Gurugram : ఐవీఎఫ్ ప్రక్రియపై అనేక వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హరియాణాలో గుర్గావ్ (గురుగ్రామ్)లో మరో సంచలన విషయం బయటపడింది. కొన్ని నెలల క్రితం ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లల్ని కన్న దంపతులకు ఆ పిల్లలు తమ పిల్లలు కాదని తెలిసింది. ఇటీవల జరిపిన డీఎన్ఏ టెస్టులో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఆ జంట కోర్టును ఆశ్రయించింది. ఈ విషయం బయటపడటంతో దేశంలో ఐవీఎఫ్ ప్రక్రియపై, దీని చట్టబద్ధతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం మరోసారి చర్చకు దారితీసింది.
గుర్గావ్కు చెందిన ఒక జంటకు సంతానం కలగలేదు. దీంతో వారు ఐవీఎఫ్ సెంటర్లను ఆశ్రయించారు. అందులో ఒక సంస్థ వారికి ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనేందుకు అంగీకరించారు. ఇందుకోసం ఆ జంట నుంచి అండం, శుక్రకణాల్ని సేకరించారు. అనంతరం ఐవీఎఫ్ విధానంలో ఈ జంట కవల పిల్లల్ని కన్నారు. కొద్దిరోజుల క్రితం పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో వారు ఆస్పత్రికి వెళ్లగా, అక్కడ జెనెటిక్ పరీక్షలు కూడా అవసమరయ్యాయి. ఇలా జెనెటిక్, డీఎన్ఏ పరీక్ష నిర్వహించగా సంచలన విషయం బయటపడింది. ఆ పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అసలు సంబంధం లేదని తేలింది. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరి డీఎన్ఏతో ఆ పిల్లల డీఎన్ఏ మ్యాచ్ కాలేదు. అటు తండ్రి డీఎన్ఏ, ఇటు తల్లి డీఎన్ఏ.. ఇద్దరిలో ఎవరిలోనూ లేదు.
ఆ పిల్లలు తమ పిల్లలే అని సూచించే ఇతర పరీక్షలు నిర్వహించినా ఫలితాలు వారికి వ్యతిరేకంగానే వచ్చాయి. పైగా పుట్టిన పిల్లలు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పిల్లల్లా ఉన్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై బాధితుడైన రాహుల్ రాథోడ్ ముందుగా ఐవీఎఫ్ సెంటర్ను ఆశ్రయించినా సరైన స్పందన రాలేదు. దీంతో ఆ జంట కోర్టును ఆశ్రయించింది. తమ బయోలాజికల్ పిల్లలు తమకు కావాలని, ఐవీఎఫ్ సంస్థకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కోర్టు ఐవీఎఫ్ సెంటర్పై చర్యకు ఆదేశించింది. అక్కడి రికార్డుల్ని సీజ్ చేయాలని సూచించింది. ప్రస్తుతం ఈ అంశంపై ఇంకా విచారణ జరుగుతోంది. అయితే, దేశంలో కొనసాగుతున్న ఐవీఎఫ్ సెంటర్ల నిర్వహణా తీరుపై, నైతికతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.