నందిపేట్ రూరల్/ఆర్మూర్/ముప్కాల్/వేల్పూర్, జూన్ 27: నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో గ్రామదేవతలకు ఆదివారం జలాభిషేకం చేశారు. వీడీసీ ఆధ్వర్యంలో గోదావరి నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చి గ్రామంలోని దేవుళ్లకు జలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈసారి వర్షాలు సమృద్ధికి కురిసి పంటలు బాగా పండాలని, గ్రామస్తులందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుళ్లను కోరుకున్నారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులతోపాటు అన్ని కులాల వారు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని పలు గ్రామాల్లో గ్రామదేవతలకు గంగాజలాలతో ఆదివారం జలాభిషేకం చేశారు. మండలంలోని సుర్భిర్యాల్, ఆలూర్ తదితర గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో జలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
పవిత్ర గోదావరి నది నుంచి ప్రత్యేకంగా గంగాజలాలను తీసుకువచ్చి గ్రామశివార్లలో ఉన్న గ్రామదేవతల వద్దకు వడగొడుగులతో డప్పువాయిద్యాల మధ్య ఊరేగింపుగా వెళ్లారు. గ్రామదేవతలకు జలాషేకం, పూజలు చేశారు. సుర్భిర్యాల్ సర్పంచ్ సవిత, ఆలూర్ సర్పంచ్ మోహన్రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్, ఆలూర్ సొసైటీ చైర్మన్ భోజారెడ్డి, పిప్రి సొసైటీ చైర్మన్ సోమ హేమంత్రెడ్డి, సుర్భిర్యాల్, ఆలూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆర్మూర్ వైస్ ఎంపీపీ భోజకళా, ఎంపీటీసీ లక్ష్మి, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ ఆలూర్ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మోహన్రెడ్డి, అశ్విన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముప్కాల్ మండల కేంద్రంతోపాటు నాగంపేట్, కొత్తపల్లి గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆదివారం గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. గ్రామ, కులపెద్దలు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో ఆదివారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గంగాజలంతో గ్రామదేవతలకు జలాభిషేకం నిర్వహించారు.