రాజ్య వ్యవస్థల నిర్మాణం, సుస్థిరత, వికాసం అనే మూడింటికి కూడా క్రీస్తు పూర్వ కాలం నుంచీ ఫెడరలిస్టు దృక్పథమే దోహదం చేసింది తప్ప కేంద్రీకృత దృక్పథాలు కావన్నది ప్రపంచ చరిత్రలు చూసినవారికి తెలిసిన విషయమే. ఈ అవగాహనతోనే భారతదేశ మహా వైవిధ్యతకు అనుగుణంగా మనం ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసుకున్న తర్వాత, మొదట కాంగ్రెస్ పార్టీ అందుకు విరుద్ధమైన దారిలో నడిచి, తన క్షీణతకు దానిని కూడా ఒక ముఖ్య కారణం చేసుకుంది.
తర్వాత బీజేపీ ఈ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకునే బదులు అదే మార్గాన్ని అనుసరిస్తున్నది. ఇటువంటి వారెవరికైనా చివరకు ఈ సువిశాల దేశపు వైవిధ్యతలే భంగపాట్లకు గురిచేస్తాయి. ఈ వైవిధ్యతల గుర్తింపు, గౌరవం ఒక స్థాయిలో దేశ ఐక్యతకే కీలకమని గ్రహించడం అవసరం. అది జరగనిచోట పర్యవసానాలు చూస్తూనే ఉన్నాం.
Federalism | వాస్తవానికి 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపనలోనే ఫెడరలిజం దృక్పథం ఇమిడి ఉంది. కొద్దిమంది ఉన్నత విద్యావంతులు కేంద్రస్థానంలో ఉండి పార్టీని ఏర్పాటు చేసినా, దానికి దేశవ్యాప్త నిర్మాణాన్ని, స్వభావాన్ని కలిగించేందుకు వేర్వేరు ప్రాంతాలవారిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు ఎన్నెన్ని ప్రయత్నాలు చేశారో కాంగ్రెస్ చరిత్రలో ఉన్న విషయమే. పార్టీని ఆ విధంగా నిర్మించటంతో పాటు ఆ వేర్వేరు ప్రాంతాల ప్రజల ఆలోచనలు, కోరికలు కూడా పార్టీ ఆశయాల్లో ప్రతిఫలించేట్టు చూశారు. ఆ విధంగా మాత్రమే కాంగ్రెస్ నిజమైన అర్థంలో జాతీయ పార్టీ అయింది. అదే సమయంలో ప్రాంతీయ ప్రాతినిధ్యాల మూలంగా ఫెడరల్ పార్టీ అయింది. అప్పటి నుంచి 65 ఏండ్ల తర్వాత 1950లో స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని ప్రకటించుకునే వరకు ఈ కోణం నుంచి సాగిన చరిత్ర ఏమిటో తెలిసిందే కనుక ఇక్కడ ప్రస్తావించనక్కరలేదు.
1950 తర్వాతి పరిణామాలను చూసే ముందు ఒకసారి గతంలోకి వెళ్లటం అవసరం. అందువల్ల, పైన అనుకున్నట్టు, ఫెడరలిజం దృక్పథపు మూలాలు చరిత్రలో ఏ విధంగా ఉన్నాయి? అవి ఎటువంటి పాత్రను పోషించాయి? వాటి అవసరం ఆధునిక ప్రజాస్వామ్యంలో నేటికీ ఎంత ఉన్నది? దానిని అనుసరించకపోవడం వల్ల కలిగే అనర్థాలేమిటి? అనేది మనకు అర్థం కాదు. సందర్భం కోసం ఇక్కడ క్లుప్తంగా చెప్పుకోవడం తప్ప అవి అందరికీ తెలిసినవే. భారతదేశం సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చిన్నచిన్న రాజ్యాలు ఏర్పడి అవి విస్తరించజూసినప్పుడు ఇతర చిన్నరాజ్యాలు, తెగలు, జనపదాలతో ఘర్షణలు తలెత్తాయి. అవి ఘర్షించింది స్వయం పాలన, భాషా, సంస్కృతులు, హక్కులు, వైవిధ్యాల పరిరక్షణ, గౌరవాల కోసం.
