Mission Kakatiya | తెలంగాణ పల్లెలు చెరువుల జలకళతో మురుస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షతోనే తెలంగాణ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఈ అభివృద్ధి జరిగింది. కాకతీయ రాజులు, వారి తర్వాత ఈ ప్రాంతాన్ని ఏలిన కుతుబ్షాహీలు, సంస్థానధీశులు, స్థానిక ప్రభువులు తెలంగాణ ప్రాంతంలో వేలాది చెరువులను నిర్మించి, వ్యవసాయ విస్తరణకు తోడ్పాటు అందించారు. నేడు తెలంగాణలో కేసీఆర్ పాలన కాకతీయ వైభవాన్ని తలపిస్తున్నది.
తెలంగాణ గ్రామీణ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వికాసానికి అనాదిగా ఆధారమై నిలిచిన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ వలస పాలకుల నిర్లక్ష్యం కారణంగా ధ్వంసమైపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 33 వేలకు పైగా చెరువులు, కుంటలు ఉన్నట్టుగా వాటి కింద 12 లక్షల ఎకరాలకు పైగా భూమి సాగులో ఉన్నట్టు తెలుస్తున్నది. తెలంగాణ ప్రాంతంలో చెరువులేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. 1969 తెలంగాణ ఉద్యమాన్ని పరిశీలించినప్పుడు ఉద్యమానికి ఉద్యోగాల దోపిడి, నిధుల దోపిడి అంశాలే ప్రాతిపదికలుగా ఉన్నాయి. నీరు ఇంకా ఒక సమస్యగా ముందుకురాని పరిస్థితి.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే ఒక సమగ్రమైన దూరదృష్టి, దీర్ఘకాలికమైన ఆలోచనలతో కాకతీయ రాజులు నిర్మించిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంపై మేధోమథన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. 2014 సెప్టెంబర్ 25న జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగిన ఇంజనీర్ల సదస్సులో గంటల తరబడి చర్చించి ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశారు. వెంటనే రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్రావు అధ్యక్షతన ఆరుగురు మంత్రులతో సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ సబ్ కమిటీ ఏర్పాటుతో తెలంగాణలోని మేధావులు, సాగునీటిరంగ నిపుణులు, సీనియర్ జర్నలిస్టులతో పూడికతీత పనులపై అవగాహన ఉన్న ఫ్రీడం సంస్థ, ఇతర ఎన్జీవోలను సంప్రదించి పూడిక మట్టి వలన ఒనగూడే ప్రయోజనాలతో సమగ్రయాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి సమర్పించగా కేసీఆర్ ఆమోదించారు.
తదనంతరం మొట్టమొదటగా చెరువులను లెక్కగట్టాలని ఆదేశించగా తెలంగాణ వ్యాప్తంగా తేలిన చెరువుల సంఖ్య 46,351. అందులో సుమారుగా 5000 గొలుసుకట్టు చెరువులున్నట్టు తేలింది. అత్యధికంగా మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనే చెరువులున్నా యి. చెరువు పూడిక మట్టిలో పోషకాలను గుర్తించారు.
చెరువులోని పూడిక మట్టిని తిరిగి పొలాల్లోకి రీసైకిల్ చేయడం వలన పోషక విలువలు పెరుగుతాయని దాంతో ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, దీంతో తేమ ను నిలుపుకునే సామర్థ్యం పెరుగుతుందని రైతుల ద్వారా తెలుసుకున్నారు.
మైనర్ ఇరిగేషనుకు కేటాయించిన 255 టీఎంసీల స్థాయికి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడం, ఏటా 20 శాతం చెరువులను పునరుద్ధరించడం, చెరువుల క్రింద 25 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకరావడం, ఉపాధి కోసం వలసపోయిన లక్షలాది మంది ప్రజలను గ్రామాలకు తిరిగి రప్పించడం, బోరు బావుల కింద ఎక్కువ భూమిని సాగులోకి తేవడం అనే ప్రధాన లక్ష్యాలతో ఈ మిషన్ చేపట్టారు. టెండర్ల ప్రక్రియను సరళతరం చేసి ప్రతి చెరువుకూ ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వా రానే స్థానిక కాంట్రాక్లర్లకు అవకాశం కల్పించారు. ప్రతి చెరువునూ సమగ్రంగా పునరుద్ధరించాలని, దూరదృష్టి తో, దీర్ఘకాలికమైన ఆలోచనలతో గ్రామీణ ప్రాంతాల్లో పసిడి పంటలకు ఉపయోగకరంగా మిషన్ కాకతీయ పనులు ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి హరీశ్రావు అధ్యక్షతన ఏర్పడిన మంత్రుల సబ్ కమిటీ ఇరిగేషన్ పాలనావ్యవస్థను పటిష్టం చేసింది. కృష్ణా, గోదావరి బేసిన్లకు ఇద్దరు ఛీప్ ఇంజనీర్లను, 10 జిల్లాలకు ఎస్ఈలను, రెండు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరును, ప్రతి నియోజకవర్గానికో డీఈ, ప్రతి మండలానికో ఏఈతో పాటు కార్యాలయాలను ఏర్పాటు చేసి పక్కా ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకెళ్లింది. ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగా న్ని కూడా ఏర్పాటు చేసింది. మిషన్ కాకతీయ మత్స్య సంపద, పాడి పశువులకు నీటి సౌకర్యం పెంపునకు ఉపయోగపడింది. మేకలు, గొర్రెల పెంపకందారులకు, రజక వృత్తి దారులకు మేలు జరిగింది. పంటల సాగుకు ఉపయోగపడింది. చారిత్రక చందుపట్ల పెద్దచెరువు పూడికతీత పని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిష్ఠాత్మకంగా అమలుపరిచిన మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి తెలంగాణ సమాజమం తా సంఘీభావాన్ని, సహకారాన్ని అందించింది.
