ప్రతీక్షణం అప్రమత్తంగా ఉంటూ, తెలివితో వ్యవహరిస్తే.. ఏ పనైనా సులువేనని అనుభవపూర్వకంగా చెప్పారు మన పెద్దలు. ఇకమతు లేనోన్ని ఇగురం ఉన్నోనితో పోల్చుతూ నాడు జానపదులు చెప్పిన సామెత ఇది. ఓ పద్ధతి లేకుండా ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా వృథాయే. ఇంట్లో ఓ పదిమందిని కూర్చోబెట్టి సాదడం అంటే మామూలు విషయం కాదు. ఎంత డబ్బు అయినా నీళ్లలా కరిగిపోతుంది. ఏ పనీ లేకుండా కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి. అందుకే పైసలతోని ఎవ్వరినీ సాదలేమని అనుభవపూర్వకంగా చెప్పారు.
పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఒక్కో ఇంట్లో కనీసం 20 మందికి తక్కువ ఉండేవారు కాదు. పెద్ద ఆసాములను మినహాయిస్తే.. మధ్య తరగతి ఇండ్లలోనూ పేదరికమే ఉండేది. ఆ ఇంటి పెద్ద తెలివిగా కుటుంబం అంతటికీ ఏదో ఒక పని చెబుతూ.. చేయిస్తూ.. ఆ వచ్చిన డబ్బును ప్రణాళిక ప్రకారం ఖర్చు చేసి అందరికీ తిండి పెట్టేవాడు. ఈ రెండు పరిస్థితులను దగ్గరగా గమనించిన పెద్దలు ‘పైసెతోని పదిమందిని సాదలేం గానీ.. ఇగురంతో ఇరువై మందినైనా సాదొచ్చు’ అన్నారు. ఇలాంటి అర్థాన్నిచ్చే ఇంకొన్ని సామెతలు.. ‘ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు’, ‘కూర్చోని తింటే కొండలైనా కరుగుతయ్’.