దేశంలోనే తెలంగాణ జైళ్ల శాఖకు మంచి పేరున్నది. తెలంగాణ జైళ్ల శాఖ సంస్కరణలు అన్ని రాష్ర్టాల కంటే అగ్రగామిగా ఉన్నాయి. తెలంగాణ జైళ్ల శాఖ ఖైదీల సంక్షేమానికి చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తూ సాధిస్తున్న ప్రగతి ఫలాలు దేశంలోనే ప్రాచుర్యం పొందాయి. తెలంగాణ జైళ్ల శాఖలో ఖైదీల సత్ప్రవర్తన లక్ష్యంగా చేపడుతున్న సంస్కరణలు, ఉపాధి, సంపద మీద దృష్టిపెడుతూ అందరినీ ఆకర్షిస్తున్నాయి.
ఒకప్పుడు జైలు అంటే చిప్పకూడు అనుకునేవారు. కానీ ఇప్పు డు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ జైళ్లు, జిల్లా జైళ్లు, కేంద్రకారాగారాల్లో ఖైదీలకు నాణ్యమైన రుచికరమైన ఆహారం అందిస్తున్నది. కొన్ని జైళ్లు సొంతంగా సేంద్రియ ఎరువులు వేసి పండించిన కూరగాయలతో రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నాయి. చర్లపల్లి లాంటి పెద్ద జైళ్లలో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసి అన్ని రకాల వ్యవసాయ పంటలు పండించి ఆదర్శంగా నిలుస్తున్నారు అక్కడి అధికారులు, ఖైదీలు. దాదాపు అన్ని సబ్ జైళ్లు, జిల్లా జైళ్లు, కేంద్ర కారాగారాల్లోనూ అధికారులు ఖైదీలకు పని కల్పిస్తున్నారు. వారి ఆరోగ్యం విషయంలోనూ ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి జైలుకు ఒక డాక్టర్ తప్పనిసరిగా ఉంటాడు. ఆయన ఆధ్వర్యంలో ఖైదీలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తారు. అన్ని జైళ్లకు అత్యవసర వైద్య సేవలకోసం అంబులెన్స్లు కూడా ఉన్నాయి.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. అయినా రద్దీగా ఉన్న తెలంగాణ జైళ్లు మాత్రం కరోనా నుండి తమను తాము కాపాడుకోవడంలో విజయం సాధించాయి. జైళ్లశాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని అధికారుల సూచనలతో కరోనా మహమ్మారిని తరిమికొట్టారు. కరోనా సమయంలో జైళ్ల శాఖ సేవలు మర్చిపోలేనివి. ఖైదీల సంక్షేమం కూడా ఎక్కడ ఆగలేదు.
సీఎం హోదాలో కేసీఆర్ గతంలో వరంగల్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా వరంగల్ సెంట్రల్ జైలును మామునూరుకు తరలిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాత జైలు స్థలాన్ని దవాఖాన నిర్మాణానికి కేటాయించారు. మామునూరులో ప్రభు త్వం వరంగల్ సెంట్రల్ జైలు స్థలం కంటే అధిక స్థలం కేటాయించి ఆధునిక జైలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
తెలంగాణ జైళ్ల శాఖ ఖైదీల సత్ప్రవర్తన, సంస్కరణలతో పాటు వారికి ఉపాధి కల్పించడంలో ముందుంది. పరిశ్రమలు ఏర్పాటు చేసి వృత్తి విద్య నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నది. వ్యవసాయం, ఫ్యాక్టరీలు, పెట్రోల్ బంకులతో అధిక ఆదాయాన్ని సమకూర్చి అభివృద్ధి చేస్తున్నది.
కొత్త జైళ్ల నిర్మాణంలో భాగంగా సిద్దిపేట జిల్లా, అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామంలో 34 ఎకరాల్లో 78 కోట్లతో జిల్లా జైలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఏర్పాటవుతున్న మొదటి జైలు సిద్దిపేట జిల్లా జైలు. మహిళా ఖైదీల కోసం నర్సంపేటలో ప్రత్యేక మహిళా సబ్ జైలును ప్రారంభించారు. దీనివల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా ఖైదీలను ఉంచేందుకు వీలయింది. హైదరాబాద్ చంచల్గూడలో మహిళల కోసం ప్రత్యేక జైలు ఉన్నది. ఆ తర్వాత మహిళల కోసం ప్రత్యేక సబ్ జైలు నర్సంపేటలోనే ప్రారంభించారు.
నిజామాబాద్, సంగారెడ్డి జిల్లా జైళ్లు కేంద్ర కారాగారాలుగా మార్చుతూ జైళ్లశాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ మార్పుతో క్రమంగా ఖైదీల సంఖ్య పెరిగింది. రెండేండ్లు ఆపై శిక్ష పడిన ఖైదీలను ఈ జైళ్ల లోనే ఉంచుతారు. అందుకు అనుగుణంగా వసతులు, ప్రత్యేక బ్యారకులు ఏర్పాటు చేశారు. త్వరలో అదనపు సిబ్బందిని కూడా కేటాయించనున్నారు. మరోవైపు కేంద్రకారాగారాలుగా మార్చడంతో పోలీసులకు ఎస్కార్ట్ భారం కూడా తప్పింది. సంగారెడ్డి, నిజామాబాద్ జైళ్లు కేంద్రకారాగారాలుగా అప్గ్రేడ్ అయిన తర్వాత ఇక్కడ అవసరమైన అన్ని రకాల నిర్మాణాలు కూడా చేపట్టనున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా తెలంగాణ జైళ్ల శాఖను అభివృద్ధి చేస్తున్నది. స్వరాష్ట్రంలో తెలంగాణ జైళ్ల శాఖలో ఉద్యోగ నియామకాలు కూడ భారీగా భర్తీ చేస్తున్నారు.
ముచ్కుర్ సుమన్ గౌడ్