Jamili Elections | కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరపాలని నిర్ణయించటం తెలిసిందే. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రే స్వయంగా ఈ సంగతి చెప్పారు. ఏం ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కావడానికి అని చాలామంది సహజంగానే అనుకుంటున్నారు. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌరస్మృతి, మహిళా రిజర్వేషన్ బిల్లు లాంటి వాటిని ఈ సమావేశాల్లో చేపడతారని వింటున్నాము. జమిలి ఎన్నికలు అనేది గతంలో వినిపించినా ఈ మధ్యకాలంలో దాని ప్రస్తావన పెద్దగా రాలేదు.
ఒకవేళ పార్లమెంటులో బలం కోల్పోయి కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే పడిపోయింది అనుకుందాము ఉదాహరణకు. అప్పుడు పార్లమెంటుకు మాత్రమే ఎన్నికలు జరిపే వీలుండదు. ఐదు ఏండ్లూ ఆగాలి కదా ఎన్నికలకు. అంటే దీని అర్థం అవిశ్వాస తీర్మానం అనే పార్లమెంటుకున్న బలమైన ఆయుధాన్ని నిర్వీర్యం చెయ్యటమే కదా.
హిందూత్వ వాదులకు ఒకటి అనే దాని మీద మక్కువ మిక్కిలి ఎక్కువ అనేది అందరికీ తెలిసిందే. అంటే ఒక దేశం ఒకే పన్ను, ఒక దేశం ఒకే భాష, ఒక దేశం ఒకే పౌరస్మృతి, ఒక దేశం ఒకే ఎన్నిక, ఒక దేశం ఒకే వాతావరణం (జస్ట్ సరదాకి మాత్రమే) మొదలైనవి. బ్రిటిష్వారు ఇండియా మొత్తాన్నీ ఒకే టైమ్ జోన్గా చేసి సంఘ్ పరివార్కు అన్యాయం చేశారనుకోవాలి! అమెరికాలో లాగా మనకి కూడా రెండు, మూడు టైమ్ జోన్లు ఉన్నట్టయితే ఒక దేశం ఒకే సమయం అనే నినాదంతో మొదలయ్యేది ఈ ఏకీకరణ అనే ఉన్మాదపు ఉద్యమం. ఈ వేదికలోనే గతంలో చర్చించుకున్నాం సంఘ్ పరివార్కు భిన్నత్వం వద్దంటే వద్దు, ఐక్యత కన్నా ఏకీకరణే ముద్దు అని. అంటే యూనిటీ కన్నా యూనిఫామిటీ ముఖ్యమనేది నాగపూర్ నమ్మే సిద్ధాంతం. ఇప్పుడు నాగపూర్ ప్రాధాన్యత తగ్గిపోయింది. అహ్మదాబాద్ ఆధిక్యత పెరిగింది. అది వేరు విషయం.
ఊరు ఏదైనా తీరు మాత్రం అదే. అందులో సందేహం లేదు. దేశం ఐక్యమత్యంగా ఉండటం కన్నా దేశమంతా ఒకలా ఉండాలనేది సంఘ్ పరివార్ భావజాలంలో ప్రధానమైన అంశం. సంఘ్ పరివార్ కావాలనుకునే ఏకీకరణకు మూలం హిందూ మత సాంప్రదాయాలు. ఒకసారి ఏకీకరణ ముసుగులో హిందూ మత సాంప్రదాయాలను దేశమంతటా ఆచరణలో పెట్టామంటే అప్పుడు వారు కోరుకున్నట్టుగా ఇండియా ఒక హిందూరాజ్యంగా అవతరించటం తేలిక. హిందూత్వవాదుల ఆలోచనకి ఆంతర్యం ఇదే అనిపిస్తుంది దీర్ఘంగా ఆలోచించేవారికి. లేకపోతే ఒక దేశం ఒకేసారి ఎన్నిక అనేది ఎలాసాధ్యం మనఫెడరల్ వ్యవస్థలో? పార్లమెంటులో బలం ఉన్నది గనక రాజ్యాంగాన్ని సవరించి, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించి జమిలి ఎన్నికల విధానం అమలులో పెడితే భవిషత్తులో వచ్చే పరిణామాలేంటి? ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం అర్ధాంతరంగా పడిపోయింది అనుకుందాము. అప్పుడు ఆ రాష్ట్రం వరకే ఎన్నిక జరపటం కుదరదు కదా! అటువంటి పరిస్థితిలో ఆ రాష్ర్టాలు కూడా పార్లమెంటుకు ఎన్నికలు వచ్చేదాకా రాష్ట్రపతి పాలనలో ఉండాల్సిందే కదా. అలాంటి పరిస్థితిలో తమ మతపరమైన అజెండాను అడ్డుఅదుపు లేకుండా ఆయా రాష్ర్టాల్లో ప్రజల మీద రుద్దవచ్చు అనేది వారి ఆలోచనగా అనిపిస్తున్నది.
