చూడ్డానికి అందంగా ఉన్నా.. మనసులో కల్మషం, ద్వేషం, అసూయ నింపుకున్న మనుషులు మనకు తారసపడినప్పుడు వినిపించే సామెత ఇది. సుందరి అంటే అందమైన స్త్రీ. ఇక మంథర గురించి చెప్పాల్సి వస్తే.. కలహాలు రేపడంలో తన తర్వాతే ఎవరైనా. రామాయణంలో మంథర పాత్ర ప్రముఖమైంది. రాముడి పట్టాభిషేకాన్ని ఆపి, వనవాసానికి పంపి.. రామాయణంలోని ఓ ముఖ్య ఘట్టానికి కారణమైంది మాయదారి మంథరే. కైకేయి పుట్టింటి నుంచి ఆమెతో పాటు దాసిగా అయోధ్యలో ప్రవేశించింది. రాముడికి పట్టాభిషేకం జరుగుతున్నదని తెలియగానే.. కైకేయి ఆలోచనలను దారితప్పించి శుభకార్యానికి అడ్డుపుల్ల వేయించింది. శ్రీరాముడిని అడవుల పాలు చేసింది. చివరికి రావణవధకు పరోక్షంగా కారణమైంది. ఆధునిక యుగంలోనూ ఎంతోమంది మంథరలు మనకు తారసపడుతూనే ఉంటారు. అలాంటివారితో జాగ్రత్తగా వ్యవహరించమని హెచ్చరిస్తారు పెద్దలు.
నీ ఇంట్ల ఉప్పులం..
తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా వినబడే పదబంధం ‘నీ ఇంట్ల ఉప్పులం మొలవ’. ఇదొక తిట్టు.. శాపనార్థం. బద్ధశత్రువులను ఉద్దేశించి పెట్టే శాపం. ఇంట్లో ‘ఉప్పలం’ పుడితే ఆ ఇంటికి నష్టం వాటిల్లుతుందని నమ్మకం. ఉప్పలాన్ని తాకితే చనిపోతారనీ అంటుంటారు. ‘ఉప్పలం’ పుట్టగొడుగు మాదిరి ఉంటుంది. కాక్టస్ జాతికి చెందినది. ఈ రకపు మొక్క దుర్వాసన వెదజల్లుతుంది. పడని వారిని ఉప్పలంతో పోలుస్తారు. కొందరు మైసమ్మ, మారెమ్మ, ఎల్లమ్మలతో సమానంగా ‘ఉప్పలమ్మ’ను ఇలవేల్పుగా కొలుస్తుంటారు. ఏడాదికి, మూడేండ్లకు, ఐదేండ్లకు, ఏడేండ్లకు మొక్కుకొని పూజలు చేస్తుంటారు. శాపనాలు కాకపోయినా ఇంట్లో ఉప్పలం పుడితే.. ‘ఉప్పలం’ పెట్టుకునే స్తోమత లేనివాళ్లు పసుపు, కుంకుమలతో పూజచేసి, తర్వాత పేడతో కప్పేస్తుంటారు. ఇండ్లలో ఉప్పలం పుడితే కొందరు వారం పాటు ఇల్ల్లు విడిచిపెట్టి బ్రాహ్మణులతో శాంతి కార్యక్రమాలు చేయి స్తుంటారు. ‘ఉప్పలమ్మ’ మొలిస్తే మంచి జరుగుతుందని నమ్మేవారు కూడా ఉన్నారు.
ఈతకు మించిన లోతు లేదు..
జీవితమనే ప్రయాణంలో కష్టాలు, నష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. ఒక్కోసారి దుర్భరమైన దీనస్థితిని కూడా పరిచయం చేస్తుంది కాలం. అలా ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా నిలబడాలని చెప్పే సామెత ‘ఈతకు మించిన లోతు లేదు.. గోచికి మించి దారిద్య్రం లేదు’. ఈత తెలిసిన వాడికి లోతుతో పనిలేదు. అలాగే కష్టాలను అనుభవించి రాటుదేలిన మనిషికి మరో కొత్త కష్టంతో నష్టమేమీ ఉండదు. మహా అయితే ఇంకో కొత్త పాఠం నేర్చుకుంటారు. అలాగే దీనస్థితిలో, కడుపేదరికంలో ఉన్నవారికి గోచీని మించిన పేదరికం మరొకటి ఉండదు. కష్టాలతో పోరాడిన వారినే లోకం గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. అలాంటి వ్యక్తే మరో తరానికి ఆదర్శం అవుతాడని అనుభవపూర్వకంగా చెప్పిన సామెత ఇది.
అర్థ వివరణ