వాసాలమర్రిలో దాదాపు రెండు గంటల తర్వాత కూడా సీఎం కేసీఆర్ రెట్టింపు ఉత్సాహంతో పర్యటన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఒక స్థానికుడు ‘నాకు తిరిగి.. తిరిగి కాళ్లు గుంజుతున్నయి. ఆయినేమో ఇప్పుడే నడక మొదలువెట్టినట్టు పోతున్నడు’ అని అంటే.. పక్కనే ఉన్న మరోవ్యక్తి ‘అదే ఆయన స్పెషల్. ఊరోళ్లతోటి ముచ్చటంటే సంబురపడుతడు. కొత్త మనుషులను సూస్తుంటే.. వాళ్లతో మాట్లాడుతుంటే ఆయనకు కొత్త ఉత్సాహం వస్తది. ముచ్చట్లు పెట్టుకుంట పోతనే ఉంటడు. ఉద్యమం సంది సూస్తున్నం కదా’ అన్నారు.
ఈ పర్యటనలో ఎక్కడా ఆయన ఒక సీఎంగా వ్యవహరించలేదు. ఆ ఊర్లో తానూ ఒకడిగానే కలియదిరిగారు. ప్రతి ఇంటిముందు ఆగి, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గోడల మీద, చెట్ల మీద చేతులు ఆన్చి ముచ్చట్లు పెట్టారు. పర్యటన మధ్యలో వేరే గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన ఓ యువతిని ఆమె బంధువులు తీసుకొని వచ్చారు.
ఏదైనా సాయం చేయాలని కోరారు. దీనికి సీఎం స్పందిస్తూ ‘పెన్షన్ వస్తున్నదా?’ అని అడుగగా, రూ.3వేలు వస్తున్నదని వారు సమాధానం ఇచ్చారు. ‘పెన్షన్ వస్తున్నది కదా.. ఇంకా ఏది కావాల్నో స్పష్టంగా చెప్పకుండా సాయం చేయమంటే ఎట్లా? ఆమెను ఇబ్బందిపెట్టుడు కాదా?’ అని అసహనం వ్యక్తంచేశారు. దీంతో యువతికి కృత్రిమ కాళ్లు అమర్చాలని వారు కోరగా, ‘తప్పకుండా అమర్చుదాం’ అని హామీ ఇచ్చి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.