దేశంలో పార్లమెంటుకు, రాష్ర్టాలకు ఒకేసారి ఎన్నికలు జరిపితే ఖజానాకు ఎంతో ఖర్చు తగ్గుతుంది అనే వాదన వినిపిస్తుంటారు బీజేపీ పెద్దలు. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు వెన్నెముక వంటివి. ఎంత ఖర్చయినా ఎన్నికలు జరిపించటం అనేది ప్రజాస్వామ్యానికి ఒక వేడుక. ఖర్చు అనేది ఒక కుంటిసాకు. ఖర్చు తగ్గుతుందని ఇంట్లో పిల్లలందరికీ ఒకేసారి పెండ్లి చేస్తామంటే ఎంత విడ్డూరంగా ఉంటుందో ఇదీ అంతే.
ఎన్నికలు ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తాయి మనదేశంలో. కార్లకు, మైకులకు, షామియానాలు, కేటరింగుకు, కార్యకర్తలకు, కార్మికులకు, మేళంవాళ్లకు, ఒకరనేమిటి, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తాయి. ఇహ ఓటర్లకు పైసలియ్యటం అనేది రాజకీయ పార్టీలు చేసిన అలవాటు. 30 ఏండ్ల క్రితం పార్లమెంటుకు గానీ అసెంబ్లీకి గానీ జరిగే ఎన్నికల్లో ఓటర్లకు పైసలియ్యటం అనేది లేదు. పంచాయతీ ఎన్నికల్లో ఉండేది ఓటరుకు డబ్బులివ్వటం. అది పరిమిత స్థాయిలో జరిగే ఎన్నిక కాబట్టి అక్కడ సరిపోయిందేమో కానీ, పార్లమెంటు అసెంబ్లీ స్థాయి ఎన్నికల్లో అది భారీ స్థాయిలో ఉంటుంది.కానీ ఎవరు దీనికి బాధ్యులు?
ఇది ఊహించే బాబాసాహెబ్ అంబేద్కర్ పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి హాని చేసేదే గానీ మేలు చేసేది కాదు అని చెప్పారు. కానీ ఆయన మాటను పెద్దగా పట్టించుకోలేదు ఆనాటి పెద్దలు. పంచాయతీల వలన గ్రామాల్లో ప్రజాస్వామ్యానికి పునాదులు ఏర్పడతాయి అనుకున్నారు. ఇప్పుడు వర్గ రాజకీయానికి పుట్టిల్లు పంచాయతీలు. పంచాయతీలు అగ్రవర్ణాలవారి చేతుల్లో బందీలవుతాయి అని కూడా అన్నారు. అంబేద్కర్ భయపడినట్టు సరిగ్గా అదే జరుగుతున్నది ఇప్పుడు మన పంచాయతీ ఎన్నికల్లో. ధనికులే పోటీ చెయ్యగలరు. ఖర్చు చేసిన డబ్బు రాబట్టుకోవటానికి నానా అడ్డదారులు తొక్కాలి. ఈ విష సంస్కృతి జాతీయస్థాయికి ఎదిగింది. ఇప్పుడు దీన్ని అదుపుచెయ్యటం ఎవరివల్లా కావటం లేదు.
