భారత్లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజలకు మెరుగైన ఆరోగ్య వసతులు కల్పించేందుకు ప్రభుత్వాలు కృషిచేస్తూనే ఉన్నాయి. కానీ, ఇప్పటికీ ఆధునిక వైద్యసదుపాయాలు అందుబాటులోలేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వీరందరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ఆయుష్మాన్ భారత్ వంటి కొత్త పథకాలను అమలుచేస్తున్నారు. దేశంలో ఆరోగ్యరంగం స్థితిగతులపై పోటీపరీక్షల్లో తరుచుగా ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో నిపుణ పాఠకులకోసం ఈ వ్యాసం..
ఇటీవల వెలువడిన నీతిఆయోగ్ ఆరోగ్యరంగంలో రాష్ర్టాల ప్రదర్శన నివేదిక, 2018-19 కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్, జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం దేశంలోని ఆరోగ్యరంగం స్థితిగతులను ప్రతిబింబిస్తున్నాయి.
-దేశం ఆరోగ్యరంగంలో చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటుంది. జాతీయ ఆరోగ్య విధానం-2017, ఆయుష్మాన్ భారత్ పథకం లాంటి విధానాల ద్వారా దేశ ప్రజలందరికీ ఉన్నతస్థాయి వైద్య సౌకర్యాలను అందించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం.
-దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఆరోగ్య రంగానికి కేవలం 1.4 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్యరంగానికి సంబంధించిన పరిశోధన కోసం ప్రజారోగ్యానికి ఇచ్చే మొత్తంలో కేవలం 1 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. భారత్లో ప్రజలు వైద్యంపై చేస్తున్న ఖర్చు వారి ఆదాయాల్లో దాదాపుగా 65 శాతంగా ఉంది. ప్రపంచంలో మరేదేశంలోని ప్రజలు వైద్యం కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడంలేదు. స్థూల దేశీయోత్పత్తిలో ఆరోగ్యరంగ వాటాను ప్రస్తుతం ఉన్న 1.4 శాతం నుంచి 2.5 శాతానికి పెంచాలని నూతన జాతీయ వైద్య విధానం నిర్దేశించింది.
-కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్రీయ స్వాస్త్య బీమా యోజన పథకం ద్వారా గ్రామీణ స్థాయిలో 13 శాతం ప్రజలకు, పట్టణస్థాయిలో 12 శాతం ప్రజలకు మాత్రమే జీవిత బీమా సౌకర్యం కల్పించారు. ఇటీవల జాతీయ నమూనా సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో దేశంలో దాదాపు 80 శాతం మంది ప్రజలకు ఎలాంటి జీవిత బీమా సౌకర్యం లేదనే వాస్తవం వెల్లడైంది.
-సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధనలో దేశ నిష్పాదన నిర్దేశించుకున్న గమ్యానికి దరిదాపులో ఉంది. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల్లో మాతృ మరణాల తగ్గింపు లక్ష్యం 139 కాగా, ఈ అంశంలో దేశంలో నిష్పాదన 167గా ఉంది. అదేవిధంగా ఐదేండ్లలో శిశుమరణాల రేటు తగ్గింపు లక్ష్యం 42 కాగా, భారత్ నిష్పాదన 49గా ఉంది.
-ఇటీవల ప్రపంచ ఆకలి నివేదికలో 118 దేశాల్లో భారత్ 78వ స్థానాన్ని పొందింది. దేశంలో అంటువ్యాధుల్లో 28 శాతం వ్యాధులు, సాధారణ వ్యాధుల్లో 60 శాతం వ్యాధులు ఉన్నాయి.
-దేశంలో ముఖ్యంగా రెండు ఆరోగ్య సంబంధిత అంశాలను పరిపుష్ఠం చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవి..
1. ఆరోగ్య సంబంధిత సౌకర్యాలను కల్పించలేకపోవడం
2. జీవన సంబంధిత వ్యాధులు (డయాబెటిస్, హృద్రోగాలు)
-దేశంలో మానసిక అనారోగ్యం కూడా ప్రజల్లో పెరుగుతుంది. ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం…
-స్త్రీలలో ప్రతి నలుగురిలో ఒకరు, దాదాపు 10 శాతం మంది పురుషులు డిప్రెషన్కు గురవుతున్నారని తేలింది.
-సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల్లో నిర్దేశించిన కొన్ని వ్యాధులను తగ్గించడంలో దేశ నిష్పాదన మెరుగైన స్థితిలో ఉంది.
