‘పుట్టుక నీది చావు నీది.. బతుకంతా దేశానిది..’ ప్రజాకవి కాళోజీ కవితా పాదాలతో ప్రారంభమై.. ‘కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో/ పసిపాపల నిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంతో..’ అని దాశరథి కృష్ణమాచార్య ఆశావహ లోకాన్ని కలగన్నారు. తెలంగాణ వైతాళికులు ఇద్దరి ఆలోచనాసరళి వర్ధిల్లాలని రాష్ట్ర శాసనసభా సాక్షిగా రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆకాంక్షించారు.
తెలంగాణ శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు. గత కొంతకాలంగా ఆమె రాష్ర్టాభివృద్ధిపై తాను చేసిన విమర్శలు.. ఆరోపణలు.. లేవనెత్తిన అంశాలు నిజం కావనే విషయాన్ని ఆమెనే స్వయంగా, సాధికారికంగా తన ప్రసంగం ద్వారా చెప్పారు. అయితే గవర్నర్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రూపొందిస్తుంది. ఈ ప్రసంగాన్ని గవర్నర్ యధాతథంగా చదువవచ్చు. లేదా ప్రభుత్వానికి ఏవైనా సూచనలు చేయదలచుకుంటే చేయవచ్చు. గవర్నర్ చేసిన సూచనలను ప్రభుత్వం పాటించవచ్చు, పాటించకపోనూవచ్చు. ఇక్కడ గవర్నర్ ప్రసంగం ఉంటుందని, తెలిసినప్పటి నుంచి రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన చర్చకు కొంతమంది తెరలేపారు.
గత నెల (జనవరి 9న) తమిళనాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి అనుసరించినట్టే ఇక్కడా గవర్నర్ తమిళి సై అనుసరిస్తారని అత్యుత్సాహంతో కొంతమంది ఆశించారు. అలా ఆశించినవారికి ఆశాభంగమే ఎదురైందని చెప్పాలి. తమిళనాడు పరిస్థితులు వేరు, తెలంగాణలో పరిస్థితులు వేరని ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములైన వారు చెప్పటం కాదు, రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు అద్దంపట్టే రీతిలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు ఆయా సందర్భాల్లో అందించిన అవార్డులు.. చేసిన ప్రశంసలే నిదర్శనాలు. తెలంగాణ నేల మీద పుట్టి ఇక్కడే బతుకును పండించుకుంటున్న ప్రతీ పౌరుడికి రాష్ట్రం ఆవిర్భవించకముం దూ తర్వాత వచ్చిన మార్పు స్పష్టి సదృశ్యమానమే. తెలంగాణలో అన్నిరంగాల్లో ప్రగతి కండ్లముందు కనిపిస్తున్నది. ఈ వాస్తవాన్ని కాదనే సాహసం గవర్నర్ చేయలేకపోయారనేది కఠోర సత్యం.
అభివృద్ధి అంటే అందమైన నిర్మాణాలు కాదని గతంలో తాను చేసిన వ్యాఖ్యలు నిజం కాదని గవర్నర్ శుక్రవారం అసెంబ్లీలో సగర్వంగా ప్రకటించారు. ‘తెలంగాణ రాష్ట్ర పరిపాలనా ప్రతిపత్తికి సంకేతంగా నా ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు నేను సభాముఖంగా.. హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. పరిపాలనా మరింత ప్రభావపూరితంగా సాగేందుకు ఈ భవనంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది’ అని…
అలాగే పరిపాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ‘నా ప్రభుత్వం రాష్ర్టాన్ని 33 జిల్లాలుగా పునర్విభజించింది. విశాలంగా సకల మౌలిక వసతులతో, జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేవిధంగా నూతన సమీకృత కలెక్టరేట్ భవనాలను ప్రభుత్వం ఘనంగా నిర్మించింది’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు యాదగిరి దేవాలయ పునర్నిర్మాణాన్ని ఆమె చారిత్రక అద్భుతంగా కీర్తించి.. ఈ ప్రభుత్వ నిర్మాణాత్మక ప్రగతిని ప్రశంసపూర్వగా, సంకేతంగా గవర్నర్ దేశం ముందుంచారు.
దేశం గుణాత్మక మార్పు కోరుకుంటున్నదని, ఆ మార్పు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమవుతుందనే సంకేతాన్ని గవర్నర్ తన ప్రసంగం ద్వారా దేశానికి చెప్పారు. గవర్నర్ ప్రసంగం వెనుక కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రస్తావన, ఆయన అజేయ ప్రయాణానికి సంకేతంగా కనిపిస్తున్నది. కేసీఆర్ అలుపెరుగని పోరాట పటిమతో తెలంగాణను సాధించటం, సాధించిన రాష్ర్టాన్ని అచిరకాలంలోనే దేశానికి మార్గదర్శిగా నిలబెట్టిన తీరు ఇవ్వాళ దేశాన్ని ఆకర్షిస్తున్నది. నాడు జయప్రకాశ్ నారాయణ రూపంలో దేశ రాజకీయాల్లో వచ్చిన మార్పునే ఇవ్వాళ దేశం కేసీఆర్ రూపంలో కోరుకుంటున్నదని గవర్నర్ ప్రసంగం స్పష్టం చేసింది. ఇలాగే ‘అన్నార్థులు.. అభాగ్యులండని ఆ నవయుగమదెంత దూరమో.. కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో’ అని దాశరథి కలవరించిన పరిస్థితులను తెలంగాణలో అచిరకాలంలోనే నెరవేర్చారు. ఇదే స్ఫూర్తితో దేశగతిని కేసీఆర్ మార్చగలరనే విశ్వాసాన్ని గవర్నర్ తన ప్రసంగం ద్వారా ప్రస్ఫుటించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రవర్థమానంగా వర్ధిల్లుతున్నది.
భారతదేశం తెలంగాణలో సాధించిన ప్రగతిని కాంక్షిస్తున్నది. దేశం తెలంగాణ చుట్టూ పరిభ్రమిస్తున్నదని ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు తేల్చిచెప్తున్నాయి. తెలంగాణ సరిహద్దు రాష్ర్టాల్లో బీఆర్ఎస్ పొలికేక పెడుతున్నది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర నుంచి మొదలుకొని ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ర్టాలకు తెలంగాణ రాజకీయ పాఠశాలగా అవతరించింది. రాజకీయంలో తలపండిన నాయకులు, సుదీర్ఘకాలం పాటు ప్రజాసేవలో పుణీతులైనవారు, ఈ దేశం బాగుపడాలని కలలుగంటున్న వివిధ రంగాల మేధావులు, విజ్ఞులు తెలంగాణ దేశానికి నాయకత్వం వహించాలని కోరు కుంటున్నారు. కేసీఆర్ రూపంలో దేశం గుణాత్మక మార్పు సాధిస్తుందన్న అచంచలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ విశ్వాసాలకు శుక్రవారం గవర్నర్ ప్రసంగం ప్రేరణగా నిలుస్తున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో చేసిన ప్రసంగం కేసీఆర్ జాతీ య రాజకీయ ముఖద్వారమై కాంతులీనింది.
-నూర శ్రీనివాస్
91827 77011