ఒక దేశం కానీ, ప్రాంతం కానీ తన వ్యక్తిగత జీవన విధానం, సంస్కృతి వందల, వేల సంవత్సరాల చరిత్ర ఆధారంగా ఏర్పరుచుకుంటుంది. సాధారణ పౌరులెవరూ దానిని అతిక్రమించటానికి సహజంగా ఇష్టపడరు. తమ సంస్కృతిని వ్యక్తిగత జీవనాన్ని ప్రశాంతంగా, సంతోషంగా గడపటానికే ఇష్టపడుతారు. ఈ నేపథ్యంలో భారతదేశానికి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు చేయవచ్చా పరిశీలిద్దాం!
ఇక డాక్టర్ అంబేద్కర్ ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని చెప్పాడని కొందరు వాదిస్తున్నారు. ఆయన చెప్పినదేమంటే స్వాతంత్య్రానంతరం కొన్నేండ్లకైనా అందరినీ విద్యావంతులను చేసి, ఏ రకమైన వివక్ష లేకుండా ఒకే సమన్యాయం అందరికీ వర్తింపజేసే పరిస్థితి వచ్చినప్పుడు ఉమ్మడి పౌరస్మృతి గురించి ఆలోచించమన్నాడు. ఆ పరిస్థితి ఇప్పుడు, భారతదేశంలో ఉందా?
వేదవ్యాసుడు రచించిన మహా భారతంలోనే ఇప్పుడున్న ఏడు ఖండాలనీ ద్వీపాలుగా వర్ణించి అందులోని దేశాలన్నింటి వివరాలు ఇచ్చారు. ఆ కాలంలో 54 దేశాలుగా ఉన్నవి కాలక్రమేణా మార్పులు చెంది ఇప్పుడున్న దేశాలుగా ఏర్పడ్డాయి. జంబూద్వీపంలో ఉన్న ఆర్యావర్తంలో మన భారతదేశం కూడా చిన్న చిన్న దేశాల సమాహారంగా వేల ఏండ్లు విలసిల్లింది. అయితే ఈ దేశాల మధ్య ‘సంస్కృతీ, సంప్రదాయాలతో చాలా తేడాలు ఉండేవని మహా భారతంలోనే చెప్పబడింది. ఉదాహరణకు రుక్మిణీదేవి అన్న అయిన రుక్మి తన చెల్లెలిని తనకు స్నేహితులైన చేది దేశరాజు శిశుపాలునికి కానీ, సింధు దేశరాజు జయద్రదుడికి కానీ ఇచ్చి వివాహం చెయ్యాలనుకున్నాడు. కానీ వారి మధ్య మాటల్లో చేది దేశ సంస్కృతి, విదర్భ దేశ సంస్కృతి (రుక్మిణి దేశం) చాలా భిన్నమైనవనీ, సింధు దేశంలో (ప్రస్తుత పాకిస్థాన్) స్త్రీలను గౌరవించరనీ రుక్మిణి చెప్తుంది. తర్వాత క్షత్రియుడు కాకపోయినా శ్రీకృష్ణుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది క్షత్రియ కన్య రుక్మిణీదేవి. దీనివల్ల ఆ రోజులలో కులాలు లేవని కూడా తెలుస్తుంది. వృత్తిని బట్టి ఒక పేరు నిర్ణయింపబడేది, అంతే!
భారతదేశం అని మనం పిలుస్తున్న ఈ దేశం విదేశీయుల దండయాత్రల తర్వాతే, వారు ఒక్కొక్క రాజునీ, రాజ్యాన్నీ జయించి విస్తరించి ఒక పెద్ద దేశంగా చేశారు. మొఘల్ రాజులలో చివరి బలమైన పాదుషా ఔరంగజేబు మరణం తర్వాతనే మళ్లీ చిన్న, చిన్న ప్రాంతాలుగా మారి ఎక్కడి బలవంతుడైన వాడు అక్కడ తనను తాను పాలకుడిగా ప్రకటించుకున్నాడు. తర్వాత పాశ్చాత్యులు, చివరగా బ్రిటిష్వారు దేశాన్ని మొత్తం ఆక్రమించి పాలించారు.
ఒక్క విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఈ పాలకులుకొందరిని మతం మార్చారు కానీ, మతం మారని హిందువులుగా పిలవబడ్డవారు తమ తమ సం స్కృతీ, సంప్రదాయాలు పాటించారు. ప్రతి ప్రాంతం (ఇప్పుడు రాష్ట్రంగా మారింది) తన భాష, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, రోజువారీ దినచర్య, ఆహారం, వ్యవహారం, పండుగలు, పెళ్లికి సంబంధించిన విషయాలు- అన్నీ తమకు అనువుగా పాటి స్తూ వేల సంవత్సరాలు గడిపారు. ఈ విషయంలో భారతదేశం మిగతా దేశాల కంటే చాలా భిన్నంగా మారింది. ఉదాహరణకు రష్యా దేశం అతిపెద్ద దేశమైనా కమ్యూనిస్టు భావాలతో మతమన్న మాట లేకుండా 70 ఏండ్లు ఉండింది. పాశ్చాత్య దేశాలన్నీ క్రైస్తవ మతంలోకి వెళ్లి ఆ మతాచారాలకు అలవాటుపడిపోయారు. కొన్ని ఆఫ్రికా దేశాలలో పైకి క్రైస్తవ మతం పాటించినా ఇప్పటికీ తమ పాత సంప్రదాయాలు పాటిస్తారు. ఇక సౌదీ నుంచి ఇతర దేశాలకు విస్తరించిన ఇస్లాం మతం పాటించేవారు ఖురాన్లో చెప్పినవి తుచ తప్పకుండా అనుసరిస్తారు. చైనా వంటి దేశం తమ దేశంలోకి విస్తరించిన బౌద్ధమతం, ఇతర సంప్రదాయాలు పాటిస్తారు. ఇదంతా ఎందుకు తెలుసుకోవాలంటే పైన చెప్పిన దేశాల్లో 90 శాతం పైన ఒకే మతం వారు ఉండటంతో వారు ఒక ఉమ్మడి పౌరస్మృతి రూపొందించుకొని పాటిస్తున్నారు.