ఆ క్రమంలో కొన్ని గెలిచి తమ స్వతంత్రతను నిలబెట్టుకోవడం, కొన్నిటితో ఇచ్చిపుచ్చుకునే ఒప్పందాల వంటివి జరగటం, వాటిని గౌరవించటం, లేదా ఉల్లంఘనలు, తిరిగి ఘర్షణలు అనే క్రమం వందల సంవత్సరాల పాటు సాగుతూనేపోయింది. ఫెడరలిస్టు దృక్పథపు అవసరం, పుట్టుక, పరిణామాలు, ఆ ఏర్పాట్లను గౌరవించటం వల్ల కలిగే ఉపయోగాలు, ఉల్లంఘనలతో ప్రమాదాలు అనేవి అన్నీ కూడా మనం ఈ పరిణామాల చరిత్రలో చూడవచ్చు. ఇదే విధమైన పరిణామాలు క్రీస్తు అనంతర కాలంలో, మధ్య యుగాల్లో, చివరకు బ్రిటిష్ వలస పాలనా కాలంలోనూ హెచ్చుతగ్గులతో కొనసాగుతూనే వచ్చాయి.
పైన చెప్పుకొన్నట్టు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపన, తర్వాత భారత రాజ్యాంగ రచన సైతం ఇందుకు అనుగుణంగానే జరిగినప్పుడు, ఈ పరిస్థితులకు తగినట్టే భౌగోళిక స్థితిగతులను, ప్రాంతీయ భాషా సంస్కృతులను, ఉపజాతులను గుర్తిస్తూ భాషా ప్రయుక్త రాష్ర్టాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు, ప్రాంతీయ ఆర్థిక, రాజకీయ శక్తులకు అనేక స్వీయాధికారాలు లభించినప్పుడు, మొదట కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ అందుకు విరుద్ధంగా వ్యవహరించటం ఎందుకన్నది ప్రశ్న.
ఒకవైపు వేల సంవత్సరాల చరిత్రకు, మరోవైపు స్వాతంత్య్రోద్యమ లక్ష్యాలు, స్వతంత్ర భారత రాజ్యాంగ ఆశయాలకు భంగకరంగా ప్రాంతీయతలను, వైవిధ్యాలను అణచివేసి కేంద్రీకృత ధోరణిలో పాలించజూడటం వల్లనే ఉభయ శక్తులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధాలు, బహిరంగ యుద్ధాలు సాగుతూ వస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీల తీరు మారనంతకాలం పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది.
రకరకాల వ్యూహాలు, ఎత్తుగడలతో ప్రాంతీయతలను, ప్రాంతీయ శక్తులను అణచివేయగలమని, కబళించగలమని ఈ రెండు పార్టీలు ఆశిస్తున్నట్టు గతంలో జరగలేదు, భవిష్యత్తులో జరగటం కూడా అసంభవమని కొద్దిపాటి అవగాహన ఉన్నవారెవరైనా గ్రహించగలరు. ఈ రోజున దేశంలో ఇన్నిన్ని ప్రాంతీయ పార్టీలు ఏర్పడి వర్ధిల్లడం ఫెడరలిజం సజీవతకు తిరుగులేని తార్కాణం.
పైన అనుకున్నట్టు ప్రాంతీయతల మూలాలు తమ వైవిధ్యతలు, భాషా సంస్కృతులు, ఆత్మగౌరవాలు, అస్తిత్వాలు, హక్కులు, స్వయం పాలనలో ఉంటాయి. క్రీస్తు పూర్వం నుంచి నేటి వరకు అవే వాటి పునాదులు. స్వరూప స్వభావాలు, మనుగడలు. ఇదంతా 1885 నాటికి, 1950 నాటికి బాగా తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ వీటిని దెబ్బతీసే సాహసం ఎందుకు చేసిందన్నది అర్థం చేసుకోవాల్సిన విషయం. దేశానికి స్వాతంత్య్రం వచ్చే సమయానికి తమిళనాడు, పంజాబ్, జమ్మూ-కశ్మీర్ ప్రాంతాల్లో మాత్రమే ప్రాంతీయ రాజకీయ వేదికలు బలంగా ఉండేవి.
