తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత, మన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఔరంగాబాద్లో అడుగు మోపుతున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్, కాంధార్ లోహ సభలు అపారమైన జనాదరణతో విజయవంతమైన నేపథ్యంలో మరో అడుగు ముందుకేసి, మరాఠ్వాడ రాజకీయ కేంద్రమైన ఔరంగాబాద్లో లక్షలాదిమంది సమక్షంలో భారత రాష్ట్ర సమితి శంఖారావం పూరించనున్నారు. వివక్షకు గురై ఆదరణకు నోచుకోక వెనుకబడ్డ మరాఠ్వాడ ప్రజలు కేసీఆర్ సందేశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పశ్చిమ మహారాష్ట్ర ముఖద్వారమైన ఔరంగాబాద్ వేదికగా ఎలుగెత్తే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం కొంకణ్, నాసిక్, పూణేలతోపాటు ఉత్తరాన ఉన్న అమరావతి, నాగపూర్లలో కూడా ప్రతిధ్వనించనుంది. ఆ రాష్ట్ర రాజధాని ముంబైలో ప్రకంపనలు సృష్టించనుంది.
తెలంగాణ-మరాఠ్వాడ ప్రాంతాలకు, హైదరాబాద్-ఔరంగాబాద్కు మధ్య అవినాభావ సంబంధం శతాబ్దాలుగా కొనసాగుతున్నది. ఈ రెండు ప్రాంతాలు బింబ ప్రతిబింబాలు. ఈ ప్రాంతానికి చెందిన లాతూర్, నాందేడ్ జిల్లాలు తెలంగాణ సరిహద్దుకు ఆవల ఉంటాయి. ఉస్మానాబాద్, బీడ్, పర్భణి, హింగోలి జిల్లాల్లో తెలంగాణ ప్రజలు విశేష సంఖ్యలో దశాబ్దాలుగా స్థిరపడి కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలు సహా హైదరాబాదులో పెద్దసంఖ్యలో మరాఠ్వాడా ప్రాంత ప్రజలు స్థిరపడిపోయారు.
రాకపోకలతో, వ్యాపార, విద్య, సాంస్కృతిక, వైవాహిక సంబంధాలతో ఉభయ ప్రాంతాల ప్రజలు కలిసి మెలిసి జీవిస్తున్నారు. రాజకీయాలలో సైతం పరస్పర సహకారం కొనసాగుతున్నది. ఆదిలాబాదు సరిహద్దుకు అవతలి ఒడ్డున ఉన్న యావత్మల్, ధర్మాబాద్ మూలాల నుంచి ఎదిగి వచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రులైన వసంతరావు నాయక్, సుధాకర్రావు నాయక్, శంకర్రావు చవాన్, అశోక్ చవాన్ల విజయాలలో ప్రధాన పాత్ర పోషించింది తెలంగాణ బిడ్డలే.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం 1948-56 మధ్యకాలంలో కూడా మరాఠ్వాడ హైదరాబాద్ రాజ్యంలో అంతర్భాగం. హైదరాబాద్ కంటే ముందే ఔరంగాబాద్ నిజాం రాజ్యం రాజధాని. ఈ రెండు నగరాలు సుమారుగా ఒక దశాబ్దం అటుఇటుగా నిర్మాణమైనవే. రజాకార్ల నియంతృత్వానికి, భూస్వామ్య వ్యవస్థ దమనకాండకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడినట్టే మరాఠ్వాడ ప్రజలు పోరాటాలు చేశారు. నిర్బంధాలు, నిషేధాలు, కాల్పులు, కారాగారాలు, వీర మరణాలు.. ఉద్యమం ఉద్వేగభరిత ఘట్టాల్లో ఉభయ ప్రాంతాల ప్రజలు భుజం భుజం కలిపి నడిచారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. అజేయంగా ప్రగతి పథంలో సాగుతున్నారు. దీనితో మరాఠ్వాడ ప్రజలు కూడా తమ అస్తిత్వ ఆత్మగౌరవ పతాకను ఎగుర వేయగలిగేది కేసీఆర్ ఒక్కరే అన్న అభిప్రాయానికి వచ్చారు. అందుకే బీఆర్ఎస్ను ఆదరిస్తున్నారు. సుమారు రెండు కోట్ల జనాభా, 65 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, నాలుగింట మూడో వంతు వ్యవసాయ యోగ్యమైన భూమి, గోదావరి, కృష్ణా, తాపీతోపాటు మరో పది దాకా నదుల పరీవాహక ప్రాంతాల భూములు ఉన్నప్పటికీ మరాఠ్వాడ కరువుతో నేటికీ సతమతమవుతున్నది.