సరే జమిలి ఎన్నికలు కావాలంటే అది రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యం. అదికూడా సగం రాష్ర్టాల అసెంబ్లీలు ఆమోదించాలి. అప్పుడే అది చట్టం అవుతుంది. కానీ దానికి చాలా చిక్కు ప్రశ్నలున్నాయి. ఇటీవలే ఎన్నికలు జరిగిన కర్ణాటక రాష్ర్టానికి మళ్ళీ ఎన్నికలా? ఎవరి కోసం? పోయినసారి దక్కని అవకాశం కోసం మరోసారి చేసే ప్రయత్నమేనా ఇది? కర్ణాటక ప్రజలు ఆమోదిస్తారా? దేశంలో సగం అసెంబ్లీలు ఆమోదిస్తే చాలు. ఆ సగంలో కర్ణాటక లేకపోయినా ఫర్వాలేదు. లేకపోతే జమిలి ఎన్నికల అవసరమేముంది? ఒకవేళ పార్లమెంటులో బలం కోల్పోయి కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే పడిపోయింది అనుకుందాము ఉదాహరణకు. అప్పుడు పార్లమెంటుకు మాత్రమే ఎన్నికలు జరిపే వీలుండదు. ఐదు ఏండ్లూ ఆగాలి కదా ఎన్నికలకు. అంటే దీని అర్థం అవిశ్వాస తీర్మానం అనే పార్లమెంటుకున్న బలమైన ఆయుధాన్ని నిర్వీర్యం చెయ్యటమే కదా. పార్లమెంటుకు ఉండే అధికారాన్ని పార్లమెంటు సహాయంతోనే తొలగించటమే అని ఎందుకు అనుకోకూడదు సామాన్య మనిషి? కానీ ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగించే చర్యే. కేశవానందభారతి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నది కానీ ఆ సవరణలు రాజ్యాంగపు మౌలిక స్వరూపాన్ని మార్చేవిగా ఉండకూడదు అని.
కానీ ఈ మార్పులను వ్యతిరేకిస్తూ ఎవరైనా కోర్టు మెట్లు ఎక్కటం, అక్కడ వాయిదాలూ, వాదనలూ పూర్తయ్యే సరికి ఏ ఐదేండ్లో పట్టొచ్చు. ఈలోపు మళ్లీ ఎన్నికలకు సమయం వస్తుంది. తెలంగాణ హైకోర్టులో 2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కేసుల్లో తీర్పు వచ్చేసరికి అసెంబ్లీ కాలం దాదాపుగా ముగిసింది. మరో మూడు నెలల్లో అసెంబ్లీ కాలం ముగుస్తుందనగా తీర్పు వెలువడిన విషయం మనం చూశాము ఇటీవల. కోర్టుల్లో పెండింగ్ కేసులు ఆ స్థాయిలో వున్నాయి. దానిమీద జరగాలి చర్చ. జమిలి ఎన్నికల మీద కాదు. కోర్టుల్లో సత్వర న్యాయం జరగాలంటే ఏమి చెయ్యాలి అనేదాని మీద దృష్టి పెట్టాలి.
రాజ్యాంగపు మౌలిక స్వరూపానికి, మన సమాజపు సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగించే చర్యలు మంచివి కావు. అందునా ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు. అమెరికాలో లాగా మన వ్యవస్థలో ‘లేమ్ డక్ ప్రభుత్వం’ అనే మాట లేకపోయినా ఎన్నికలకు ఒక ఏడాది ఉన్నప్పుడు ప్రభుత్వాలు రాజ్యాంగపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోకుండా నిలువరించే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనే సంప్రదాయాలను ప్రజలు, పార్లమెంటు, పాలకులు, న్యాయస్థానాలు, మీడియా, మేధావి వర్గం కలిసి బలోపేతం చెయ్యాలి.
అయితే రాబోయే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఏయే అంశాలు ఉంటాయనేది ప్రభుత్వం ఇంకా చెప్పకపోయినా మీడియాలో వచ్చే కథనాలు ఒక సంకేతంగా తీసుకోవచ్చు. రాజకీయ నాయకులు వారి మనసులో ఉన్నది నేరుగా బయట పెట్టకుండా మీడియాకు లీకులివ్వటం మనకు మామూలే. దీనివలన కూడా ఒక ప్రయోజనం వుంది. ప్రజలు మానసికంగా సిద్ధమవుతారు రాబోయే పరిణామాలకు. జీ-20 సదస్సులో ఏమి జరిగిందో చర్చించటానికి మరియు చంద్రయాన్ విజయానికి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడానికి అని కూడా వింటున్నాము. ఏదేమైనా ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేస్తుందో చెప్పేవరకు సమావేశాల అజెండా అధికారపూర్వకంగా తెలిసేవరకూ మనం చేసేవన్నీ ఊహాగానాలే. అయితే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఎందుకూ అనేది కూడా పాలకులు చెప్తే బాగుండేది.
-గుమ్మడిదల రంగారావు