వికారాబాద్, మే 21,(నమస్తే తెలంగాణ) : జిల్లాలో లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. శుక్రవారం సీఎం కేసీఆర్ వరంగల్ నుంచి జిల్లాలో కొవిడ్ పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్, డీఎంఅండ్హెచ్వో, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కాన్ఫరెన్సులో వికారాబాద్ కలెక్టర్ పౌసమి బసు, అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, ఎస్పీ నారాయణ, డీఎంఅండ్హెచ్వో సుధాకర్ షిండే, జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కొవిడ్ నియంత్రించడానికి లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలని సూచించారు. కొవిడ్ వార్డులు శుభ్రంగా ఉండాలని, తరచూ కలెక్టర్లు దవాఖాన పరిస్థితిపై సమీక్షించాలన్నారు. అవసరం లేని వాటిని వెంటనే డిస్పోజ్ చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టాలన్నారు. మందుల కొరత లేకుండా స్టాక్ పెట్టుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎమర్జెన్సీ సర్వీసులు కొనసాగుతాయని వారికి పాసులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లాక్డౌన్ కఠినంగా అమలు చేసినప్పుడే లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
లాక్డౌన్తో కేసులు తగ్గుముఖం :రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్
షాబాద్, మే 21 : ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించేలా కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్లు, ఎస్సీలు, వైద్యాధికారులతో సీఎం కేసీఆర్ అత్యవసర వీడియో కాన్పరెన్స్ లో రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ మాట్లాడారు. జిల్లాలో లాక్డౌన్ కంటే మందు పాజిటివ్ కేసులు 34 శాతం ఉండేవని, లాక్డౌన్ విధించిన తర్వాత 21 శాతం ఉందన్నారు. జిల్లాలో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తామని సీఎంకు వివరించారు. వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు ప్రతీక్జైన్, తిరుపతిరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి, డీపీవో శ్రీనివాస్రెడ్డి, పరిశ్రమల అధికారి రాజేశ్వర్రెడ్డి, డీఆర్డీవో ప్రభాకర్ పాల్గొన్నారు.