నెహ్రూ జీవించి ఉన్నంత వరకు కొద్ది అటు ఇటుగా ఫెడరల్ ఏర్పాట్ల పట్ల గౌరవం ఉండేది. బలమైన కేంద్రంతో పాటు బలమైన రాష్ర్టాలు అవసరమన్నది అప్పటి ఆలోచన. సహకార ఫెడరలిజమన్నది ఒక ప్రకటిత ఆశయం. ఈ లక్ష్యాలకు నెహ్రూ పాలనలోనూ కొన్ని ఉల్లంఘనలు జరగకపోలేదు గానీ, అది ఒక ధోరణిగా మారలేదు. రాష్ర్టాల పట్ల, ప్రాంతీయ శక్తుల పట్ల తగు గౌరవాలు ఉండేవి.
ఇది మారటం ఇందిరాగాంధీ కాలం నుంచి మొదలైంది. ఆమెకు తన వ్యక్తిగత స్వభావం, రాజకీయ సమస్యల కారణంగా కేంద్రీకృత రాజకీయాధికారం అవసరమైంది. ఈ కేంద్రీకరణ ధోరణిని తను రాష్ర్టాల విషయంలోనే కాదు, తమ స్వంత పార్టీ కాంగ్రెస్ విషయంలోనూ చూపారు. మరొకవైపు, మార్క్సిస్టు పరిభాషలో చెప్పాలంటే, నేషనల్ బూర్జువాజీ అనేది విస్తరిస్తూ ప్రాంతీయ ఆర్థిక వనరులను క్రమంగా తన అధీనంలోకి తెచ్చుకోవటం మొదలుపెట్టింది. అటువంటి పొలిటికల్ ఎకానమీలో విదేశీ ఆర్థిక శక్తుల ప్రాబల్యం పెరగటం లాల్బహదూర్ శాస్త్రి హయాంలోనే నెమ్మదిగా మొదలవగా ఇందిరాగాంధీ కాలంలో బాగా ఎక్కువైంది. వారందరికీ ఆమె ప్రోత్సాహం లభించసాగింది. ఆ విధంగా రాజకీయ, కేంద్రీకరణలు ప్రాంతీయ రాజకీయ వర్గాలకు, ఆర్థిక వర్గాలకు కూడా సమస్యలు సృష్టించసాగాయి. ఈ స్థితి ఫెడరలిజంపై ఒత్తిళ్లకు దారితీయగా ప్రాంతీయ రాజకీయ, ఆర్థిక శక్తుల ద్వారా అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. స్వయంగా కాంగ్రెస్ పార్టీలోనూ చీలికలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్టు అభివృద్ధి, అంతర్గత వలసల స్థితి, రకరకాల అశాంతులు, ఘర్షణలు ఎడతెరపి లేని పరిస్థితిగా మారాయి.
వీటి మధ్య రాష్ర్టాల రాజకీయ, ఆర్థిక, పరిపాలనా సంబంధ ఫెడరల్ హక్కులకు విఘాతం కల్పిస్తూ అన్నింటిని కేంద్రీకృతం చేస్తూపోయే ధోరణి వల్ల కాంగ్రెస్ వరుసగా అనేక రాష్ర్టాల్లో ఓడిపోతూ ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావటం మొదలైంది.
