కొనే ప్రతి వస్తువులోనూ, సేవలోనూ లోపం లేకుండా సరైన ధర, తూకం, నాణ్యత, స్వచ్ఛత కలిగినవి పొందే హక్కు వినియోగదారులకు ఉన్నది. కానీ ప్రస్తుత కాలంలో మోసాలు ఎక్కువై పోయాయి. చివరికి మనం తాగే పాలు, నీళ్లలో కూడా నాణ్యత లేకుండా పోతున్నది. తూకాల్లో భారీగా తేడాలు ఉంటున్నాయి. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే, నిలదీస్తే తప్ప న్యాయం జరగడం లేదు. ఈ తరహా మోసాలను అరికట్టాలంటే వినియోగదారులే మేల్కొనాల్సిన అవసరం చాలా ఉంది. తమ హక్కులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరమున్నది.
వినియోగదారులు హక్కుల చట్టం 1986 ప్రకారం తమ అవసరార్థం వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసే వారు వినియోగదారులు. కొనుగోలు దారుల అనుమతితో ఆ వస్తువులు, సేవలు వినియోగించుకొనే వారు సైతం వినియోగదారులే. ఈ నిర్వచనం ప్రకారం అందరూ ఏదో ఒక రకంగా వినియోగదారులే.
చట్టంలో ఏమున్నది…?: భారత ప్రభుత్వం 1986లో వినియోగదారుల హక్కుల రక్షణకు ఒక విప్లవాత్మకమైన చట్టాన్ని తెచ్చింది. అదే ‘వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం’. ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ‘రీడ్రసల్ ఫోరమ్స్’ను ప్రతి జిల్లా కేంద్రంలోను ఏర్పాటు చేసింది. వీటిని జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో మూడు విభాగాలుగా విభజించారు.
వినియోగదారుల హక్కులు… భద్రత హక్కు: కొనే వస్తువులు, పొందే సేవలు వినియోగదారులు తక్షణ అవసరాలు తీర్చడమే కాకుండా అవి సుదీర్ఘ కాలం మన్నేలా ఉండాలి. అవి వినియోగదారుల జీవితాలకు, ఆస్తులకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదు. ఈ భద్రత పొందటానికి వినియోగదారులు కొనే వస్తువుల నాణ్యతను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు ఐఎస్ఐ, అగ్మార్క్, హాల్మార్క్ వంటి నాణ్యతా చిహ్నాలు గల వస్తువులనే కొనుగోలు చేయాలి.
న్యాయం పొందే హక్కు..: అన్యాయమైన వాణిజ్య విధానాలు, మోసపూరిత పద్ధతుల నుంచి న్యాయబద్ధమైన రక్షణ పొందవచ్చు. న్యాయ సమ్మతమైన ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. ఫిర్యాదు ధనపరంగా చిన్న మొత్తానికో లేదా అంశానికో కావచ్చు… అయినా సమాజంపై దాని ప్రభావం అసమానం కావచ్చు.
భారత ప్రమాణాల మండలి: వస్తువుల ప్రమాణాలను గుర్తించేందుకు మన దేశంలో ప్రధానంగా బీఐఎస్, ఎన్టీహెచ్లు పనిచేస్తున్నాయి. ఇవి ఆయా వస్తువులను బట్టి ఐఎస్ఐ, హాల్మార్కింగ్ సర్టిఫికెట్లను ఇస్తుంటాయి. వినియోగదారుల అవసరాలు నెరవేర్చే రీతిలో వస్తువులు, సేవల నాణ్యతలు పరిరక్షించడం బీఐఎస్ ప్రధాన విధి. పరిశ్రమలు, వ్యాపార వర్గాలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందుకునే విధంగా తగిన జాగ్రత్తలను సూచించడం కూడా బీఐఎస్ విధులలో భాగమే. అలాగే స్వర్ణాభరణాల, వెండి ఆభరణాల నాణ్యతకు హాల్ మార్కింగ్ విధానం కూడా బీఐఎస్ విధిలో భాగమే. బీఐఎస్ కింద 5 ప్రాంతీయ కార్యాలయాలు, 32 శాఖా కార్యాలయాలు, 8 ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి. ప్రమాణాల రూపకల్పన, ప్రొడక్ట్ సర్టిఫికేషన్, మేనేజ్మెంట్ సిస్టం సర్టిఫికేషన్, హాల్ మార్కింగ్లలో బీఐఎస్ పనిచేస్తున్నది.
