తగిన ప్రోత్సాహం అందిస్తే.. మట్టి రేణువులు కూడా మణిమాణిక్యాలవుతాయనే సత్యం మరోసారి నిరూపితమైంది. నిజామాబాద్లోని ఓ మారుమూల గల్లీలో పుట్టిన చిన్నారి.. అనితరసాధ్యమైన కలను ఒకటికి రెండుసార్లు సాకారం చేసుకున్నది.
న్యూఢిల్లీ వేదికగా ఇటీవల జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ వరుసగా రెండోసారి విశ్వవిజేతగా అవతరించింది. 50 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఇందూరు చిన్నది.. టోర్నీ ఆసాంతం దుమ్మురేపి స్వర్ణం కైవసం చేసుకుంది. తద్వారా ప్రపంచ చాంపియన్షిప్లో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ తర్వాత మన దేశం నుంచి ఒకటి కంటే ఎక్కువ పతకాలు సాధించిన బాక్సర్గా రికార్డుల్లోకెక్కింది.
అయితే ఇదంతా ఒక్క రోజులో సాధ్యమైంది కాదు. దీనివెనుక ఆమె తల్లిదండ్రుల కృషి, కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో పాటు పట్టువదలని సంకల్పం, ఎంతవరకైనాసరే తెగించి కొట్లాడుదామనే ఆ అమ్మాయి నైజం ప్రధాన పాత్ర పోషించాయి. ‘ఆడపిల్లకు బాక్సింగ్ అవసరమా.. ముఖానికి గాయాలైతే ఎవరు పెండ్లి చేసుకుంటారు?’ అనే ఇరుగు పొరుగు మాటల నుంచి.. గాయాలే తన ఆటకు ఆభరణాలు అనేంతవరకు ఆ అమ్మాయి సాధించిన ప్రయాణం యువతరానికి ఆదర్శ మార్గం.
మనదేశంలో మహిళల బాక్సింగ్ అంటే చాన్నాళ్లుగా వినిపించే ఏకైక పేరు మేరీకోమ్! ఈశాన్య రాష్ర్టాలకు చెందిన మేరీ ఇప్పటివరకు ఆరుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలవడంతో పాటు ఒలింపిక్స్లో (2012 లండన్) కాస్యం పతకం గెలుచుకుంది. ఇక టోక్యో (2020) ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన లవ్లీనా బొర్గోహై కూడా అసోంకు చెందిన అమ్మాయే కాగా.. ఈ ఇద్దరు మినహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న బాక్సర్లంతా దాదాపు హర్యానాకు చెందినవాళ్లే. బివానీ బాక్సింగ్ సెంటర్ నుంచి వచ్చినవాళ్లే హవా కొనసాగిస్తున్నారు.
అలాంటి సమయంలో ఉత్తరాది ఆధిపత్యానికి తెలంగాణ సంచలనం గండికొట్టింది. అది కూడా అలా ఇలా కాదు.. ఒకటికి రెండుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచి దేశమంతా తన పేరు మారుమోగేలా చేసింది. తల్లిదండ్రుల సహకారం, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగిన నిఖత్.. 2024 పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గడమే ఏకైక లక్ష్యంగా అడుగులు వేస్తున్నది.
2019 స్ట్రాంజా మెమోరియల్ స్వర్ణంతో ప్రారంభమైన నిఖత్ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతున్నది. ఇటీవలి కాలంలో రెండుసార్లు జాతీయ చాంపియన్, రెండుసార్లు నేషనల్ చాంపియన్గా నిలిచిన నిఖత్.. నిరుడు కామన్వెల్త్ గేమ్స్లోనూ పసిడి వెలుగులు విరజిమ్మింది. తాజా ప్రపంచ చాంపియన్షిప్లో బెస్ట్ బాక్సర్ అవార్డు అందుకున్న నిఖత్.. ప్రస్తుతం దేశంలోనే అత్యుత్తమ బాక్సర్ అనడంలో అతిశయోక్తి లేదు. క్రీడా యవనికపై తెలంగాణ పేరును చిరస్థాయికి చేర్చిన నిఖత్.. వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గితే క్రీడాభిమానులకు అంతకన్నా కావాల్సిందేముంటుంది!
ఇంతియాజ్ మహమ్మద్
76609 91992