Global Hunger Index | నలుగురున్న ఓ కుటుంబంలో ముగ్గురికే సరిపడా అన్నం ఉంటే.. ‘నాకు ఆకలిగా లేదు’ అంటుంది అమ్మ. తాను కడుపు మాడ్చుకొని పిల్లల ఆకలి తీరుస్తుంది. పస్తులుంటూ.. పచ్చడి మెతుకులు తింటూ మన కడుపు నింపే అమ్మ నేడు పోషకాహార లోపంతో బాధపడుతుండటం అత్యంత విషాదకరం.
ప్రపంచమంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వైపు పరుగులు పెడుతుండగా.. చాలా దేశాల్లో ఇప్పటికీ అనేకమంది ఒక్క పూట తిండి కోసం అలమటిస్తున్నారు. సరైన తిండి దొరక్క పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఐదేండ్లలోపే చిన్నారులు మృత్యువాతపడుతున్నారు. మన దేశంలోనూ ఆకలితో అలమటించే వారి సంఖ్య భారీగానే ఉన్నది. పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిలో మహిళలే అత్యధికం కావడం గమనార్హం.
ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్)లో భారత్ స్థానం ఆందోళన కలిగిస్తున్నది. 125 దేశాలకు సంబంధించి ఇటీవల విడుదలైన ఈ సూచీలో భారత్ 111వ స్థానం దక్కించుకున్నది. ప్రపంచ ఆకలి సూచీ-2023లో 28.7 స్కోరు సాధించిన మన దేశం ‘తీవ్రమైన’ విభాగంలో పేద దేశాల సరసన నిలిచింది. 2000 సంవత్సరంలో విడుదలైన సూచీలో 38.4 స్కోరుతో ‘ప్రమాదకర’ స్థాయిలో ఉన్న భారత్ 2008లో 35.5 స్కోరుతో కాస్త మెరుగైంది. అయితే 2008తో పోలిస్తే 2015లో 29.2 స్కోరుతో ఏడేండ్లలో గణనీయమైన వృద్ధి సాధించింది. కానీ 2015తో పోల్చి చూస్తే ప్రస్తుత (2023) సూచీలో పెద్ద వ్యత్యాసం కనిపించడం లేదు. ఈ ఎనిమిదేండ్లలో 0.5 స్కోరును మెరుగుపరుచుకున్న భారత్ 28.7తో సరిపెట్టుకున్నది. 2015 నాటి సూచీతో పోలిస్తే కాస్త మెరుగ్గా కనిపిస్తున్నా .. గణనీయమైన వృద్ధి నమోదు కాలేదు.
యూరోపియన్ యూనియన్కు చెందిన ఎన్జీవోలు రూపొందించిన ఈ సూచీ ప్రధానంగా నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. పోషకాహార లోపం, ఐదేండ్లలోపు చిన్నారులు వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం, ఐదేండ్లలోపు చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, చిన్నారుల మరణాల రేట్లను పరిగణనలోకి తీసుకొని ప్రపంచ ఆకలి సూచీని రూపొందించారు.
అయితే ఎప్పటికప్పుడు ప్రపంచ ఆకలి సూచీ నివేదికలను కొట్టిపారేస్తున్న భారత్ ఈసారి కూడా అదే పని చేసింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ నివేదిక శాస్త్రీయతను ప్రశ్నించారు. ప్రపంచ ఆకలి సూచీ భారత్లోని పరిస్థితులను ప్రతిబింబించవని ఆమె పేర్కొనడం విడ్డూరం. మూడు వేల మందిపై చేసిన సర్వే ఆధారంగా 140 కోట్ల జనాభా ఉన్న భారత్లో పరిస్థితులను అంచనా వేయలేరని వ్యాఖ్యానిస్తూ దేశంలోని వాస్తవ పరిస్థితులను మంత్రి విస్మరించారు. మరో అడుగు ముందుకేసి ‘నేను రాత్రి 10 గంటలకు భోజనం చేస్తాను. ఆ సమయం కంటే ముందే ఫోన్ చేసి మీకు ఆకలిగా ఉందా? అని ప్రశ్నిస్తే.. అవుననే సమాధానమే చెప్తాను’ అని వ్యాఖ్యానించడాన్ని చూస్తే ప్రపంచ ఆకలి సూచీని మోదీ సర్కార్ ఎంత తేలిగ్గా తీసుకుంటున్నదో అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఆకలితో అలమటించేవారు లేరని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా.. 80 కోట్ల మంది భారతీయులకు మరో ఐదేండ్ల పాటు ఉచిత రేషన్ సరఫరా చేయాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోవడమే దేశంలో ఒక్క పూట తిండి కోసం అర్రులు చాస్తున్న వారు ఉన్నారనడానికి నిదర్శనం.
మన దేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది. 2015లో మొత్తం జనాభాలో 14 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతుండగా.. 2023 నాటికి ఈ సంఖ్య 16.6 శాతానికి పెరిగింది. కాగా, ఎత్తుకు తగ్గ బరువు లేని చిన్నారుల శాతం 18 నుంచి 18.7కు పెరిగింది. అయితే వయసుకు తగ్గ ఎత్తు లేని చిన్నారులు, చిన్నారుల మరణాల శాతం తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశం.
వరల్డ్ బ్యాంకు లెక్కల ప్రకారం.. 2014-2018 మధ్యకాలంలో పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. కానీ 2018 నుంచి ఈ సంఖ్య పెరిగింది. కొవిడ్-19 కారణంగా చాలామందికి సరైన పోషకాహారం లభించకపోవడమే దీనికి కారణంగా తెలుస్తున్నది. 2017-2021 మధ్యకాలంలో 24 శాతం పెరుగుదలతో పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య 17.63 కోట్ల నుంచి 22.43 కోట్లకు చేరుకున్నది.
ఆందోళన కలిగించే విషయం ఏమంటే పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటుడటం. దేశంలోని 50 శాతం కంటే తక్కువ మంది మహిళలే మాంసం, చేపలు, గుడ్లు, విటమిన్-ఏ లభించే పండ్లు, పదార్థాలు తినగలుగుతున్నారు. మన దేశంలో సుమారు 40 శాతం మంది శాఖాహారమే తీసుకుంటారు. 40 శాతం మంది పురుషులు మాంసం, చేపలు, గుడ్లకు దూరం కాగా, 54 శాతం మంది మహిళలు ఈ ఆహార పదార్థాలకు దూరమవుతున్నారు. అయితే సంప్రదాయాలు, విశ్వాసాలు దీనికి కారణం కావచ్చు.. కానీ, పేదరికం వల్ల కూడా మాంసాహారానికి దూరమవుతున్నవారు లేకపోలేదు. మరోవైపు 2021లో మొత్తం మహిళల్లో 28 శాతం, పేదవారిలో 47 శాతం మంది పాల ఉత్పత్తులు కూడా తినలేకపోయారు. ప్రభుత్వ పథకాల కారణంగా గర్భిణుల్లో ఈ శాతం కాస్త మెరుగ్గా ఉంది. అదే సమయంలో మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువగా పోషకాహార పదార్థాలను తింటున్నారు. అసమానత్వం, లింగ వివక్ష దీనికి ప్రధాన కారణంగా తెలుస్తున్నది. పోషకాహార లోపం కారణంగా మహిళలు రక్తహీనత, అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అన్నపూర్ణగా అందరి ఆకలి తీర్చే ‘అమ్మ’ కడుపు నిండా పౌష్టికాహారం ఎప్పుడు తింటుందో?
– ఎడిటోరియల్ డెస్క్