Israel-Palestine conflict | ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం ఇప్పటిది కాదు. దీనికి వందేండ్ల చరిత్ర ఉన్నది. మొదటి ప్రపంచ యుద్ధ సమయం నుంచి ఇదొక రావణకాష్టంలా రగులుతూనే ఉన్నది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒట్టొమాన్ సామ్రాజ్యం ఓటమి పాలైంది. బ్రిటన్ ఆ ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నది. ఆ ప్రాంతంలో యూదులు తక్కువ సంఖ్యలోనూ, అరబ్బులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. పాలస్తీనా ప్రాంతంలో యూదుల రాజ్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రపంచ దేశాలు బ్రిటన్కు అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి.
ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, కొనసాగుతున్న సంఘర్షణలలో ఒకటి. అప్పుడప్పుడు ఘర్షణలు, విధ్వంసాలు, మరణాలు కొనసాగే ఈ ప్రాంతంలో తాజాగా తిరిగి వివాదం చెలరేగింది. దీంతో రెండు ప్రాంతాల్లోనూ వందలాది మంది పౌరులు మరణించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి అనేక కారణాలున్నాయి.
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న రక్తపాత సంఘర్షణను అర్థం చేసుకోవాలంటే, ఆ స్థలం, దానితో సంబంధం ఉన్న వ్యక్తుల నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. ప్రస్తుత సంఘర్షణకు 20వ శతాబ్దంలో మూలాలు ఉన్నప్పటికీ, ఈ ప్రాంతానికి చెందిన పురాతన చరిత్రను కూడా తెలుసుకోవాలి. అక్కడి మతపరమైన, చారిత్రక ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. ఇజ్రాయెల్ పశ్చిమాసియాలోని ఒక చిన్న దేశం, ఇది భారతదేశంలోని ఈశాన్య రాష్ర్టాలు మేఘాలయ లేదా మణిపూర్ పరిమాణంలో ఉంటుంది. ఇజ్రాయెల్ దాని పశ్చిమాన మధ్యధరా సముద్రం, దక్షిణాన ఈజిప్ట్, తూర్పున జోర్డాన్, సిరియా, ఉత్తరాన లెబనాన్ సరిహద్దులుగా కలిగి ఉన్నది. ఇజ్రాయెల్లో యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు మతపరమైన ప్రాముఖ్యత ఉన్న అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ జనాభాలోయూదులు మెజారిటీ స్థానంలో ఉన్నారు. క్రైస్తవులు, ముస్లింలు ఆ తరువాతి స్థానంలో ఉన్నారు.
ఇక్కడి జెరూసలేం ఒక పురాతన నగ రం. దీన్ని ఇజ్రాయెల్, పాలస్తీనాలు రెం డూ తమ సొంతమని క్లెయిమ్ చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ మొత్తం అవిభక్త నగరాన్ని తన రాజధానిగా పేర్కొంటున్నది, అయితే పాలస్తీనియన్లు దీన్ని తిరస్కరిస్తున్నారు. తమ స్వేచ్ఛ, స్వీయ నిర్ణయ హక్కును హరించడమేనన్నది వారి వాద న. ఈ నగరం అబ్రహమిక్ మతాలైన జు డాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం మతాలకు సంబంధించిన అనేక మతపరమైన ప్రాముఖ్యతలను కలిగి ఉన్న పవిత్ర ప్రాం తంగా పరిగణించబడుతుంది.
1948లో ఇజ్రాయెల్ స్వాతంత్య్రం ప్రకటించిన తర్వాత జెరూసలేం పశ్చిమ, తూర్పు భాగాలుగా విభజించబడింది. పశ్చిమ జెరూసలేం ఇజ్రాయెల్ రాజధాని కాగా, తూర్పు జెరూసలేం జోర్డాన్లో భాగమైంది.1967లో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ తూర్పు జెరూసలేంను స్వాధీనం చేసుకున్నది. ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న కొద్దికాలానికే తూర్పు జెరూసలేంకు పొరుగున ఉన్న వెస్ట్ బ్యాంక్ గ్రామాలతో పాటు పశ్చిమ జెరూసలేంలో విలీనం చేయబడింది. అదే సంవత్సరం, ఆక్రమిత స్థలాల నుండి ఇజ్రాయెల్ ఉపసంహరించుకోవాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
1980లో, నెస్సెట్ (ఇజ్రాయెల్ పార్లమెంట్) జెరూసలేం చట్టాన్ని ఆమోదించింది, దీని ప్రకారం జెరూసలేం సంపూర్ణంగా ఇజ్రాయెల్ రాజధాని అని ప్రకటించింది. తూర్పు జెరూసలేంను ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడం చట్టవిరుద్ధమని అంతర్జాతీయ సమాజం అభిప్రాయపడింది. ఇజ్రాయెల్, పాలస్తీనా రెండూ జెరూసలేంను తమ రాజధానిగా ప్రకటించుకోగా, పాలస్తీనియన్లు తూర్పు జెరూసలేంను తమ రాజధానిగా సూచిస్తారు. 2017లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెరూసలేం మొత్తాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించారు.
యూదులు, అరబ్బుల మధ్య సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్య సమితి ఒక ప్రతిపాదన చేసింది. పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్బులకు పంచి ఇచ్చి జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ప్రతిపాదించింది. దీనికి యూదులు అంగీకరించినప్పటికీ, అరబ్బులు వ్యతిరేకించారు. దీంతో ఆనాటి ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనలు అమల్లోకి రాలేదు. ప్రస్తుతం రెండు దేశాల యుద్ధం మూలంగా అమాయకులైన ప్రజలు బలవుతున్నారు. ప్రపంచ శాంతి లక్ష్యంగా ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి మరొకసారి జోక్యం చేసుకొని, సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్తుందని ఆశిద్దాం.
రాగిపని బ్రహ్మచారి
95424 64082