స్త్రీ.. జీవన గమనంలో నేస్తమై.. బాధలలో కన్నీళ్ళు తుడిచే తోబుట్టువై.. మనసు భారమైనప్పుడు వెన్నుతట్టి తోడయ్యే భార్యయై.. కష్టాల్లో నీ చేయి విడువని అండై.. పురిటి నొప్పులు తెలియని పురుష జాతికి తైల్లె.. గెలుపులో వెనకుండి, కడగండ్లలో తోడుండి.. ఎల్లప్పుడూ పక్కనుండేది స్త్రీ. అటువంటి స్త్రీని ఆటబొమ్మలా చూసే రోజులు పోవాలి. చూసే కళ్ళలో, మనసులో మార్పు వచ్చి తీరాలి. నిర్భయ చట్టాలకు మించిన కఠిన శిక్షలు అమలులోకి రావాలి. స్త్రీల వెనుకబాటుతనానికి అతి ముఖ్య కారణం పితృస్వామ్య వ్యవస్థ. ఆదిమ సమాజంలో మాతృస్వామ్యం ఉంది. వ్యవసాయ ప్రాధాన్యత గల గణాలలో మాతృస్వామ్యం, పశుపాలక గణాలలో పితృస్వామ్యం కనిపిస్తుంది. పశుపాలక గణాలకు చెందిన ఆర్యులలో పితృసామ్యవ్యవస్థ ఉంది. భారతదేశంలోకి ఆర్య గణాలు రాక ముందు మాతృస్వామ్య నాగరికత ఉనికిలో ఉన్నట్టు చరిత్ర నిరూపించింది. స్త్రీలు ఉత్పత్తి పరికరాలకు దూరమై, పురుషులు వాటిపై ఆధిపత్యం చెలాయించడంతో మొదలైన బానిస వ్యవస్థతో క్రమంగా పురుషాధిక్యత ఏర్పడింది. అయితే, ఆధునిక కాలంలో క్రమేణా మార్పులు వచ్చాయి. అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. ఆమె గెలుపును, ప్రగతిని ఆపటం ఎవరి తరము కాదు.
(వ్యాసకర్త: తెలుగు ఉపాధ్యాయురాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్)
-స్వప్న కొండ