రావి నారాయణరెడ్డి, రామానంద తీర్థ, కాళోజీ వంటి తెలంగాణ యోధుల కార్యకలాపాలు ఔరంగాబాద్ సరిహద్దుల దాకా విస్తరించగా, గోవిందభాయ్ ష్రాప్, విజయేంద్ర కబ్ రా, రామన్ భాయ్ పారిక్, పట్వర్ధన్ వంటి మరాఠ్వాడ వీరులు తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. మనలాగే అక్కడి ప్రజలు అమరవీరుల స్తూపాలు నిర్మించుకున్నారు. పర్భణీ నగరంలో ఉన్న అమరవీరుల స్తూపం మరాఠ్వాడలోని దర్శనీయ స్థలాల్లో ఒకటి. స్వాతంత్య్రం వచ్చాక 13 నెలలకు అంటే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణలో మువ్వన్నెల జెండా ఎగిరిన రోజే మరాఠ్వాడాలోనూ రెపరెపలాడింది. భాషా ప్రయుక్త రాష్ర్టాల పేరిట జరిగిన కుట్రకు తెలంగాణ బలి అయినట్లే మరాఠ్వాడ బలైపోయింది. ఔరంగాబాద్ రాజధానిగా మరాఠ్వాడ ప్రత్యేక రాష్ట్ర నినాదం చీకట్లో కలిసిపోయింది.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. అజేయంగా ప్రగతి పథంలో సాగుతున్నారు. దీనితో మరాఠ్వాడ ప్రజలు కూడా తమ అస్తిత్వ ఆత్మగౌరవ పతాకను ఎగుర వేయగలిగేది కేసీఆర్ ఒక్కరే అన్న అభిప్రాయానికి వచ్చారు. అందుకే బీఆర్ఎస్ను ఆదరిస్తున్నారు. సుమారు రెండు కోట్ల జనాభా, 65 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, నాలుగింట మూడో వంతు వ్యవసాయ యోగ్యమైన భూమి, గోదావరి, కృష్ణా, తాపీతోపాటు మరో పది దాకా నదుల పరీవాహక ప్రాంతాల భూములు ఉన్నప్పటికీ మరాఠ్వాడ కరువుతో నేటికీ సతమతమవుతున్నది. వరుసగా తలెత్తుతున్న వ్యవసాయ సంక్షోభాల నుంచి గట్టెక్కించే నాథుడే లేడు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువే. ఏ గ్రామానికి వెళ్లినా పేదరికం, దైన్యం, వెనుకబాటుతనం అడుగడుగునా కనిపిస్తాయి. పక్కనే ఉన్న అమరావతి, నాగపూర్ రీజియన్లలోని విదర్భ ప్రాంతంతో పోల్చుకొన్నప్పుడు మరాఠ్వాడ దాని దరిదాపుల్లో ఉండదు. తూర్పువైపున ఉన్న ముంబై, పుణె ప్రాంతాలు అందనంత ఎత్తులో ఉంటే మరాఠ్వాడ అధఃపాతాళంలో ఉంది. 30 ఏండ్ల కిందటి పెను భూకంపం నుంచి లాతూర్ ప్రజలు ఇంకా తేరుకోలేదు. 85 శాతం మంది ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి చెరకు, పత్తి, జొన్న, మొక్కజొన్న వంటి పంటలు పండిస్తున్నారు. అయినా రైతన్నలు సంతోషంగా లేరు. ఔరంగాబాద్, నాందేడ్ మినహాయిస్తే విద్య, వైద్య సౌకర్యాలు అంతంత మాత్రమే. రాష్ట్రం నడిబొడ్డులో, నాలుగోవంతు జనాభాతో ఉన్న తమకు ఈ దుర్గతి ఏమిటన్న బాధ మరాఠ్వాడ ప్రజలను వేధిస్తున్నది.
