వర్ధమాన దేశాల వనరులు కొల్లగొట్టేందుకు పోటీ పడుతుంటాయి సామ్రాజ్యవాద దేశాలు! తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు, పెట్టుబడిదారీ దేశాలు ముదిరి సామ్రాజ్యవాద దేశాలుగా విస్తరిస్తాయి. అవి ఆయా దేశాల్లో తమ అనుకూల ప్రభుత్వాలను బలపరుస్తూ, అడ్డం తిరిగిన వాటిని కూల్చేస్తుంటాయి. ఈ విద్యలో ప్రపంచాగ్ర రాజ్యంగా ఆరితేరింది అమెరికా!
‘ప్రజాస్వామ్యం-స్వేచ్ఛ-పౌరహక్కులను, పవిత్ర ఆశయాలు’గా తన రాజ్యాంగంలో పొందుపరుచుకున్న అమెరికా, కారుచౌకగా చమురును కొల్లగొట్టేందుకు అరబ్బు దేశాల్లో మాత్రం తన చెప్పుచేతల్లో ఉండే నియంతలను ప్రోత్సహిస్తూ, అక్కడి ప్రజాస్వామ్య ఉద్యమాల అణచివేతకు తోడ్పడుతుంది. తాను పెంచి పోషించిన నియంతలు, ఉగ్రవాదులైనా సరే, తమకు అడ్డం తిరిగినప్పుడు తన మీడియా ద్వారా వాళ్లను భయానక నియంతలుగా, లోకకంటకులుగా డప్పు వేయించి మరీ హతమార్చుతుంది అమెరికా.
ఉదాహరణకు గతంలో అఫ్గానిస్థాన్ నుంచి రష్యాను వెళ్లగొట్టేందుకు బిన్లాడెన్ నేతృత్వంలోని అల్ఖైదాను పోషించిన అమెరికా, అది బూమరాంగై ట్విన్ టవర్స్ను కూల్చాక, వేటాడి మరీ బిన్లాడెన్ను హతమార్చింది. అలాగే ఆయా దేశాల్లో తనకు వ్యతిరేకంగా వ్యవహరించే ప్రభుత్వాలను కూల్చటానికైనా, సదరు నేతలను హతమార్చటానికైనా వెనుకాడదు. అందుకు తనను అడ్డుకునే ఐరాస తీర్మానాలనైనా, మెజారిటీ దేశాల అభ్యంతరాలనైనా, అంతర్జాతీయ న్యాయస్థానాల తీర్పులనైనా, తన వీటో పవర్తో అడ్డుకుంటుంది. అందుకు అనేక ఉదాహరణలున్నాయి. అయినా సరే, తన చమురు దోపిడీని అడ్డుకుంటున్న ఇరాక్ నేత సద్దాం హుస్సేన్ను, లిబియా నేత గడాఫీని కిరాతకంగా హతమార్చింది అగ్రరాజ్యం. క్యూబా నేత ఫిడెల్ క్యాస్ట్రో తదితర నేతలపై పలుమార్లు హత్యాయత్నం చేయించింది.
ప్రపంచ చమురు నిక్షేపాల్లో 66 శాతం మధ్యధరా ప్రాంతంలోనే ఉన్నాయి. పాలస్తీనాతో సహా అక్కడున్నవన్నీ అరబ్ దేశాలే. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ మారణకాండ, ఐరోపా దేశాల దాడులతో తల్లడిల్లిన యూదులు తమ పూర్వీకుల నివాసమంటూ పాలస్తీనాకు చేరి, అరబ్బుల ఆశ్రయాన్ని పొందారు. బ్రిటన్ సహకారంతో పాలస్తీనాలోనే ఒక పక్కన యూదు రాజ్యాన్ని (ఇజ్రాయెల్) నెలకొల్పుకొన్నారు. క్రమంగా ఐరాస పరిధిలోని జెరూసలేంతో సహా 78 శాతం పాలస్తీనాను దురాక్రమించింది ఇజ్రాయెల్.
హమాస్ ఉగ్రవాదులను హతమార్చడమే మా లక్ష్యమంటూ, గాజాపై నిర్విరామంగా బాంబుల వర్షం కురిపిస్తున్నది ఇజ్రాయెల్. నాడు హిట్లర్ మారణకాండకు బలైన యూదుల వారసులు.. నేడు అంతకన్నా కిరాతకంగా అరబ్బులను హతమార్చడం శోచనీయం. ఇప్పటికే అక్కడ 25 వేల మంది చనిపోగా,65 వేల మందికిపైగా క్షతగాత్రులయ్యారు.
ఇజ్రాయెల్ మారణకాండను ఐరాసలో అమెరికా, 40కి పైగా దాని మిత్రదేశాలు సమర్థించినా, 153 దేశాలు తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని దక్షిణాఫ్రికా ఆశ్రయించడం గమనార్హం. ఉగ్రవాదుల నిర్మూలన కోసమే ఇజ్రాయెల్కు అండగా నిలుస్తున్నామంటూ సమర్థించుకుంటున్న అమెరికా.. 1990ల్లోనే ‘టెర్రరిస్టు స్టేట్’గా ఐరాస ప్రకటించిన ఇజ్రాయెల్కు ఆర్థిక, ఆయుధ సహాయం ఎందుకు చేస్తున్నది?
