ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాలు స్వేచ్ఛాయుత భావప్రకటనా సాధనాలుగా ప్రాచుర్యం పొందాయి. ప్రజల మధ్య స్నేహ సంబంధాల నిలయంగా గుర్తింపు పొందాయి. కానీ, నేడు సామాజిక మాధ్యమాలే కేంద్రంగా కుప్పలు తెప్పలుగా అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారమవుతున్నాయి. రాజ్యాంగ వ్యవస్థలనూ వదలకుండా విలువ, స్వయం ప్రతిపత్తి తగ్గించే ఉద్దేశపూర్వక వ్యాఖ్యలకు వేదికలవుతున్నాయి.
ప్రజా సంఘాల మధ్య వైషమ్యాలు ఏర్పడేలా నకిలీ వార్తలు, మహిళ, అల్పసంఖ్యాక వర్గాల జీవన, గౌరవ, భద్రతలకు ప్రమాదం వాటిల్లేలా సందేశాలు సామాజిక మాధ్యమాల్లో నిత్యం స్వైర విహారం చేస్తూనే ఉన్నాయి. రాజకీయ వర్గాలు (పార్టీ)లు వాటి ప్రభావం కోసం, పాలక వర్గాలు అసమ్మతి స్వరాలను అణచివేయడానికి నిఘా నేత్రాలు, వేధింపులు, బూటకపు కథనాలను చూస్తున్నాం, వింటున్నాం. వ్యక్తిగత గోప్యతకు తిలోదకాలిస్తూ కట్టుతప్పుతున్న మాధ్యమాలను నియంత్రించడం అత్యావశ్యకమైంది. ఒకరకంగా చెప్పాలంటే సామాజిక మాధ్యమాల ప్రవాహంలో నేటితరం యువత కొట్టుకుపోతున్నది. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, కంప్యూటర్ల వినియోగానికే అత్యధిక సమయం కేటాయిస్తున్నది. రాత్రీ పగలు తేడా లేకుండా ఎక్కువ కాలం వాటిలోనే గడుపుతున్నది. దీంతో వారు మానసిక రుగ్మతల పాలవుతున్నారు. విచక్షణ కోల్పోయి హింసాత్మక సంఘటనలకూ వెనకాడటం లేదు.
ఇదిలా ఉంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సామాజిక మాధ్యమాల మూలంగా మనుషులు, కుటుంబాల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ఈ సమస్య ఎంత తీవ్రతరమైందంటే? పొద్దస్తమానం వాటిలోనే తలమునకలై వాటికి బానిసలయ్యేంత. ఫలితంగా బంధాలు, అనుబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. విద్యార్థులైతే చదువులో ఆసక్తి తగ్గి విలువైన భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత తమ లక్ష్యాన్ని, కుటుంబ బాధ్యతలను విస్మరిస్తున్నారు. అత్యంత విలువైన తమ జీవితాలు వారి చేతుల్లో లేకుండా, సామాజిక మాధ్యమాల చక్రబంధంలో చిక్కుకుపోతున్నాయి.
అసలు మనం సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండలేమా? ప్రజలారా ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించండి. మన చేతుల్లో మనం ఉన్నామా ఒకసారి సమీక్షించుకోండి. సామాజిక మాధ్యమాల భ్రమలో పడిపోయి విలువైన కాలాన్ని వృథా చేయటంతో ఏం సాధించగలుగుతున్నాం? రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ ఉపకరణాల వినియోగం వల్ల సమాజానికి మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతున్నదని నిపుణులు చెప్తున్నారు. సామాజిక మాధ్యమాలకు, ఆన్లైన్ ఆటలకు బానిసలవుతున్న పిల్లలు, యువత వాస్తవ ప్రపంచానికి దూరంగా, బంధాలు, బాధ్యతలను విస్మరిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ ఆధునిక టెక్నాలజీతో సహజసిద్ధ సృజనాత్మకత, వినూత్నత, క్రియేటివిటీ తగ్గిపోతున్నది. తన యూట్యూబ్ ఛానల్కు వ్యూస్ పెరగడం లేదని, లైకులు రావడం లేదని, షేర్ చేయడం లేదని మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు వింటుంటే ఈ సమాజం ఎటుపోతున్నదోనని బాధేస్తున్నది. కొన్ని నగరాలు, పట్టణాలలో ప్రత్యేకంగా ‘స్మార్ట్ ఫోన్ డీ అడిక్షన్ సెంటర్’లు ప్రారంభమవుతున్నాయంటే సామాజిక మాధ్యమాల తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
యుద్ధంలో వందలాది మంది వీరులను చంపడం కన్నా.. తన మనసును తాను ఆధీనంలో ఉంచుకునేవాడే నిజమైన వీరుడు. తనను తాను వశపరచుకోగలిగిన మనిషిని శత్రువు (దేవత)లు సైతం ప్రభావితం చేయలేరు. ఆ వ్యక్తి విజయాలను అపజయాలుగా మార్చలేరు. కాలాన్ని వృథా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. ఈ వాస్తవాన్ని నేటితరం యువత గ్రహించాలి. కట్టు తప్పుతున్న సామాజిక మాధ్యమాలను కఠిన చట్టాలతో నియంత్రించాల్సిన అవసరం సంబంధిత అధికారులపై ఉన్నది.
‘నేనెందుకు ఓడిపోతున్నాను’ అని మనిషి అడిగిన ప్రశ్నకు ‘ఎండ, వాన కాళరాత్రి, కఠినమైన పరిస్థితి.. ఏదైనా రానీ, నేను ఆగక నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడూ ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచిచూడు ఎప్పటికీ ఓడిపోవు’ అని కాలం సమాధానం చెప్పింది. రాజుకైనా, పేదకైనా, ధనవంతుడికైనా, దరిద్రుడికైనా కాలం రోజుకు 24 గంటలే. దాన్ని వినియోగించుకొని విజయం సాధించడం మన చేతుల్లోనే ఉంటుంది. అత్యంత విలువైన కాలాన్ని ఈ సామాజిక మాధ్యమాల్లో కరగనివ్వకండి. మీ విలువైన జీవితాలకు సార్థకత చేకూరాలంటే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాల్సిందే.
(వ్యాసకర్త: సామాజిక విశ్లేషకులు)
మేకిరి దామోదర్
95736 66650