రాష్ట్ర సరిహద్దు వద్ద ఉన్న పక్క పొలంలోనే తెలంగాణ రైతన్న 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా, పుష్కలంగా నీళ్లతో ఆడుతూ పాడుతూ వ్యవసాయం చేసుకుంటున్న దృశ్యాలు మరాఠ్వాడ రైతన్నల మస్తిష్కాలలో వేల ఆశలు రేకెత్తిస్తున్నాయి. అంగళ్లలో, జాతరల్లో, గుళ్ళల్లో, శుభకార్యాల్లో, ప్రయాణాల్లో పరస్పరం తారసపడినప్పుడు.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకొని, తమకూ ఆ అదృష్టం దక్కాలని మరాఠ్వాడ ప్రజలు ప్రగాఢంగా కోరుకుంటున్నారు. కాబ ట్టే ఊళ్లకు ఊళ్లు తెలంగాణలో కలిసి పోదామని తీర్మానాలు చేస్తున్నాయి.
గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిదాక ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకులు, అధికార పదవుల్లో ఉన్న ముఖ్యులు వరుసకట్టి భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నారు. కేసీఆర్ తమకూ నాయకత్వం వహించాలని కోరుతున్నారు. నాందేడ్, కాంధార్ లోహ సభలు జరిగిన నాడు స్థానిక పత్రికలన్నీ కేసీఆర్ను స్వాగతిస్తూ సంపాదకీయాలు రాయడం, ప్రముఖ వార్తగా ప్రచురించడం అక్కడి ప్రజల మనోభావాలకు అద్దం పట్టింది. అలవి కాని వాగ్దానాలు అక్కడి నాయకులూ చేశారు.
కానీ తేడా ఏమిటంటే, అవి శుష్కప్రియా లు, శూన్య హస్తాలు అని ప్రజలు ఆరు దశాబ్దాల అనుభవంలో తెలుసుకున్నారు. కేసీఆర్ మాత్రం తెలంగాణలో అన్నది ఆచరించి చూ పించారు. అందుకే మరాఠ్వాడ ప్రజలు నమ్ముతున్నారు. ఆశగా ఉన్నారు. ఆదరిస్తున్నారు.
గత సంవత్సరం దాకా అది ఔరంగాబాద్. నేడు ఛత్రపతి శంభాజీ నగర్. మహావీరుడు శివాజీ తనయుడు, చిత్రహింసల పాలై ప్రాణాలు కోల్పోతున్నా శత్రువుకు తలవంచని శూరుడు శంభాజీ. అతని స్ఫూర్తితో మాతృభారత నవ నిర్మాణం కోసం శంభాజీ నగర్కు వస్తున్న కేసీఆర్కు ఆ నగరం చుట్టూ ఉన్న 52 మహాద్వారాలు స్వాగతం పలుకుతున్నాయి. అక్కడి రుచికరమైన వంటకాలు నాన్ కాలియా, బేసిన్ లడ్డు, కోహినూర్ పాన్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
పంచక్కి, అజంతా, ఎల్లోరా, దౌలతాబాద్ కోట, జయక్వాడీ సాగర్ సాదరంగా తోరణాలు కడుతున్నాయి. మహారాష్ట్రలో ఐదవ మహానగరమైన శంభాజీ నగర్ వేదికగా కేసీఆర్ ఇచ్చే దిశానిర్దేశాన్ని ఆసక్తిగా వీక్షించడానికి, ఆలకించడానికి దేశ ప్రజలు సమాయత్తమవుతున్నారు. శుభం భూయాత్.
కొసమెరుపు: ఔరంగాబాద్కు చెందిన ఒక వ్యక్తి యూట్యూబ్లో పెట్టిన పోస్ట్ చూశాను. అంబేద్కర్ మహావిగ్రహ ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపాడు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడాన్ని హర్షించాడు. ‘మీ నాయకుడు కేసీఆర్ గొప్ప దార్శనికుడు. ప్రజలు గొప్ప సంస్కారవంతులు. అందుకే అంబేద్కర్ పేరు వివాదం కాలేదు. కానీ, మా ఔరంగాబాద్లో మరాఠ్వాడ యూనివర్సిటీకి అంబేద్కర్ పేరు పెట్టడానికి 20 ఏండ్లు పోరాడాల్సి వచ్చింది. ఆస్తులు, ప్రాణాలు, జీవితాలు కోల్పోవాల్సి వచ్చింది.అందుకే కేసీఆర్ వంటి నాయకుడు మాకూ కావాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నాడు.
డా. అయాచితం శ్రీధర్
98498 93238