ఇందిర తర్వాతనైనా ఆ పార్టీ నాయకత్వం తమ తప్పులను గ్రహించి సరిదిద్దుకోక, అదే కేంద్రీకృత ధోరణిని మరింతగా కొనసాగించింది. ఈ కారణాల వల్ల రాష్ర్టాల్లోనే గాక కేంద్రంలో సైతం అధికారం కోల్పోవటానికి ఇందిర కాలంలోనే 1977లో ఆరంభం జరుగగా, ఆ తర్వాత అదొక రంగులరాట్నపు ధోరణిగా మారింది. అయినప్పటికీ చింత చచ్చినా పులుపు
చావలేదనట్టు, 2004లో అధికారానికి వచ్చిన అహంకారంతో, తనకు అధికారం కోసం సహకరించిన యూపీఏ పార్టీలనే బలహీనపరచేందుకు, కబళించేందుకు ప్రయత్నించింది. వారికి కావాల్సింది కేంద్రీకృత అధికారం.
అందువల్లనే ఈ రోజున 2024 ఎన్నికలు సమీపిస్తుండగా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఒకప్పటి వలె నమ్మటం లేదు. ఒప్పందపు చర్చల విషయమై తమ డిమాండ్లతో ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇది చివరకు ఎట్లా తేలేదీ అగమ్యగోచరంగా మారింది. అయినప్పటికీ నాయకత్వం చింత పులుపు లక్షణాలనే ఇప్పటికీ చూపుతుండటం విశేషం. దీనంతటికీ మూలకారణం కేంద్రీకరణ ధోరణి యథావిధిగా కొనసాగుతూ, ఫెడరలిస్టు శక్తులను బలిగొనచూడటమేనని మళ్లీమళ్లీ చెప్పనక్కరలేదు. కానీ, ఈ కేంద్రీకరణ పార్టీలు ప్రాంతీయ పార్టీలను అంతం చేసేందుకు ఎప్పటినుంచో శతవిధాలుగా ప్రయత్నించి కూడా విఫలమవుతున్నాయి.
బీజేపీ వ్యవహరణ కూడా కాంగ్రెస్కు కార్బన్ కాపీ వలెనే ఉన్నది. కాంగ్రెస్ సుదీర్ఘ వైఫల్యాల కారణంగా ఏర్పడిన శూన్యంలోకి, అట్లాగే కాంగ్రెస్కు తాము ప్రత్యామ్నాయమంటూ ముందుకొచ్చిన వివిధ మధ్యేమార్గ ఫ్రంట్లు కూడా విఫలమైన శూన్యంలోకి విజయవంతంగా ప్రవేశించిన బీజేపీ, తన అధికారాన్ని పదిలపరుచుకునేందుకు మతాన్ని కూడా విజయవంతంగా ఉపయోగించుకుంటున్నది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏమంటే, ఈ పార్టీది కూడా కాంగ్రెస్ వలెనే రాజకీయ, ఆర్థిక, పరిపాలనాపరమైన కేంద్రీకరణ విధానం. కాంగ్రెస్ కన్నా మరింత ఎక్కువగా, పరిపూర్ణంగా. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగపరమైన ఫెడరలిజానికి కనీసం నటనలతో కూడిన విధేయతను చూపుతుంది. ఆచరణలో నూటొక్క ఉల్లంఘనలకు పాల్పడుతుంది. కానీ, అందుకు భిన్నంగా బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ తన సిద్ధాంత పత్రాల్లో లిఖితపూర్వకంగా ఫెడరలిజాన్ని, భాషా ప్రయుక్త రాష్ర్టాలను వ్యతిరేకించింది. కేంద్రీకృత రాజ్యమే తన సిద్ధాంతమని, లక్ష్యమని ప్రకటించింది.
ఈ విధమైన చర్చ అంతటి తర్వాత, తమకు తమ రాష్ర్టానికి కావాల్సింది ఫెడరలిజమో లేక కేంద్రీకృత పాలనో తేల్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉంటుంది. ఇది వారి వర్తమానానికే గాక దీర్ఘకాలిక భవిష్యత్ ప్రయోజనాలకు సంబంధించిన ప్రశ్న. దేశంలోని అనేక ఇతర ప్రాంతాలకు వలెనే తెలంగాణ ఉపజాతీయత, ఫెడరలిజం కూడా దాని మూలాల్లోనే ఉన్నాయని ప్రజలు గ్రహించాలి. వాటిని శక్తిమంతం చేసుకోవాలి.
-టంకశాల అశోక్