తెలంగాణ రాష్ర్టానికి ఒక్కరోజే మూడు ప్రశంసలు వచ్చాయి. మొదటిది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ చర్యలు బాగున్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ ఎంపీ భువనేశ్వర్ కలితా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఈ నెల 20న హైదరాబాద్కు వచ్చింది. ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక చికిత్స ఆలయాన్ని ఈ కమిటీ సందర్శించింది. దవాఖానలో అందుతున్న వైద్యసేవలు, రోగుల సదుపాయాలను పరిశీలించింది. రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య సంరక్షణ చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు, ప్రధానమంత్రి టీబీ ముక్త్భారత్ అభియాన్ అమలు తదితర అంశాలపై చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ పథకాల అమలుతీరు అద్భుతమని పార్లమెంటరీ కమిటీ సభ్యులు ప్రశంసించారు.
ఇక రెండవది. దళితబంధు పథకం అమలు, తీరుతెన్నులపై అధ్యయనం చేసేందుకు రమేశ్ నాథన్ ఆధ్వర్యంలో తమిళనాడుకు చెందిన ఎమ్మెల్యేలు, పలు పార్టీలు, దళితసంఘాల నా యకులు, సామాజికవేత్తల బృందం కరీంనగర్ జిల్లా జమ్మికుంట, హుజూరాబాద్లలో పర్యటించింది. అనంతరం ‘దళిత బంధు’వు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు’ అని ఆ కమిటీ ప్రశంసించింది. “దళితుల ఉద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నది. దళితుల్లో ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది విప్లవాత్మక పథకం. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వడమంటే మాటలు కాదు. దళితులకు స్వాతంత్య్రానంతరం ఒక్క తెలంగాణ ప్రభుత్వంలోనే గౌరవం దక్కింది. ‘దళితబంధు’ అనే బృహత్తర పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి” అని ఆ కమిటీ కొనియాడింది.
ఇక మూడవది. ‘తెలంగాణ టీఎస్ బీపాస్ పథకం బాగుంది. మా పంజాబ్లోనూ అమలు చేస్తామ’ని ఆ ప్రభుత్వం ప్రకటించింది. ఇండ్ల నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు టీఎస్ బీపాస్ అమలుచేయాలని, అవినీతి, జాప్యం, నిర్లక్ష్యం, అతిక్రమణలకు తావులేకుండా నిర్ణీత కాలవ్యవధిలో పారదర్శకంగా ఇండ్లకు అనుమతులు ఇస్తున్న తెలంగాణ తరహా విధానాన్ని పంజాబ్లోనూ అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం ఆలోచనలో ఉన్నది. తమిళనాడుకు చెందిన అధికారుల బృందం గతంలోనే రాష్ట్రంలో పర్యటించి టీఎస్బీపాస్ విధానాన్ని అధ్యయనం చేసింది. అక్కడ ఇప్పటికే ఈ విధానాన్ని అమలుచేస్తున్నారు. ఇలాంటి ప్రత్యేక చట్టం తీసుకువచ్చి ఈ విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టింది తెలంగాణ రాష్ట్రమే. ఇలా.. రాష్ర్టానికి ఒక్కరోజే మూడు ప్రశంసలు రావడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం. దీనికి కారణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను తప్పకుండా అభినందించాల్సిందే. దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం అని చాటిచెప్పడానికి పై ఉదాహరణలు చాలవా?
‘శుష్క ప్రియాలు.. శూన్య హస్తాలు’ అన్నట్లుగా ప్రధాని మోదీ మాటలే తప్ప, చేతల్లో ఏమీ లేదు. మొత్తంగా ప్రధానిగా ఆయన విఫలమయ్యారు. అదానీ, అంబానీ లాంటి బడాబాబుల కోసమే మోదీ ప్రభుత్వం పాటుపడుతున్నది తప్ప పేదల కోసం కాదు. వారి సంక్షేమం, పేద ప్రజల అభ్యున్నతి గురించి ఆయన ఏనాడూ ఆలోచించింది లేదు. వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకువచ్చి రైతు వ్యతిరేకిగా స్థిరపడ్డారు. సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలను కూడా తన గుప్పిట్లో పెట్టుకున్న మోదీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వేతర రాష్ర్టాల్లోని రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నది. రూ.80 లక్షల కోట్ల రుణం తెచ్చి ప్రధాని మోదీ దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. జీఎస్టీ అమలుతో అన్నింటి ధరలు పెంచి కోట్ల మంది సామాన్యుల జీవితాలను చిదిమేసింది మోదీ ప్రభుత్వం.
అందుకే మోదీ గద్దె దిగాల్సిందేనని అభిప్రాయాలు దేశమంతటా వ్యక్తమవుతున్నాయి. అందుకే బైబై మోదీజీ అని నినదిస్తు న్నారు. మోదీ గనుక మరోసారి అధికారంలోకి వస్తే దేశం అధోగతి పాలవడం ఖాయమనే సంకేతాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని దేశంలోని పలువర్గాల వారు ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఒడిషాలతోపాటు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్కు మంచి స్పందన వస్తున్నది. నిర్లక్ష్యానికి గురైన ఈ దేశానికి మేలు చేయాలన్న పట్టుదల, తపన కేసీఆర్లో మెండుగా ఉన్నాయని యావత్ దేశం కొనియాడుతున్నది.
ప్రత్యేక రాష్ట్రం కోసం పద్నాలుగేండ్ల పాటు అలుపెరుగని ఉద్యమాలు చేసి, శాంతియుతంగా స్వరాష్ట్ర కలను సాధించిన ఘనుడు కేసీఆర్. ఆయన నాయకత్వంలో, శాంతిమార్గంలో నడవడానికి దేశంలోని అన్నివర్గాలు ముందుకువస్తున్నాయి. ఆయన వెంబడి ‘జై భారత్, జై కిసాన్’ అని పిడికిలెత్తి బిగిస్తున్నాయి. కేసీఆర్ భారతదేశ దశ దిశను మార్చగలరనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆ రోజు త్వరలోనే రావాలని ప్రజలు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
పీఎల్ శ్రీనివాస్