ్వకపోవడం వంటి పొరబాట్లు చేశారని తెలుస్తున్నది. ఈ మేరకు ఇద్దరు అధికారుల ద్వారా సోమవారం తెలిసింది. అయితే దీనిపై అటు సెబీగానీ, ఇటు అదానీ గ్రూప్గానీ స్పందించలేదు. కాగా, హిండెన్బర్గ్ రిపోర్టుతో ఇప్పటికే అదానీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇది ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
ఇదిలావుంటే సదరు ఇన్వెస్టర్లకు ఇప్పటికే సెబీ నోటీసులు జారీ చేసిందని కూడా అంటున్నారు. అదానీ గ్రూప్లో వారి పెట్టుబడుల గురించిన సమాచారం ఇవ్వాలని అందులో ఆదేశించింది. అలాగే నిబంధనల ఉల్లంఘనకు సంబంధించీ వివరణ కోరిందని చెప్తున్నారు. కాగా, ఈ వ్యవహారంలో ఎనిమిది మంది ఇన్వెస్టర్లు జరిమానా చెల్లించి తప్పించుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు సెబీకి ఓ విజ్ఞప్తి లేఖ కూడా రాశారని తెలుస్తున్నది.