హమాస్ ఉగ్రవాదులను హతమార్చటానికే మా దాడులు అని అంటున్నా, గాజా, వెస్ట్బ్యాంక్లలోని అరబ్బులను హతమార్చి, వెళ్లగొట్టి, పాలస్తీనాను సంపూర్ణ యూదు రాజ్యంగా మార్చాలన్నదే ఇజ్రాయెల్ ఆంతర్యం. ఐరాస, అంతర్జాతీయ న్యాయస్థానాలు సైతం అసహాయులుగా మారిన నేపథ్యంలో, తలుపులన్నీ మూసి కొట్టబోతే పిల్లే, పులిలా తిరగబడిన విధంగా పాలస్తీనా విముక్తి కోసం తిరగబడ్డ గెరిల్లా యోధుల బృందమే హమాస్. అటువంటి హమాస్ మిలిటెంట్లు 5 వేల మందిని బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నది ఇజ్రాయెల్. వాళ్లను విడిపించుకునే లక్ష్యంతోనే 253 మంది ఇజ్రాయెల్ వాసులను బందీలుగా గాజాకు తీసుకెళ్లింది. ‘మా మిలిటెంట్లను వదలండి, మీ వాళ్లను వదిలిపెడతాం’ అని షరతు పెట్టింది హమాస్.
ఇప్పటిదాకా ఇది పాలస్తీనా సమస్య కదా, మనకెందుకనుకున్న తక్కిన అరబ్ దేశాలకూ జ్ఞానోదయమవుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ మారణకాండకు తాళలేక.. గాజా, వెస్ట్బ్యాంక్లోని అరబ్బులు కూడా తమ దేశాలను ఆశ్రయిస్తే, అది తమకు మరింత భారమవుతుందని అరబ్ దేశాలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకే ఎర్రసముద్రం గుండా వెళ్లే అమెరికా, దాని మిత్రదేశాల రవాణా నౌకలపై హౌతీలు దాడి చేయగా, ఇజ్రాయెల్పై లెబనాన్కు చెందిన హిజ్బుల్లా నేరుగా దాడులకు దిగింది. జాతి వైరానికి స్వస్తిపలికి సౌదీ, ఇరాన్ సత్సంబంధాలను నెలకొల్పుకొన్నాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ నిఘా కేంద్రాలపై దాడులు చేసింది. ప్రతిగా అమెరికా, బ్రిటన్ దేశాలు హౌతీలపై దాడికి దిగాయి. ఈ పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? అన్న భయాన్ని కలిగిస్తున్నాయి.
యుద్ధాలకైనా, ఉగ్రవాదులకైనా బీజం పడేది అగ్రరాజ్యాల అత్యాశ, అణచివేత ధోరణుల వల్లనేనని స్పష్టమవుతున్నది. ‘నిరంతర అణచివేత బాధితుల్లో తెగింపునకు బీజం వేస్తుంది. రోజూ చస్తూ బతకటం కన్నా, బతకటం కోసం చద్దాం అన్న తెగింపు బాధిత హృదయాల్లో జ్వలిస్తే తద్వారా జరిగే దారుణాలను ఊహించలేం, నిరోధించలేం’ అన్నారు దార్శనిక నేత కెన్నడీ. అది అక్షర సత్యమనటానికి నిదర్శనాలివే. ప్రపంచంలోకెల్లా మిక్కిలి సమర్థవంతమైన నిఘా వ్యవస్థను కలిగిన అమెరికా, నాడు ట్విన్ టవర్స్పై అల్ఖైదా దాడి చేస్తుందని ఊహించిందా? నిరోధించగలిగిందా? అలాగే రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన క్షిపణి నిరోధక ఐరన్డోమ్ను నిఘా వర్గాలను కలిగిన ఇజ్రాయెల్.. తమ దేశంపై హమాస్ మెరుపు దాడికి దిగుతుందని ఊహించగలిగిందా? నిరోధించగలిగిందా?
అగ్రరాజ్యాధి నేతలతో సహా ప్రపంచ దేశాధినేతలంతా ఆలోచించాల్సింది యుద్ధాల గురించి కాదు, తక్షణం పాలస్తీనాకు విముక్తి కలిగించే దిశగా ఆలోచించాలి. ఆర్థిక అసమానతలను తగ్గించి, ప్రజలందరికీ కూడు, గూడు, విద్య, వైద్యాలకు భరోసా కల్పించే విధంగా ఆలోచించాలి. ఆచరించాలి. తద్వారానే ప్రపంచ శాంతి వర్ధిల్లుతుంది. ప్రపంచాధినేతలారా ఇదే, ఇదే, ఇదే సార్వత్రిక సత్యం. సర్వేజనా సుఖినో భవంతు, విశ్వశాంతిర్భవేత్!
-పాతూరి వేంకటేశ్వరరావు
98490 81889