Telangana | ‘ఆధునిక యుగంలోనూ అంధకారంలో బతుకులు వెళ్లదీసిన దీనస్థితి నుంచి ఒక్క నిమిషం కూడా కరెంటు పోని పరిస్థితులను సృష్టించింది తెలంగాణ. పగలు కరెంట్ ఎలా ఉంటుందో తెలియని తెలంగాణ రైతన్న నేడు వ్యవసాయానికి ఇస్తున్న 24 గంటల నిరంతర ఉచిత కరెంటుతో రాత్రిళ్లు ఇంట్లోనే కంటి నిండా నిద్రపోతున్నడు. పవర్ హాలీడేలతో వెనక్కి వెళ్లడానికి సిద్ధమైన పరిశ్రమల యాజమాన్యాలు, తెలంగాణ వచ్చిన తర్వాత నిరంతర కరెంటుతో తమ పరిశ్రమల్లో ఉత్పత్తిని పెంచాయి. ఇది కేవలం తొమ్మిదేండ్లలో తెలంగాణ విద్యుత్ రంగంలో సాధించిన గొప్ప విజయం’ అని వివరిస్తున్నారు ఎన్ శివాజీ.
తెలంగాణలో బొగ్గు ఉంది. విద్యుత్కు డిమాండ్ ఉంది. అయినప్పటికీ ఉమ్మడి ఏపీలో పాలకులు కొత్త పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే భూపాలపల్లిలో 600 మెగావాట్లు, కొత్తగూడెంలో 800 మెగావాట్లు, మణుగూరులో 1080 మెగావాట్ల సామర్థ్యం గల ఐదు థర్మల్ పవర్ స్టేషన్లను నిర్మించి ఉత్పత్తిని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం.
తెలంగాణ ఆవిర్భావానికి ముందు తెలంగాణలో విద్యుత్ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో పగలు కరెంటు అనే మాటనే మర్చిపోయారు. ఆ రోజుల్లో కరెంటును నమ్ముకుని వ్యవసాయం చేయడానికి ధైర్యం చేయని పరిస్థితి రైతులది. అలాంటి స్థితి నుంచి తెలంగాణ సాధించుకున్న అనతికాలంలోనే తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ సాధించుకున్న క్షణం నుంచి ముందుగా విద్యుత్ సరఫరా పరిస్థితిని మార్చాలనే లక్ష్యంతో ఎప్పటికప్పుడు ఒక విద్యుత్ ఇంజినీర్లాగా సూచనలు చేస్తూ, మాకు మార్గనిర్దేశనం చేశారు. విద్యుత్ రంగంతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని కేసీఆర్ గట్టిగా నమ్మారు. ఆయన వేసిన అడుగులే తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి వైపు దూసుకువెళ్లడానికి ఎంతో దోహదపడ్డాయి. కోతలు లేని నాణ్యమైన కరెంట్ను అందించడానికి సమావేశాలు, సమీక్షలు, నిరంతర పర్యవేక్షణలతో ఆర్థికంగా చేయూతనిచ్చి ఆరు నెలల్లోపే అందరికి విద్యుత్ను ఇవ్వడం వెనుక సీఎం కేసీఆర్ కఠోర శ్రమ దాగి ఉన్నది. ఆయన దార్శనికత, ఆర్థికంగా అందించిన చేయూత వల్ల తెలంగాణలో విద్యుత్ రంగం నిలదొక్కుకున్నది. ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ను బలోపేతం చేయడానికి రూ.38 వేల కోట్లు ఖర్చు చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయడం వల్లనే నిరంతర విద్యుత్ సాధ్యమైంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి దేశంలోనే అగ్రగామిగా నిలిచారు. అందుకే ఆయన మీద, రాష్ట్రం మీద నమ్మకం పెరిగి ప్రధానంగా హైదరాబాద్కు తరలివస్తున్న పరిశ్రమలు రాష్ర్టాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నాయి. ఒక్క ఐటీ రంగంలోనే నాడు 56 వేల కోట్లున్న ఎగుమతులు నేడు 2.20 లక్షల కోట్లకు చేరుకున్నాయి. నాడు ఐటీరంగంలో మూడున్నర లక్షల ఉద్యోగాల నుంచి నేడు 8.5 లక్షల ఉద్యోగాలకు చేరుకున్నాం. నిరంతర విద్యుత్ సరఫరాతో రాష్ట్రంలో కోటిన్నర ఎకరాలు సాగులోకి వచ్చి పచ్చని పంటలతో తెలంగాణ సస్యశ్యామలంగా విలసిల్లుతుంది.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం విద్యుత్రంగానికి పెద్దపీట వేసింది. రైతాంగాన్ని, రాష్ట్ర ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 24 గంటల నిరంతర, ఉచిత కరెంటు సరఫరా చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, లాండ్రీ, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో విద్యుత్ సబ్సిడీలు భారీగా పెరిగాయి. 