హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాఖల వారీగా పద్దులపై నేటితో చర్చ ముగియనుంది. తొమ్మిదో రోజైన నేడు.. శాసనసభలో మరో 12 శాఖలపై చర్చించనున్నారు. గత రెండు రోజులుగా 26 పద్దులపై చర్చించి వాటిని ఆమోదించారు. ఇవాళ నీటిపారుదల, సాధారణ పరిపాలన, కార్మికశాఖ, ఉపాధి కల్పన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రోడ్లు, భవనాలు, విద్యుత్, శాసన, న్యాయ, ప్రణాళిక శాఖలపై చర్చించనున్నారు. వీటితోపాటు సవరణల బిల్లులు కూడా అసెంబ్లీలో చర్చకు రానున్నాయి. ఇందులో ఉద్యోగుల వయో పరిమితి పెంపు సవరణ బిల్లు, వేతనాలు, పింఛన్ల చెల్లింపునకు సంబంధించిన సవరణల బిల్లులు ఉన్నాయి. ఈ నెల 15న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. మొత్తం పది రోజుల పాటు సభను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.