‘కుండ ఊడ్చేసినా.. బాయి తోడేసినా బర్కత్ కరువు’ అని తెలంగాణలో ఓ సామెత. గిన్నెలో బువ్వను, బాయిలో నీళ్లను ఒక్కసారే కాకుండా, రేపటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొదుపుగా వినియోగించుకోవాలని దీని సారాంశం. ప్రస్తుతం రాష్ట్రంలోని జలవనరులను చూస్తే ఇదే సామెత గుర్తొస్తున్నది. పదేండ్లుగా నీటితో కళకళలాడిన ప్రాజెక్టులు, కాలువలు ఒక్కసారిగా కళతప్పాయి. మండుటెండల్లో మత్తళ్లు దుంకిన చెరువులు, చెక్డ్యాంలు నేడు నెర్రెలు బారాయి. ఫలితంగా సాగునీళ్లు కరువై రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఎండిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 10 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయే ప్రమాదం ఉన్నది.
కండ్ల ముందు ఎండుతున్న పంటలను కాపాడుకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలని రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. రైతులను కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పార్టీ గేట్లు ఎత్తామని రాజకీయాల్లో మునిగి తేలుతున్నది. కరువు పరిస్థితులకు పరిష్కారాలు చూపాల్సిందిపోయి కారణాలు వెతికే పనిలో బిజీ అయిపోయింది. వానలు పడలేదని ఒకసారి, చలికాలంలో అధికారంలోకి వచ్చామని మరోసారి చెప్తూ చేతులెత్తేసే ప్రయత్నం చేస్తున్నది.
రాష్ట్రంలో కురిసిన వర్షాలను ఒకసారి పరిశీలిస్తే.. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీసీ) ప్రకారం.. నిరుడు నైరుతి రుతుపవనాల కారణంగా 17 శాతం అధికంగా వానలు కురిశాయి. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 73.8 సెంటీమీటర్లు కాగా, నిరుడు జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య 86.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం 33 జిల్లాలకు గాను 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా, 18 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాల వారీగా చూస్తే సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాధారణం కన్నా 45 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో మాత్రం 16 శాతం లోటు నమోదైంది. మొత్తంగా 5 జిల్లాల్లోనే సగటున 11 శాతం మేర లోటు వర్షపాతం కనిపించింది. అలాగే నిరుడు జూన్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 7 వరకు లెక్కించినా రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువే నమోదైందని గణాంకాలు చెప్తున్నాయి. ఈ కాలంలో సాధారణ వర్షపాతం 86.6 సెంటీమీటర్లు కాగా, 91. 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 5 శాతం అధికం. మొత్తంగా జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్ మినహా మిగతా 31 జిల్లాల్లో సాధారణం లేదా అంతకన్నా ఎక్కువ వర్షాలు పడినట్టు నివేదిక స్పష్టం చేస్తున్నది. ఇందులో 6 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఇలా వానలు పడినప్పుడు వరద ప్రవాహాన్ని సముద్రం పాలు కాకుండా ఒడిసిపట్టుకున్న పాలకులే ప్రజలను సుభిక్షంగా పాలించగలుగుతారు.
కాకతీయులు గొలుసుకట్టు చెరువుల ద్వారా నీటి నిల్వలను కాపాడి ప్రజల మన్ననలు పొందగలిగారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ చేసి, ప్రాజెక్టులను నిర్మించి వరద నీటిని ఒడిసి పట్టగలిగారు. ఇలా ఒడిసిపట్టిన నీటిని పక్కా ప్రణాళికతో పొదుపుగా వినియోగిస్తేనే పచ్చని పంటలు పండుతాయి. పదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే అనుసరించింది. ‘టెయి ల్ టు ఎండ్’ విధానాన్ని అనునసరించి ప్రాజెక్టుల్లో నీటిని విడుదల చేసింది. ఫలితంగా చివరి ఆయకట్టుకు నీరంది, ఒక్క ఎకరా కూడా ఎండిపోలేదు. పైగా భూమికి బరువయ్యేంత పంట దిగుబడి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ నీటి ప్రణాళికనే గతి తప్పింది. పాలకుల అవగాహన రాహిత్యానికి అధికారుల నిర్లక్ష్యం తోడవడంతో రైతులు నట్టేట మునిగారు.