2014కు ముందు ఇచ్చిన సబ్సిడీలు ఏడాదికి కేవలం రూ.4,500 కోట్లు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇస్తున్న విద్యుత్ సబ్సిడీలు రూ.12,000 కోట్ల పైమాటే. తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా రూ.1000 కోట్ల సబ్సిడీలను విద్యుత్ డిస్కంలకు చెల్లిస్తున్నది. 620 మీటర్ల ఎత్తు ఉన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి 9000 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తూ నీటిని ఎత్తిపోయడం ద్వారా కోటి 18 లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో విద్యుత్రంగం పాత్ర ఎనలేనిది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి కేవలం 7,770 మెగావాట్లు. ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తి 18,000 మెగావాట్లపైనే.
రాష్ట్రం రాకముందు తెలంగాణలో విద్యుత్ డిమాండ్ సుమారుగా 6000 మెగావాట్లు ఉంటే, నేడు విద్యుత్ డిమాండ్ 15,750 మెగావాట్లకు చేరుకున్నది. ఇది తెలంగాణ ప్రగతికి నిదర్శనం. అయితే తెలంగాణ ప్రజల అవసరాలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పంటలను కాపాడటానికి అవసరమైతే ప్రభుత్వం నష్టాలను భరిస్తూ యూనిట్కు రూ.20 చొప్పున కొనుగోలు చేసి సరఫరా చేయడానికి తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి నిదర్శనంగా చెప్పవచ్చు. నాటి రోజుల్లో పాలకులు విద్యుత్ను వ్యాపార రంగంగానే చూశారు. అందుకే లాభాలు ఆశించారే తప్ప రైతాంగం, ప్రజల అభ్యున్నతి కోసం అవసరమైనప్పుడు విద్యుత్ కొనుగోలు చేయలేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యుత్రంగంలో 12,000 కొత్త ఉద్యోగుల నియామకం, ఔట్ సోర్సింగ్లో పనిచేస్తున్న 22,600 మందిని ఆర్టిజన్లుగా మార్చడం, విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీలు ఇవ్వడం వంటి కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి.
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ విద్యుత్ వలయాన్ని నిర్మించింది. దేశంలో ఎక్కడ కరెంట్ పోయినా హైదరాబాద్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చేసింది. హైదరాబాద్ చుట్టూరా 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్ స్టేషన్లను నిర్మించి మొత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థను ఒకదానికొకటి అనుసంధానం చేసింది. శ్రీశైలం, కొత్తగూడెం, నాగార్జునసాగర్, రామగుండం, కేటీపీపీల నుంచి వందల కిలోమీటర్ల విద్యుత్ లైన్ల కోసం వేల కోట్లు ఖర్చుచేసింది. హైదరాబాద్లో ప్రతి ప్రాంతానికి రెండు లైన్ల ఏర్పాటుతో నిరంతర విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా చేసింది. తొమ్మిదేండ్ల కింద గాలి దుమారం/వర్షం వస్తే సబ్ స్టేషన్లలోనే విద్యుత్ సరఫరాను నిలిపి వేసేవారు. కానీ నేడు ఎంత వర్షం వచ్చినా, గాలి దుమారం వచ్చినా విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా జరుగుతున్నది. నేడు విద్యుత్ సంస్థల్లో జవాబుదారీతనం పెరిగింది. ఎనర్జీ ఆడిటింగ్ జరుగుతున్నది. నాడు ఏడాదికి 40 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడితే నేడు 90 వేల యూనిట్లకు చేరుకోవడమే విద్యుత్ రంగంలో తెలంగాణ ఘననీయమైన ప్రగతిని సాధించిందనడానికి నిదర్శనం.
(వ్యాసకర్త: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు)
ఎన్.శివాజీ