మొదటి దశలో 7950 చెరువులకు ప్రభు త్వం రూ.2523 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.1653 కోట్ల ఖర్చుతో ఈ చెరువుల్లో మట్టి కట్టలను వెడల్పు చేసి బలోపేతం చేయడం, తుమ్మచెట్లను, లొట్టపీసు చెట్లను, గుర్రెపుడెక్క తదితర కలుపును తొలగించడంతో పాటు తూము, అలుగులను మరమ్మత్తు చేయడం, ఫీడర్ చానల్స్ను బాగుచేయడం వంటి పనులను చేపట్టారు.
నీటిని సమకూర్చి, సాగుకు పెట్టుబడి ఇచ్చి, మార్కెటింగ్ వ్యవస్థను తీర్చిదిద్దిన ఉద్యమధీరుడు, పాలనాదక్షుడు, దూరదృష్టి గల మహామేధావి సీఎం కేసీఆర్కు మరెవరూ సాటిలేరు. ప్రకృతి సమతుల్యతను సాధించడానికి హరితహారమనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని 4 విడతలుగా నిర్వహించి తెలంగాణ అడవుల విస్తీర్ణాన్ని పెంచిన ప్రకృతి ఆరాధకుడు మన సీఎం కేసీఆర్ సారు. వ్యవసాయాన్ని కేవలం సాంప్రదాయ వృత్తిగా పరిగణించకుండా లాభసాటిగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించేలా సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రైతును రాజు చేయాలన్నదే ఆలోచన. సీఎం ఆదేశాలతో సూక్ష్మస్థాయి పంటల సాగుపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్రంలోని 2600 వరకు ఏఈవో స్థాయి క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కో క్లస్టర్లో 5 వేల ఎకరాలున్నా యి. మొత్తంగా 1.35 కోట్ల ఎకరాలున్నట్టు సంబంధిత అధికారులు లెక్కతీశారు.
వానకాలంలో నియంత్రణ పద్ధతి సాగుతో రైతులు లాభం పొందేందుకు వీలుగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయించడం ఏభూములలో ఏ పంటలు అనుకూలమో గుర్తించి వాటినే సాగుచేసేలా రైతుల్లో అవగాహన కల్పిస్తునారు.
సాగు నీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శం. మిషన్ కాకతీయ ఫలాలకు నిలువెత్తు నిదర్శనం చెక్కు చెదరని చెరువులేనని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతియేటా నిండుకుండల్లా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఉండటంతో కరువు నేలపై జలసిరులు కళకళలాడుతున్నాయి. ఇలా చెరువులను బాగుచేసి వ్యవసాయంతో పాటుగా గ్రామీణ కులవృత్తులకూ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది.
కాకతీయ రాజులు, వారి అనంతరం దక్కన్ ప్రాంతాన్ని పాలించిన రాజుల వారసత్వాన్ని కొనసాగించదల్చుకున్న కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం కాకతీయుల చెరువుల నిర్మాణ కౌశలం గుర్తుకు తెచ్చే విధంగా ఈ కార్యక్రమానికి మిషన్ కాకతీయ అని పేరుపెట్టారు. పల్లె సీమలే పట్టుగొమ్మలవ్వాలని, గ్రామీణ కులవృత్తుల పూర్వ వైభవానికి, వారి ఆర్థిక స్వావలంబనకు కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల పూడికతీత చేపట్టి భూమిలో నీటిమట్టాలు పెరగడానికి కృషి చేసిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్.
(వ్యాసకర్త : ఎంబీసీ. జాతీయ కన్వీనర్)