-ఉదాహరణకు పోలియో వ్యాధిని నిర్మూలించడం, కుష్ఠు వ్యాధిని తగ్గించడం, ఎయిడ్స్ వ్యాధి కేసుల్లో నిర్దేశించుకున్న లక్ష్యాల్లో సగానికి చేరుకున్నాయి.
-దేశంలో జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ల ద్వారా వైద్యరంగంలో ప్రపంచస్థాయి ప్రమాణాలను సాధించండం కోసం కృషి జరుగుతుంది.
-జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా కింది ప్రోగ్రామ్లు నిర్వహిస్తున్నారు.
1) RMNCH +A Services (RMNCH +A సేవలు)
2) Communicable Diseases Programm (అంటువ్యాధుల నివారణ కార్యక్రమం)
3) అంటువ్యాధులు కాని వ్యాధుల నివారణ ప్రోగ్రామ్
4) గ్రామీణ, పట్టణ స్థాయిల్లో ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధిచేయడం
5) సార్వత్రిక రోగ నిరోధక ప్రోగ్రామ్
6) మానసిక ఆరోగ్యం
-దేశ ప్రజలందరికీ నాణ్యమైన, మెరుగైన సకల వైద్య సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం 2018-19 బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.
-దేశంలో ఏడాదికి ఆరోగ్య సేవల కోసం రూ. 5 లక్షల కోట్లు ఖర్చవుతుంది. దేశంలో 60 శాతం ప్రజలు వైద్యచికిత్సల కోసం వ్యక్తిగతంగానే డబ్బు ఖర్చు చేస్తున్నారు. దేశ ప్రజలకు రోజురోజుకి వైద్యచికిత్సల కోసం వెచ్చించే ఖర్చు భారం అవుతుంది. ఈ పరిస్థితిని నివారించడానికిగాను కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకువచ్చింది.
-ఈ పథకాన్ని మొదటి దశలో 50 కోట్ల మంది ప్రజలతో ప్రారంభించి, అంతిమంగా 130 కోట్ల మందికి విస్తరించాలన్నది కేంద్రప్రభుత్వ లక్ష్యం.
-ఈ పథకం అర్హుల ఎంపికకు 2011 నాటి సామాజిక, ఆర్థిక, కుల జనాభా గణన (ఎస్ఈసీసీ) ఆధారం.
-ఈ పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి వార్షిక వైద్యఖర్చుల కోసం రూ. 5 లక్షలు కేటాయిస్తారు.
-ఆయుష్మాన్ భారత్ అనేది కేంద్ర ప్రాయోజిత పథకం. కానీ అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.
-ఈ పథకంలో పేరు నమోదు చేసుకున్న వ్యక్తి దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా వైద్యసౌకర్యాలను పొందవచ్చు.
-ఈ పథకం అమలుకు అవసరమయ్యే నిధుల కోసం వైద్య సుంకాన్ని అదనంగా 1 శాతం పెంచాలని కేంద్రం భావిస్తుంది.
-ఈ పథకంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడానికి 2022 నాటికి దేశవ్యాప్తంగా 1.5 లక్షల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటుచేయాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా నిర్ధారించింది.
ముఖ్యాంశాలు
-దేశ ప్రజల జీవన ఆయుఃప్రమాణాన్ని 2025 నాటికి 70 ఏండ్లకు పెంచాలి (ప్రస్తుతం 67.5 ఏండ్లు ఉంది).
-స్త్రీల సంతాన సాఫల్యతా రేటును 2025 నాటికి జాతీయ, ప్రాంతీయ స్థాయిలో 2.1 శాతానికి తగ్గించాలి.
-2020 నాటికి రక్షిత మంచినీటి సౌకర్యాన్ని, పరిశుభ్రతను కల్పించాలి.
-పొగాకు వాడకంలో వాటాను 2020 నాటికి 15 శాతం, 2025 నాటికి 30 శాతం తగ్గించాలి.
-2025 నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఆరోగ్యరంగ వ్యయాన్ని 1.4 శాతం నుంచి 2.5 శాతానికి పెంచాలి.
-ఆరోగ్య రంగ వ్యయంలో రాష్ర్టాల వాటాను 2020 నాటికి బడ్జెట్లో 8 శాతం కంటే ఎక్కువ కేటాయించాలి.
-2025 నాటికి జాతీయ స్థాయిలో, రాష్ర్టాల స్థాయిలో కుటుంబ నియంత్రణను 90 శాతానికిపైగా అమలు చేయాలి.
-2017 నాటికి కాలా అజార్, లింఫోటిక్ ఫైలేరియాసిస్ వ్యాధులను నిర్మూలించాలి. అదేవిధంగా 2018 నాటికి కుష్ఠువ్యాధి నిర్మూలనకు కలిసి కృషి చేయాలి.