సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి ప్రతి రౌండ్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రతి రౌండ్లో తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచంద్రారావుపై సరాసరి 1-2వేల మధ్య మెజార్టీని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు రౌండ్లు ముగిసే సమయానికి 53వేల పైచిలుకు ఓట్లను సాధించిన వాణీదేవి.. రాంచంద్రారావు కంటే 4,444 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. 3,57,354 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుత ట్రెండ్ ప్రకారం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యంగా కనిపిస్తుంది. గురువారం సాయంత్రం ఏడు గంటల వరకు మూడో రౌండ్ పూర్తయింది. అంటే మూడు రౌండ్లలో 1,68,032 ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ క్రమంలో ఏడు రౌండ్లు పూర్తి కావాలంటే శుక్రవారం సాయంత్రం వరకు సమయం పడుతుందని కౌంటింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా చూస్తే శుక్రవారం రాత్రిగానీ రెండో ప్రాధాన్యత లెక్కింపు అనేది మొదలుకాదని అధికారులు చెబుతున్నారు.