నీటి ప్రణాళికను అనుసరించకుండా పైరవీల ద్వారా ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసే దుస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి ఎస్సారెస్పీలో 78.66 టీఎంసీలు, మిడ్మానేరులో 23 టీఎంసీలు, ఎల్ఎండీలో 19.42 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 16.03 టీఎంసీలు, సింగూరులో 25.81 టీఎంసీలు, నిజాంసాగర్లో 16.16 టీఎంసీలు, కడెంలో 4.3 టీఎంసీలు, శ్రీశైలంలో 57టీఎంసీలు, నాగార్జునసాగర్లో 157 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్న ది. ఈ నీటిని సరైన ప్రణాళికతో సద్వినియోగం చేసుకుంటే ఈ రోజు కరువు పరిస్థితి ఉండేది కాదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే, అంటే 2023 డిసెంబర్ 13న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో అన్ని డిస్ట్రిబ్యూటరీ కాలువలకు నీటిని విడుదల చేసేందుకు నీటి పారుదల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఆ సమయానికి ప్రాజెక్టులో 77.43 టీఎంసీల నీరున్నది. నీటి లభ్యత ను బట్టి దాదాపు 94 డిస్ట్రిబ్యూటరీలకు 64.18 టీఎంసీల నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
నీటి విడుదలకు డీ1 నుం చి డీ 53 వరకు జోన్-1గా, డీ 54 నుంచి డీ 94 వరకు జోన్-2గా నిర్ణయించుకున్నారు. జోన్-1కు 3,500 క్యూసెక్కుల చొప్పున 7 సార్లు, జోన్-2కు 5,500 క్యూసెక్కుల చొప్పున 8 సార్లు సీజన్ మొత్తంలో 105 రోజులు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. జోన్-1 పరిధిలో డిసెంబర్ 18న, జోన్-2 పరిధిలో డిసెంబర్ 25న నీటిని విడుదల చేసిన అధికారులు… ఒక్కో జోన్కు 7 విడతల్లో ఏప్రిల్ 6 వరకు నీటిని విడుదల చేయాలని ప్రణాళిక రూపొందించారు. కానీ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి షెడ్యూల్కు ముందే నీటిని ఖాళీ చేశారు. ఫలితంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో చివరి ఆయకట్టుకు నీరందక వేలాది ఎకరాల పంట ఎండిపోయి, రైతులు పశువులను మేపుకొంటున్నారు.
రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీళ్లున్నా.. ప్రణాళిక గతి తప్పి నీటి వృథాతోనే ఎక్కువ నష్టం జరిగింది. కర్ణాటకలో నీటిని వృథా చేస్తే ప్రజలకు రూ.5 వేల జరిమానా విధిస్తున్న ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇక్కడ 50 టీఎంసీల నీరు సముద్రం పాలు కావడానికి బాధ్యులెవరో చెప్పాలి. అలాగే బక్క పలుచని కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు బక్క రైతులను బలిపీఠం ఎక్కిస్తున్న కాంగ్రెస్ కుట్రలను కూడా ప్రజలు గమనించాలి. సాక్షాత్తు నీటి పారుదల శాఖ మంత్రి సొంత జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి వినియోగానికి అవకాశం ఉన్నా ప్రభుత్వం పంటలకు నీళ్లివ్వలేదు.
ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ‘పెద్ద నీరటి’గా వ్యవహరిస్తూ రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్న కేసీఆర్.. ప్రతిపక్షనాయకుడిగా మరోసారి రైతులకు బాసటగా నిలిచారు. కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వేదికగా రైతు ఉద్యమానికి పిలుపునివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. కేసీఆర్ పర్యటించిన 24 గంటల్లోనే నాగార్జునసాగర్ ఎడమ కాల్వ గేట్లు తెరుచుకున్నాయి. తన తదుపరి పర్యటన కరీంనగర్కే అని చెప్పిన కొద్ది గంటల్లోనే పనికిరాదన్న కాళేశ్వరంలో బాహుబలి మోటర్లు గర్జించాయి. ఎస్సారెస్పీ వరద కాల్వలోకి జలాలు ఉప్పొంగాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మల్లన్నసాగర్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో నీళ్లున్నా కాంగ్రెస్ ప్రభు త్వం పంటలకు నీళ్లివ్వలేదు. రైతులతో కలిసి మల్లన్నసాగర్ను ముట్టడిస్తామని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చిన రెండు గంటల్లోనే కూడవెల్లి వాగులోకి మల్లన్నసాగర్ నుంచి 800 క్యూసెక్కుల నీరు విడుదలైంది. నీటి వినియోగంపై కనీస అవగాహన లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎండని చేను లేదు.. ఏడ్వని రైతు లేడంటే అతిశయోక్తి కాదు. అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని రాష్ట్ర రైతాంగం మండిపడుతున్నది.
-మారెడ్డి సంజీవకుమార్
91827 77465