పుట్టుకతోనే . లక్షల రూపాయలు ఖర్చయ్యే ఆ ఆపరేషన్లను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిర్వహించి పిల్లల తల్లిదండ్రుల్లో ఆనందం నింపుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్లోని ప్రభుత్వ చెవి, గొంతు, ముక్కు వైద్యశాల, గాంధీ దవాఖానల్లో నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్లను త్వరలో రాష్ట్రమంతటా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది.
కొంతమంది పిల్లలు పుట్టుకతోనే చెవిటివారిగా పుడుతారు. చెవిలో శబ్దాన్ని గ్రహించి దానిని మెదడుకు తీసుకెళ్లే ‘కాక్లియా’ అవయవం సరిగా పనిచేయకపోవడం వల్ల వారికి శబ్దాలేవీ వినిపించవు. అందువల్ల వారు పెరుగుతున్న క్రమంలో మాటలు నేర్చుకోలేక, శాశ్వతంగా మూగ, చెవిటి వారిగా మిగిలిపోతారు. ఇది వారి వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. విద్యాభ్యాసం, ఉద్యోగం, వివాహాలకు ఇబ్బందిగా మారుతుంది. అంతేకాకుండా దీనివల్ల ప్రమాదాలకు లోనయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది చూసి ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంతో బాధపడుతారు. తమ పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండి మిగతా పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉంటే చూసి మురిసిపోవాలనుకుంటారు.
చిన్నవారైనా, పెద్దవారైనా కొంత వినికిడి శక్తిని కోల్పోతే వినికిడి పరికరాలను (హియరింగ్ ఎయిడ్స్) ఉపయోగించడం ద్వారా వినికిడి శక్తిని పెంచుకోవచ్చు. కానీ పూర్తిస్థాయిలో వినికిడి శక్తిని కోల్పోయిన వారికి వినికిడి పరికరాలు ఏ మాత్రం ఉపయోగపడవు. ముఖ్యంగా పుట్టుకతోనే పూర్తిస్థాయిలో వినికిడి కోల్పోయిన పిల్లలకు వినికిడి శక్తిని పునరుద్ధరించడానికి ప్రస్తుతం కాక్లియార్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స చేస్తున్నారు. కాక్లియార్ ఇంప్లాంట్ అనే ఎలక్ట్రానిక్ పరికరాన్ని చెవి వెనుక భాగంలో అమరిస్తే అది శబ్దాలను గ్రహించి మెదడుకు తీసుకెళ్లే నరానికి అందిస్తుంది. దీనివల్ల ఆ పిల్లలు శబ్దాలను వినగలుగుతారు, మాట్లాడగలుగుతారు. భాష నేర్చుకొని అందరిలాగే జీవితాన్ని గడపగలరు.
అయితే ఈ శస్త్రచికిత్స ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కాక్లియార్ ఇంప్లాంట్ ధర లక్షల రూపాయల్లో ఉంటుంది. వీటిని వాడి చేసే శస్త్ర చికిత్సలకు రూ.10-20 లక్షల వరకు ఖర్చవుతుంది. పేదవారు ఇంత డబ్బు చెల్లించి ప్రైవే టు దవాఖానల్లో ఈ శస్త్ర చికిత్సలను తమ పిల్లలకు చేయించుకోలేరు. ఈ పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం ఈ శస్త్రచికిత్సలను హైదరాబాద్ కోఠిలో ఉన్న ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు వైద్యశాలలో ఉచితంగా నిర్వహిస్తున్నది. పుట్టుకతోనే పూర్తిస్థాయిలో వినికిడి శక్తిని కోల్పోయిన పిల్లల్లో ఆ లోపాన్ని మూడేండ్ల వయస్సులోగా గుర్తిస్తే వారికి ఈ శస్త్ర చికిత్సలను నిర్వహించి వారిలో వినికిడి జ్ఞానాన్ని తెప్పించవచ్చు. తెలంగాణ ప్రభు త్వం ఈ ఆపరేషన్లను ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా నిర్వహిస్తున్నది.
మూడేండ్ల వయస్సు దాటిన పిల్లల్లో మెదడులో శబ్దాలను గ్రహించే స్థానం చచ్చుబడిపోయి ఉంటుం ది. ఆపరేషన్ చేసినా పెద్దగా ఉపయోగం లేనందున ఈ ఆపరేషన్ మూడేండ్ల లోపు పిల్లలకే చేస్తున్నారు. ఎంప్లాయిస్ హెల్త్ కార్డు ఉన్న వారి పిల్లలకు కూడా ఈ ఆపరేషన్ ఉచితంగా చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపుగా 500 మంది చిన్నారులకు ఈ ఆపరేషన్ను ఈ హాస్పిటల్లో ఉచితంగా నిర్వహించారు. ఆపరేషన్ చేసి ఎలక్ట్రానిక్ పరికరం అమర్చిన తర్వాత కొన్ని నెలల పాటు ఆ పిల్లలకు భాష నేర్చుకోవడానికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో పిల్లలు శబ్దాలు వినడం ద్వారా మెల్లమెల్లగా పూర్తిస్థాయిలో మాట్లాడటం నేర్చుకుంటారు.
ఈ ఆపరేషన్ను శిక్షణ పొందిన ఈఎన్టీ స్పెషలిస్టులు మాత్రమే చేస్తారు. హరీష్రావు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిగతా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇలాంటి ఆపరేషన్లు జరగాలని, అప్పుడే అన్ని జిల్లాల్లోని పుట్టుకతో వినికిడి సమస్యతో బాధపడే పిల్లలకు మేలు జరుగుతుందని ఆకాంక్షించారు. ఇందుకోసం ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల ఈఎన్టీ వైద్యులకు ఈ ఆపరేషన్లకు సంబంధించిన శిక్షణను కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో ఇస్తున్నారు. ఇటీవల సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలోనూ ఈ ఆపరేషన్లు చేశారు.
పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారికి వినికిడి శక్తి సరిగా ఉందా లేదా అనే విషయాన్ని తల్లిదండ్రులు సులభంగానే గుర్తు పట్టగలుగుతారు. చిన్న పిల్లలు స్వతహాగానే శబ్దాలు వచ్చే వైపు తల తిప్పి చూస్తారు. చెవి దగ్గర చిటిక వేస్తే వెంటనే అటువైపు తిరిగి చూస్తారు. పుట్టుకతో చెవిటివారు మాత్రం తమ చుట్టూ వినబడే శబ్దాలను వినలేరు, స్పందించరు. మీ పిల్లలు ఇలాంటి పరిస్థితిలో ఉంటే వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈ ఆపరేషన్ చేయిస్తే వినికిడి శక్తి పొందే అవకాశం ఉంటుంది. అలాగే మాటలు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది.
(వ్యాసకర్త: ఈఎన్టీ స్పెషలిస్ట్, ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు వైద్యశాల, కోఠి, హైదరాబాద్)
-డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి
94407 68894