తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. దాంట్లో ప్రభుత్వ ప్రమేయం పరిమితంగా ఉంటుంది. కమిషనే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే పేపర్ లీక్ కావడమే అత్యంత బాధాకరం. దీన్ని కొంతమంది నాయకులు ఆసరాగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలుచేయడం రాజకీయ లబ్ధి కోసం పాకులాడటమే. అంతకుమించి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవటమే.
టీఎస్పీఎస్సీకి నిధులు కేటాయించడం, జాబ్ వేకెన్సీస్ ఇండెంట్ ఇవ్వడం మాత్రమే ప్రభుత్వం చేసే పని. కానీ, విధి నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు. పేపర్ లీక్ అయిందని తెలిసిన వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చి దర్యాప్తు చేయించింది. బాధ్యులను అరెస్టు చేసేవిధంగా వెంటనే చర్యలు తీసుకోవడం ఆహ్వానించదగిన పరిణామం. ఏ పరీక్ష ప్రశ్నపత్రాలైతే లీకయ్యాయని తెలిసిందో మరుక్షణమే ఆ పరీక్షలు రద్దుచేసి ప్రభుత్వం మంచి పనిచేసింది. ఇలా రద్దు చేయడం వల్ల ఎవరైతే మెరిట్తో పరీక్షలు రాస్తారో, వాళ్ల ప్రయోజనాలు కాపాడబడతాయి. కాబట్టి అభ్యర్థులు కంగారు పడవద్దు, మళ్లీ పరీక్షలు వెంటనే నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది కాబట్టి గతంలో మాదిరిగానే, అదే స్ఫూర్తి తో చదువుకొని ఆయా పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే గత ఎనిమిదేండ్లుగా ఒక్క ఆరోపణ కూడా లేకుండా వేలాది ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత టీఎస్పీఎస్సీది. ఎవరో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగిన నష్టానికి, ఉద్యోగార్థులు ఇబ్బంది పడటం బాధాకరం. ఉద్యోగార్థులు గమనించాల్సిందొక్కటే.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రాగానే ప్రభుత్వం శరవేగంతో స్పందించింది. సిట్ను నియమించి బాధ్యులైన వారిని అరెస్టు చేయించి న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టింది. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకూడదని గ్రూప్-1 ప్రిలిమ్స్ కూడా రద్దు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నది. ఇది ఉద్యోగార్థులకు బాధాకరమే అయినప్పటికీ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నదనుకోవచ్చు. ఈ నిర్ణయం ప్రభుత్వ పారదర్శకతను, నిజాయితీ, నిబద్ధతను తెలుపుతున్నది. ఈ తరుణంలో రాష్ట్రంలోని మేధోవర్గమంతా ఒకతాటిమీద నిలబడి అభ్యర్థుల్లో మనోధైర్యం నింపాల్సిన అవసరం ఉన్నది.
ఇంకో విషయం ఏమంటే… ఈ లీకేజీ వ్యవహారం కేవలం తెలంగాణకే పరిమితమైంది కాదు. గతంలో మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం టీచర్ల నియామకంలోనూ జరిగింది. గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర అనేక ఇతర రాష్ర్టాల్లోనూ లీకేజీ వ్యవహారాలు జరిగాయి. కాబట్టి ఈ సంఘటనను ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకుండా విద్యార్థులకు అండగా నిలబడాలి. గత ఎనిమిదిన్నరేండ్లుగా ఇచ్చిన హామీ కన్నా రెండింతలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగ యువత పట్ల తన నిబద్ధతను రాష్ట్ర ప్రభుత్వం చాటుకుంటున్నది. తెలంగాణ యువతకే 95 శాతం ఉద్యోగాలు దక్కాలనే సమున్నత ఆశయంతో ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తున్నది.
కొన్ని దుష్టశక్తులు, రాజకీయపక్షాలు ఈ లీకేజీ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని చూడటం అత్యంత ఖండనీయం. త్వరలోనే తేదీలను ప్రకటించి త్వరితగతిన పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాల భర్తీ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాల్సిన అవసరం కమిషన్, ప్రభుత్వంపైనా ఉన్నది. టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలిగా రాష్ట్ర ప్రజలందరికీ నా విన్నపం ఏమంటే గతాన్ని వదిలేసి భవిష్యత్తు మీద దృష్టిపెట్టడం అందరికీ మంచిది. విద్యార్థులు శ్రద్ధతో పరీక్ష రాసి, మంచి ఉద్యోగాన్ని సంపాదించి జీవితంలో స్థిరపడాలని నా ఆకాంక్ష. ఏ సంస్థ గాని, ఏ ప్రభుత్వం గాని ఇలాంటి సంఘటనలు జరగాలని కోరుకోదు. ఈ ఒక్క సంఘటనతో సర్వీస్ కమిషన్పై విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోవడం శ్రేయస్కరం కాదు.
(వ్యాసకర్త: టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు)
-డాక్టర్ బానోతు చంద్రావతి
91608 83030