తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ సమయంలోనే టీఆర్ఎస్ ముందడుగు వేసింది. పాలన ప్రజల గుమ్మం దాటాలి, ప్రజాస్వామ్యం గ్రామం.. వార్డు స్థాయిలోనే శ్వాసించాలి అనే ఆలోచనతోనే స్థానిక సంస్థల్లో వెలుగులు నింపే ప్రణాళికలకు ఆనాడే బీజం నాటింది. ఇది కేవలం రాజకీయ వ్యూహం కాదు.. భవిష్యత్తు తెలంగాణ పరిపాలనకు పునాది వేసిన ఒక చారిత్రక ఆలోచన. ఉద్యమ కాలంలో వేసిన పునాదులు, ప్రత్యేక రాష్ట్ర పాలనలో పథకాల రూపంలో ప్రజల జీవితాల్లో స్పష్టమైన వెలుగులు నింపాయి.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన వేళ, ఈ నేలపై రాజకీయాల కన్నా ముందు నిలిచిన ప్రశ్న ఒక్కటే.. ఈ కొత్త రాష్ర్టాన్ని ఎలా పాలించాలి? ప్రజల జీవితాల్లోకి పాలన ఎలా చేరాలి? ఈ ప్రశ్నకు సమాధానంగా రూపుదిద్దుకున్న నిర్ణయాలే, నేడు తెలంగాణను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ ప్రయాణంలో బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలు, కేసీఆర్ తీసుకున్న కీలక నిర్ణయాలు, పరిపాలనను ప్రజల చెంతకు చేర్చిన దిశలో మైలురాళ్లుగా నిలిచాయి. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, వాటికి తక్షణ పరిష్కారం చూపగల వ్యవస్థ కావాలన్న దృక్పథం బీఆర్ఎస్ పాలనకు మార్గదర్శకం.
బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో పెద్ద పథకాలతో పాటు, గ్రామం, వార్డు స్థాయిలో చిన్న నిర్ణయాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టులు, రైతు సంక్షేమ పథకాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలు రాష్ట్ర రూపురేఖలను మార్చాయి. కేసీఆర్ తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం స్థానిక సంస్థలను బలోపేతం చేయడం. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు అధికారాలు, బాధ్యతలు ఇవ్వడం కేవలం రాజకీయ చర్య కాదు.. ఇది సుపరిపాలన దృష్టితో చేసిన సంస్కరణ. ప్రజల సమస్యను ప్రజల మధ్యే పరిష్కరించాలన్న భావనకు ఇది ప్రత్యక్ష రూపం. ఒక రోడ్డు, ఒక కాలువ, ఒక వీధి దీపం వంటి అంశాల కోసం కార్యాలయాల చుట్టూ పరుగులు తీయాల్సిన పరిస్థితి నుంచి ప్రజలను విముక్తం చేశారు.
గ్రామం అంటే కేవలం ఓటు బ్యాంకు కాదు, స్వయం నిర్ణయ కేంద్రం అన్న భావనను కేసీఆర్ ప్రభుత్వం బలంగా ప్రతిష్ఠించింది. పట్టణాలు కేవలం జనాభా కేంద్రమే కాదు, ప్రణాళికాబద్ధ అభివృద్ధికి వేదికలుగా మారాయి. ఈ మార్పు వల్ల స్థానిక స్థాయిలో నాయకత్వం ఎదిగింది. ప్రజాస్వామ్యం రోజువారీ అనుభవంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించడం, వాటికి ఆర్థిక వనరులు కేటాయించడం, ప్రజాప్రతినిధులను పాలనలో భాగస్వాములుగా మార్చడం.. ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న చర్యలు. ఫలితంగా స్థానిక పాలన ఒక సుశిక్షణ పొందిన వ్యవస్థగా ఎదిగింది.
నాడు కేసీఆర్ నాటిన బీజాలు నేడు వ్యవస్థలుగా మారాయి. కేసీఆర్ నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాలు ప్రజల దైనందిన జీవితాల్లో కనిపించే మార్పులకు కూడా కారణమయ్యాయి. పాలన ప్రజలకు దగ్గరగా వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం బలపడుతుంది. ప్రజాస్వామ్యం బలపడినప్పుడు ప్రగతి ముందుకు సాగుతుంది. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఈ సత్యానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది.
-చిటికెన కిరణ్ కుమార్
94908 41284