మానవ జాతి అభివృద్ధి చెందుతూ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఎదుగుతున్నప్పటికీ నాగరికత మూలాలను, సంస్కృతి సాంప్రదాయాల్ని మరవకూడదు. వాటిని జాతరలు, పండుగల ద్వారా ముందు తరాలకు పరిచయం చేయాలి. పండుగలు, జాతరల ద్వారా సంస్కృతి సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. అయితే ఈ విషయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దక్షిణాదిపై వివక్ష చూపిస్తున్నది. దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలన్న డిమాండ్పై మీనమేషాలు లెక్కిస్తున్నది. ఇది తెలంగాణ ప్రజలను ఆగ్రహానికి, అసంతృప్తికి గురి చేస్తున్నది.
భారత్ లాంటి భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబించే దేశంలో అన్ని మతాల వారు కలిసి మెలిసి పండుగలు జరుపుకోవడం ఒక విశిష్ట లక్షణం. కుంభమేళా తర్వాత అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా గుర్తింపు పొందింది. భక్తుల చిరకాల కోరికైన మేడారం జాతరకు జాతీయ హోదా కేంద్రం చిన్నచూపుతో ఇంకా కలగానే ఉంది. ఇప్పటికే ఏ నోట విన్నా మేడారం ముచ్చట్లే. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా, విన్నా మేడారం జాతర సందడి కనిపిస్తున్నది. ఫిబ్రవరి 21న మొదలయ్యే మేడారం జాతర నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది.
కుంభమేళా తర్వాత అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే ఈ జాతరకు తెలంగాణలో పాటు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర పొరుగు రాష్ర్టాల నుంచే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు, సందర్శకులు తరలి వస్తారు. లక్షలాది మంది జనంతో ఆ నాలుగు రోజులు మేడారం వనమంతా జన సంద్రంగా మారుతుంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిచ్చే క్రమంలో స్వరాష్ట్రంలో బోనాలు, బతుకమ్మలను రాష్ట్ర పండుగలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించింది. ఆ క్రమంలోనే 2014లోనే మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించి తెలంగాణ సంస్కృతి, పండుగల వైభవానికి కృషి చేసింది.
మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి కనీస స్పందన లేకుండా పోయింది. ఉత్తరాది రాష్ర్టాలకు సంబంధించిన పండుగలకు, జాతరలకు జాతీయ హోదా కల్పిస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ర్టాలపై వివక్ష చూపుతున్నది. గంగ, ప్రయాగ కుంభ మేళాలకు జాతీయ హోదా ఇచ్చిన మోదీ సర్కార్ తెలంగాణలో జరుగుతున్న మేడారం గిరిజన జాతరను విస్మరించింది.
గతంలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి హోదాలో మేడారం జాతర సందర్శించిన అర్జున్ ముండా మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించడం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. కుంభ మేళాలకు కోట్లాది రూపాయలు కేటాయించే కేంద్రం తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు తగిన నిధులు కేటాయించకపోవడంపై తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకురావడంతో పాటు కేంద్ర నిధులు వచ్చేలా కృషి చేయాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నప్పటికీ ఆయన నుంచి తగిన ప్రయత్నం కనిపించడం లేదు. ఈ ఏడాది జరిగే మేడారం జాతర అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా రూ.100 కోటన్లు కేటాయించి చేతులు దులుపుకుంది. కేంద్రమైతే ఈసారి నయా పైసా నిధులు కూడా కేటాయించకపోవడం బాధాకరం. తెలంగాణ నుండి బీజేపీ, కాంగ్రెస్ల తరపున లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు మేడారం జాతరకు నిధుల సాధనపై దృష్టి సారించకపోవడం వారి చిత్తశుద్ధి లేమిని నిరూపిస్తున్నది.
మేడారం జాతరకు వచ్చే భక్తుల మనోభావాలను, రాష్ట్ర ప్రజల అభ్యర్థనను గౌరవించి కేంద్రం వెంటనే మేడారానికి జాతీయ హోదా కల్పించాలి. కనీసం రూ.200 కోట్ల నిధులు కేటాయించాలి. ఆదివాసీలను ఎన్నికల్లో ఓటు బ్యాంకులాగా మాత్రమే చూడకుండా వారి పండుగలు, జాతరలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నాగరికతకు మూలమైన వారి ఆచారాలను గౌరవించాలి. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 9.3 శాతంగా ఉన్న ఆదివాసీ గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించడమే కేంద్ర ప్రభుత్వ తక్షణ కర్తవ్యం కావాలి.
కొనుకటి ప్రశాంత్
80084 92700