న్యూఢిల్లీ, మే 25 : ఎన్నికల ముందు ఇంధన ధరలు పెంచబోమని పదేపదే ప్రకటించిన కేంద్రం.. ఎన్నికలు ముగిశాక వరుసగా ధరలు పెంచుకుంటూ పోతున్నది. తాజాగా మరోసారి ఇంధన ధరలను పెంచింది. పెట్రోల్పై లీటర్కు రూ. 2.61, డీజిల్పై లీటర్కు రూ. 2.71 చొప్పున సోమవారం ధరలు పెరిగాయి. తాజా పెంపుతో మే 15 నుంచి లీటర్కు మొత్తం పెంపు రూ.7.5కు చేరింది. గడచిన 11 రోజుల్లో ఇంధన ధరలు పెరుగడం ఇది నాలుగోసారి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.51 నుంచి రూ. 102.12 చేరుకోగా లీటర్ డీజిల్ ధర రూ. 92.49 నుంచి రూ. 95.20కి పెరిగింది. ఇంధన ధరలు 2022 మే తర్వాత ఇంత అత్యధిక స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరువడానికి అమెరికా, ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించిన తర్వాత ప్రపంచ చమురు ధరలకు ప్రాథమిక ప్రమాణమైన బెరట్ క్రూడ్ 5 శాతానికి పైగా పడిపోయింది. ఇరాన్ అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, అలాగే కీలకమైన ప్రపంచ చమురు రవాణా మార్గమైన హొర్ముజ్ జలసంధి గుండా నౌకాయానానికి అంతరాయం కలుగడంతో ఫిబ్రవరి నెలాఖరు నుంచి ప్రపంచ ముడి చమురు ధరలు 50 శాతానికి పైగా పెరిగాయి. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గృహోపయోగ వంటగ్యాస్ ధరను 14.2 కిలోల సిలిండర్ రూ. 60, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ) ధరను మే మధ్య నుండి కిలోకు రూ. 4 చొప్పున పెంచారు.
పెట్రోల్, డీజిల్ ధరల తాజా పెంపుపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై సోమవారం దాడిని కొనసాగించాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు నిలకడగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతున్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఇంధన ధరలను పదేపదే పెంచడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇంధన లూటీని కొనసాగిస్తున్నదని ఆయన ఆరోపించారు. సామాన్య ప్రజల పొదుపు మొత్తాలను దగ్ధం చేసేందుకు మోదీ ప్రభుత్వం పెట్రోల్ చల్లిందని ఖర్గే వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్క డాలరు కూడా పెరుగలేదని ఆయన చెప్పారు. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం 2014లో రూ. 71.41 ఉన్న లీటర్ పెట్రోల్ ధరను 2026 నాటికి రూ. 102.71కి పెంచిందని ఖర్గే చెప్పారు. అదే విధంగా లీటర్ డీజిల్ ధరను రూ. 56.71 నుంచి రూ. 95.20కి చేర్చిందని చెప్పారు. రష్యా, ఇరాన్ నుంచి తక్కువ ధరలకు ముడి చమురును ఎందుకు భారత్ కొనుగోలు చేయడం లేదని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) వినియోగదారులు ఇకపై ఎల్పీజీ సిలిండర్లను కొనుగోలు చేయకూడదని భారత ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో అంతరాయం తలెత్తడంతో, ప్రభుత్వం కొన్ని పరిశ్రమలకు ఎల్పీజీ సరఫరాను ఇప్పటికే నిలిపివేసింది.
మే 15న లీటర్కు రూ.3 చొప్పున తొలిసారిగా రిటైల్ ఇంధన ధరలను పెంచగా ఆ తర్వాత మే 19న 90 పైసలు, మే 23న పెట్రోల్ ధరలు 87 పైసలు, డీజిల్ ధరలు 91 పైసలు లీటర్కు పెరిగాయి. స్థానిక పన్నుల కారణంగా రాష్ర్టాలవారీగా ధరలు మారుతూ ఉంటాయి. సోమవారం పెంపు తర్వాత ముంబైలో పెట్రోల్ ధర లీటర్కు రూ. 111.21, డీజిల్ ధర రూ. 97.83గా ఉండగా, కోల్కతాలో ధరలు వరుసగా రూ. 113.51, రూ. 99.82కి పెరిగాయి. చెన్నైలో పెట్రోల్ ధర లీటర్కు రూ. 107.77, డీజిల్ ధర లీటర్కు రూ. 99.55గా ఉంది.
