కొన్నేండ్ల కిందట గోరంత సమస్యగా ఉన్న కోతుల బెడద నేడు ఒక ఉప్పెనలా ముంచుకొస్తున్నది. ఊరు, జిల్లా అని కాదు… కోతుల కారణంగా రాష్ట్రంలో ఎక్కడచూసినా రైతులు పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. నాడు సీత జాడ కోసం వెళ్లిన వానర వీరుడు ఆంజనేయుడు అశోకవనం నాశనం చేసి లంకాదహనం చేసింది లోక కళ్యాణం కోసమే అయినా, నేటి వానర మూకల దాడులు మాత్రం వ్యవసాయ వినాశనానికి దారితీస్తున్నాయి. ఈ సమస్యను ఇంకా తేలికగా తీసుకుంటే రాబోయే రోజుల్లో రైతులు తీవ్రంగా నష్టపోయి వ్యవసాయానికి స్వస్తి పలికే ప్రమాదం పొంచి ఉన్నది.
రాష్ట్రంలో ఒకప్పుడు అన్నిరకాల పంటలు పండించే రైతులు, నేడు కోతులు తినలేని వరి, పత్తి, మిర్చి లాంటి పంటలను మాత్రమే సాగు చేస్తున్నారు. తెలంగాణలో నూనె గింజలు, పప్పు దినుసులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే రైతులు నేడు అలాంటి పంటలు వేసి నష్టపోలేమని తేల్చి చెప్తున్నారు. తత్ఫలితంగా రాష్ట్రంలో నూనె, పప్పు దినుసుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఊరూరా విపరీతంగా సాగు చేసే మక్కజొన్న సాగు విస్తీర్ణం కూడా పూర్తిగా పడిపోయింది. నూనెలు, పప్పు దినుసుల దిగుబడి 50 శాతం మేరకు తగ్గిపోయింది. నాడు కాయధాన్యాల పంటలు పండించటంలో తెలంగాణ అగ్రభాగాన ఉండేది. కానీ, నేడు 11వ స్థానానికి పడిపోయింది. కారణం రైతులు రాష్ట్రవ్యాప్తం గా ఎక్కడచూసినా వరి పండించడానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు.
కోతుల ఉత్పత్తి ఏటా గణనీయంగా పెరుగుతున్నది. వాటి దాడుల వల్ల వందల సంఖ్యలో గాయపడ్డ చిన్నపిల్లలు, రైతులున్నారు. ఇటీవల నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో కోతుల దాడిలో ఒక వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. గత ఆరేడేండ్ల కిందట వేల సంఖ్యలో ఉన్న కోతులు, నేడు లక్షల సంఖ్యకు పెరిగాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతుల బెడద వల్ల గ్రామీణ ప్రాంతంలో కూరగాయలకూ తీవ్ర కొరత ఏర్పడుతున్నది. టమాట, సొర, బీర, వంకాయ, బెండకాయ, చిక్కుడు తదితర కూరగాయల పంటలు వేసినా కోతులు మూకుమ్మడి దాడులు చేస్తున్నాయి. ఫలితంగా రైతులు కూరగాయలు కూడా పండించుకోలేని దుస్థితి నెలకొన్నది.
ఒకవేళ పంటలు వేసినా రోజంతా తోట వద్ద కాపలా కాయాల్సిన పరిస్థితి. తెలంగాణలో పండ్ల తోటల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చే రైతులు… కోతుల కారణంగా నేడు వెనకంజ వేస్తున్నారు. మామిడి, జామ, బత్తాయి, నేరేడు, దానిమ్మ, బొప్పాయి, సీతాఫల్ తదితర తోటలను సాగుచేస్తూ మంచి దిగుబడిని సాధించే రైతులకు కోతుల బెడద వల్ల నేడు ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి.
ఆధునిక వ్యవసాయరంగంలో (హార్టికల్చర్) భాగంగా పండ్లు, పూలతోటల వల్ల అధిక దిగుబడులను సాధించేందుకు రైతులు ముందుకు వచ్చి, పలురకాల పండ్ల తోటలు వేశారు. కశ్మీర్లో పండే ఆపిల్, విదేశాల్లో పండే డ్రాగన్ఫ్రూట్స్ వంటి పంటలను కూడా తెలంగాణలో పండించేందుకు రైతులు ముందుకు వచ్చారు. వీరికి సైతం కోతుల బెడద తప్పలేదు. దీంతో వారుకూడా ఆ పంటలకు ఫుల్స్టాప్ పెట్టారు. పండ్ల తోటలకు ప్రాధాన్యం ఇవ్వాలని హార్టికల్చర్ అధికారులు రైతులను ప్రోత్సహిస్తున్నా రైతులు ససేమిరా అంటున్నారు. కోతుల బెడదను తట్టుకొని తాము పండ్ల తోటలు పెంచలేమని కరాఖండిగా చెప్తున్నారు.
కోతుల దాడుల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నా.. ‘కోతుల బెడదకు తాము ఏమీ చేయలేమంటున్నా’రని రైతులు నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. గతంలో పుష్కలంగా కనిపించిన అడవులు నేడు కానరావడం లేదు. రోజురోజుకు జనాభా పెరుగుతుండటం, దానికనుగుణంగా సేద్యం అధికం కావడం వల్ల క్రమంగా అడవులు హరించుకుపోతున్నాయి. ఉన్న అడవుల్లో సైతం కోతుల సంఖ్యకు సరిపోను ఆహారం, నీరు లభించడం లేదు. దీని కారణంగానే కోతులు ఊళ్లపై దాడులు చేస్తున్నాయని ఘంటాపథంగా చెప్పవచ్చు. ప్రభుత్వం ఇప్పటికైనా కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలి. లేకుంటే రాష్ట్ర వ్యవసాయరంగం పెను సవాళ్లను ఎదుర్కోక తప్పదు.
మంగళారపు లక్ష్మణ్
98663 35567