Rahul Rama Krishna | టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు ఇటీవల రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఆయన అడిగిన ప్రశ్నలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో పాటు, జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానుల నుంచి తీవ్ర స్పందనకు దారితీశాయి. ఎక్స్ వేదికగా రాహుల్ రామకృష్ణ కొన్ని ప్రశ్నలను సంధించారు. తాను పవన్ కళ్యాణ్ అభిమానినేనని, అందుకే ప్రజాప్రతినిధిగా ఆయనను ప్రశ్నించే హక్కు తనకు ఉందని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం (RTI) అమలు, వివిధ శాఖల్లో సమాచార బహిర్గతం, పీసా (PESA) చట్టం అమలు, 1/70 గ్రామసభ చట్టం అమలు పరిస్థితులు, అటవీకరణ కార్యక్రమాల ఫలితాలపై వివరణ ఇవ్వాలని కోరారు. తాను రాజకీయ విమర్శలు చేయడం కాదని, ప్రజలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు కావాలని మాత్రమే అడుగుతున్నానని పేర్కొన్నారు.
రాహుల్ పోస్టులు వైరల్ కావడంతో పవన్ అభిమానులు, జనసేన మద్దతుదారులు పెద్ద ఎత్తున స్పందించారు. కొందరు ఆయనపై విమర్శలు గుప్పించగా, మరికొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రాహుల్ మరో ట్వీట్ చేస్తూ, “ప్రశ్నించినంత మాత్రాన నేను దేశద్రోహిని కాను” అని పేర్కొన్నారు. అలాగే తన సినిమాల్లోని ప్రముఖ డైలాగ్ను ప్రస్తావిస్తూ “నా వల్లే సమస్య అయితే నేనెళ్లిపోతా” అంటూ సరదా వ్యాఖ్య కూడా చేశారు.అయితే తర్వాత ఆయన చేసిన కొన్ని పోస్టులు ఎక్స్ టైమ్లైన్లో కనిపించకపోవడంతో అవి తొలగించారా అనే చర్చ మొదలైంది.మరోవైపు తనపై జరిగిన ట్రోలింగ్పై స్పందిస్తూ రాహుల్ మరోసారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నేను అడిగిన ప్రశ్నలకు ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేదు. గొడవలు, విమర్శలు, వ్యక్తిగత దూషణలు మాత్రమే వచ్చాయి. అందుకే వివాదం పెరగకూడదని అనుకున్నాను అని పేర్కొన్నారు. రాహుల్ రామకృష్ణపై కొందరు నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తూ, ఆయన మద్యం మత్తులో పోస్టులు పెడుతున్నారని కామెంట్లు చేశారు.దీనికి కౌంటర్గా రాహుల్ స్పందిస్తూ, “120 పదాల ట్వీట్ రాయాలంటే తప్పనిసరిగా మత్తులో ఉండాలని నమ్మే వారి కోసం ఎక్స్ ప్రత్యేకంగా బ్రీత్ అలైజర్ ఫీచర్ తీసుకురావాలి” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ సమస్యలపై ఓ నెటిజన్ వీడియో షేర్ చేశారు. దానిపై స్పందించిన మరో పవన్ అభిమాని రాహుల్ రామకృష్ణను ట్యాగ్ చేస్తూ “ఇప్పుడు ప్రశ్నించే ధైర్యం ఉందా?” అని ప్రశ్నించారు.
దీనికి రాహుల్ సమాధానంగా, “గతంలో కొన్ని సాధారణ ప్రశ్నలు అడిగినప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ప్రశ్నించే ధైర్యం ఇప్పటికీ ఉంది. కానీ ఇప్పుడు ఓపిక తగ్గింది. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఒంటరిగా నిలబడాల్సి వస్తోంది” అని పేర్కొన్నారు.రాహుల్ రామకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. కొందరు ఆయన ప్రశ్నించే హక్కును సమర్థిస్తుండగా, మరికొందరు పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.