కొనుగోలు విషయంలో సూచనలు: కొనుగోలు చేస్తున్న వస్తువులు, సేవలపై గరిష్ట పరిమాణం, ఏ గ్రేడ్కు చెందినవి, వాటిలో కలిపిన పదార్థాలు, రంగులు, రసాయనాలు, ఎలా ఉపయోగించారో తెలిపే ప్రకటనను వినియోగదారులు కచ్చితంగా గమనించాలి. మందులు, ఆహార పదార్థాల చట్టం ప్రకారం అన్ని ఆహార పదార్థాల ప్యాకేజీలపై విధిగా నికర మొత్తం లేబుల్స్పై చూపాలి. దేనిలో నెట్ కంటెంట్స్ ఎక్కువగా ఉన్నాయో చూసి కొనాలి. కాస్మోటిక్ ఉత్పత్తులపై తప్పకుండా వస్తువు ధర, తయారీ తేదీ, గడువు తేదీ, తయారీదారు చిరునామా, వస్తువు బరువు ముద్రించి ఉండాలి. ఉత్పత్తులపై ముద్రించిన ఎంఆర్పీపై స్టిక్కర్ అంటించి దాని ధరను మార్చి అమ్మడం జరుగుతుంది. ఈ విషయాన్ని కచ్చితంగా గమనించాలి. ఆటో మీటర్లను టాంపరింగ్ చేసి ఎక్కువ తిరిగేలా చేస్తుంటారు. వీటిని టైం టెస్ట్, బెంచ్ టెస్ట్ ద్వారా కనిపెట్టవచ్చు.
పరిహారాన్ని ఎలా పొందవచ్చు: ఎలాంటి కొనుగోళ్లు, లావాదేవీలు చేసినా వినియోగదారుడు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. వారంటీ, గ్యారంటీ ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు ఇతర బిల్లులు, ఇన్వాయిస్ వంటివి జతచేయాల్సి ఉంటుంది. వినియోగదారుల హక్కులకు చట్టపరంగా రక్షణ ఉంటుంది. కొనుగోలు చేసిన వస్తు, సేవలలో లోపాలు ఉన్నా, అమ్మకం దారులు చెప్పినదానికి, వాస్తవ వస్తుసేవలకు తేడాలు ఉన్నా, వినియోగదారుడు నష్టపరిహారాన్ని కోరే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు వినియోగదారుడికి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు తనకు కలిగిన డ్యామేజీని బట్టి నష్టపరిహారాన్ని పొందే హక్కు వినియోగదారుడికి ఉంటుంది.
సమస్యల పరిష్కారం, నష్టపరిహారం కోసం: వినియోగదారులకు ఎదురైన సమస్యలు, నష్టపరిహారం కోసం జిల్లా స్థాయిలో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లు ఏర్పాటు చేశారు. ఇవి 2022 ఫిబ్రవరి నుంచి పూర్తి స్థాయిలో సేవలందిస్తున్నాయి. గత రెండేండ్లుగా ఇవి ఖాళీగానే ఉన్నాయి. గతంలో వీటిని వినియోగదారుల ఫోరాలుగా పిలిచేవారు. వీటిని 2019లో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లుగా మార్చారు.
ఫిర్యాదు ఎలా చేయాలంటే..?: ఫిర్యాదు చేసే విధానం చాలా సులభం. అలాగే దానిపై స్పందన కూడా త్వరగా ఉంటుంది. తెల్ల కాగితంపై ఫిర్యాదు వివరాలు రాసి పంపవచ్చు. న్యాయవాది అవసరం లేదు, ఫిర్యాదుదారుడైనా, అతని ఏజెంటైనా ఫోరంలో స్వయంగా ఫిర్యాదు ఇవ్వవచ్చు. అలా వీలు కాకపోతే పోస్టు ద్వారా కూడా పంపే వీలుంది.
ఫిర్యాదులో ఏం రాయాలి..?: ఫిర్యాదుదారు పూర్తి పేరు, చిరునామా, ఇతర వివరాలు ఏవైనా ఉంటే ఇవ్వడం మంచిది. అలాగే, అవతలి పార్టీ పూర్తి పేరు, చిరునామా, ఫిర్యాదు చేయడానికి గల కారణాలు, ఎప్పుడు.. ఎలా.. జరిగింది, ఏ విధంగా నష్టపోయారనే విషయాలు తెలుపుతూ డాక్యుమెంట్లు, రసీదులు, ఇతర వివరాలు ఏవైనా ఉంటే ఫిర్యాదుకు జత చేయాలి. ఇవి కేసు విచారణ సమయంలో ఉపయోగపడుతాయి. ఫిర్యాదుదారుడు ఏ విధంగా నష్ట పరిహారం అడుగుతున్నాడో వివరణ ఇవ్వాలి.
మోసపోతున్నా ముందుకు రావడం లేదు: వినియోగదారులు నిత్యం మోసపోతూనే ఉన్నారు. మోసాలపై ఫిర్యాదు చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. కారణం సమయం వెచ్చించలేకపోవడం, సరైన అవగాహన లేకపోవడం. అందుకే వినియోగదారులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. దవాఖాన, పెట్రోల్బంక్లు, బంగారం షాపులు, ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యం, సేవాలోపం ఇలా ప్రతి చోటా వినియోగదారుడు మోసపోతున్నాడు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలో ప్రతి చోటా మా కార్యాలయాలను స్థాపించి, వాలంటీర్లను నియమించి అవగాహన కల్పిస్తున్నాం.
(వ్యాసకర్త: వినియోగదారుల హక్కుల ఆర్గనైజేషన్ (www.crobharat.org), రాష్ట్రఅధ్యక్షుడు)