మరి భారతదేశం?
తరతరాలుగా వేద ధర్మం పాటిస్తున్న సనాతన ధర్ములు, ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, జూరాస్ట్రియన్లు (పార్సీలు, ఇరానియన్లు), బహాయి ఇజమ్ పాటించేవారు, ఇంకా పలు తెగల గిరిజనులు- ఇంకా బైటి దేశాల నుంచి వచ్చి స్థిరపడినవారు భారత్లో నివసిస్తున్నారు. వీరందరి వ్యక్తిగత ఆచారాలు, సంప్రదాయాలు గౌరవించి పాటించగలిగే ఒక సిద్ధాంతాన్ని ఎవరైనా తయారు చేయగలరా?
స్వాతంత్య్రానంతరం భారతదేశ నాయకులు తమ రాజ్యాంగాన్ని బ్రిటిష్ దేశ రాజ్యాంగాన్ని మోడల్గా తీసుకొని రూపొందించారు. కానీ భారతదేశ పూర్వ చరిత్రకు, నిర్మాణానికి ఈ మాడల్ తగినది కాదు. ఎందుకంటే మనదేశం అమెరికా దేశ నిర్మాణాన్ని పోలి ఉంది. అమెరికా యూరోపులోని వివిధ దేశాల వలసదారులు వెళ్లి స్థిరపడి ఒక దేశం వారు ఒక రాష్ట్రంగా ఏర్పరచుకుని 50 రాష్ర్టాలుగా అమెరికా రూపొందింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమంటే, ప్రతి రాష్ట్రం తనకు అనువుగా రాజ్యాంగాన్ని రూపొందించుకున్నది. ఆ ప్రాంత ప్రకృతి వనరులు, వాతావరణం, అక్కడ స్థిరపడ్డవారి సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయం దృష్టిలో పెట్టుకొని ఆ రాజ్యాంగం ఉంటుంది. పైగా ఇటువంటి స్వాతంత్య్రం ఉండబట్టి ఒక రాష్ర్టానికి, ఇంకొక రాష్ట్రంతో ప్రగతి సాధించటంలో పోటీతత్వం ఉంటుంది.
అదీ కాక ప్రపంచంలోని నిపుణులను ఆహ్వానించి వారి మేధను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ రోజున అమెరికా అగ్రరాజ్యంగా వెలుగొందుతోంది అంటే అది ఈ స్వాతంత్య్రం రాష్ర్టాలకు ఉండటం వల్లనే. దేశం మొత్తానికి సంబంధించిన విదేశీ విధానం, సైన్యం, శాస్త్ర సాంకేతికతలలో కేంద్ర ప్రభుత్వ అధికారం ఉంటుంది. నిజానికి భారతదేశం కూడా ఇట్లాగే ఫెడరల్ రాజ్యాంగ విధానం ఉంటే ఎంతో ప్రగతి సాధించవచ్చు. కనుక ఒకే విధానం, ఒకే సిద్ధాంతం, ఉమ్మడి నియమాలు, ఒకే భాష, ఒకే ఆహార్యం, ఒకే ఆహారం అనే తెలివి తక్కువమాటలు మానేసి సమాంతర , సమాఖ్య రాష్ర్టాలను ఏర్పర్చుకుంటే ప్రతి రాష్ట్రం పక్కచూపులు చూడకుండా, కేం ద్రం మీద ఆధారపడకుండా ప్రగతి సాధించటానికి ప్రయత్నిస్తుంది. ఇంత వైవిధ్యభరితమైన దేశంలో వివి ధ మతాల వారి మధ్య ఎంత తేడాలున్నా, ఎవరి వ్యక్తిగత జీవన విధానం వారు పాటిస్తూ, స్వతంత్రంగా అందరినీ గౌరవిస్తూ బతుకగలుగుతారు భారతదేశ వాసులంతా. యూసీసీ కావాలనే వారికి ఒక్క ప్రశ్న. పాక్ కూడా ఇలాగే ఆలోచించి ప్రతి పాకిస్థాన్ ముస్లిం పురుషుడు 4 వివాహాలు తప్పనిసరిగా చేసుకోవాలని నియమం పెడితే ఒప్పుకొంటారా? మనం సువిశాల ప్రపంచంలో బతుకుతున్నాం. భూమ్మీద మన దేశం ఒక్కటే లేదు. ఇది మర్చిపోకూడదు.
-కనకదుర్గ దంటు
89772 43484