ఆహారం లేకుండా కొంతకాలం పాటు మనం ఉండగలమేమో గానీ, నీరు లేకుండా ఎక్కువసేపు జీవించలేం. అంతటి విలువైన నీటిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి. కానీ, మనం చేస్తున్నదేమిటి? ఒక్క హైదరాబాద్లోనే చూసుకుంటే.. నగరంలోని 1.30 కోట్ల మంది రోజు సుమారు 448 మిలియన్ గ్యాలన్ల (203 కోట్ల లీటర్లు) నీటిని వాడుతున్నారు. అందులో 30 మిలియన్ గ్యాలన్ల (13 కోట్ల లీటర్లు) నీరు వృథా అవుతుండటం ఆందోళనకరం. ఒక కిలో లీటర్ నీటిని కృష్ణా, గోదావరి నదుల నుంచి నగరానికి తీసుకురావడానికి సుమారు రూ.45 వరకు ఖర్చవుతున్నది. అంటే ఈ లెక్కన.. 13 కోట్ల లీటర్లకు ఎంత అవుతుందో అర్థం చేసుకోవాలి. ఖర్చు సంగతి పక్కనపెడితే.. వృథా అవుతున్న నీటి విలువను వెలకట్టగలమా? గుక్కెడు నీటి కోసం పరితపించేవారికే ఆ విలువ తెలుస్తుంది.
Water | పైపుల ద్వారా సరఫరా అయ్యే నీటిలో సుమారు 40 శాతం వృథా అవుతున్నట్టు పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. మంచినీటి దుర్వినియోగం ఇలాగే కొనసాగితే 2040 నాటికి మన దేశ జనాభాలో 40 శాతం మందికి తాగునీరే దొరకదు. 2050 నాటికి జీడీపీలో భారత్ 6 శాతాన్ని కోల్పోతుందని ఓ అంచనా. భవిష్యత్తులో ఢిల్లీ సహా 21 నగరాల్లో భూగర్భ జలాలు కనుమరుగవుతాయని నీటి నిర్వహణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇష్టారాజ్యంగా నీళ్లను వృథా చేయడమే దేశంలో నీటి కటకటకు ప్రధాన కారణమని సెంట్ర ల్ వాటర్ కమిషన్ చెప్తున్నది.
ప్రపంచంలోని సుమారు 150 దేశాలు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్టు వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ నివేదిక ద్వారా తెలుస్తున్నది. ఈ జాబితాలో ఖతార్, ఇరాన్, జోర్డాన్, కువైట్, యూఏఈ, ఇజ్రాయెల్, లెబనాన్తో పాటు మన దేశం కూడా ఉండటం విచారకరం. ఆస్ట్రేలియా, యూకే, దక్షిణాఫ్రికా దేశాలు నీటి వృథాను అరికట్టడాన్ని తమ జాతీయ ఎజెండాలో చేర్చాయి. వాననీటి సంరక్షణలో జర్మనీ ఇతర దేశాలకు పాఠాలు నేర్పుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో సింగపూర్ వాటర్ మేనేజ్మెంట్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి.
కేసీఆర్ సర్కార్ దూరదృష్టితో తీసుకున్న చర్యల కారణంగా గత పదేండ్లు తెలంగాణ జలకళను సంతరించుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అనేక పంట కాలువలు,చెరువులు, కుంటలు వేసవిలోనూ నీటితో కళకళలాడాయి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నాటినుంచి తొమ్మిదిన్నరేండ్ల పాటు నీటి సంక్షోభం అనే
మాటే లేదు. కానీ, ప్రస్తుతం తెలంగాణలో కరువు తాండవిస్తున్నది. పంటలు ఎండిపోతున్నాయి.నీటి కోసం మహిళలు రోడ్డెక్కుతున్నారు. అనతికాలంలోనే ఎందుకిలా జరుగుతున్నది?
హైదరాబాద్కు తాగునీరందించే ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నాయి. నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. ఎమర్జెన్సీ పంపింగ్పైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొన్నది. అటు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టులు నిండుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో నీటి ని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. నీటి వృథాను అరికట్టాలి. జల సంరక్షణ మనందరి బాధ్యత. చెన్నై, బెంగళూరు నగరాల దుస్థితి మనకు రాకూడదంటే ఇప్పటినుంచే నీటి వృథాను అరికట్టాలి. పాలకులు మేల్కొవాలి.
-కన్నోజు మనోహరాచారి
79950 89083