మన దేశానికి ఎంతో ఘన చరిత్ర, సహజ వనరులు, అత్యధిక యువ జనాభా, మేధో సంపద ఉన్నా 75 ఏండ్లలో అనుకున్నంత అభివృద్ధిని సాధించలేకపోయాం. మన కంటే చిన్న దేశాలతో కూడా మనం ఎందుకు పోటీ పడలేకపోతున్నాం? ఇన్నేండ్లు దేశాన్ని పాలించిన పార్టీలు, నాయకులు చేసిందేమిటి? తెలంగాణ మాత్రం ఇతర రాష్ర్టాలు, దేశానికి భిన్నంగా ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్లడానికి కారణాలేమిటి తెలుసుకోవాలంటే నేటి వేదిక పేజీలోని సమగ్ర వ్యాసాన్ని చదవండి.
ఘనమైన చరిత్ర, అత్యధిక యువ జనాభా, అపారమైన సహజ వనరులు, అద్వితీయమైన మేధో సంపద మన దేశానికి సొంతం. కానీ మన కన్నా తక్కువ వనరులు కలిగిన దేశాలతో మనం అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నాం. ప్రపంచ ప్రగతి సూచికల్లో చివరి స్థానాల్లో ఉంటున్నాం! తలసరి ఆదాయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఇన్నేండ్లు దేశాన్ని పాలించిన పాలకుల రాజకీయ ప్రయోజనాలు, మూస విధానాలే ఇందుకు కారణం. కానీ తెలంగాణ మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదర్శవంతమైన పథకాల కారణంగా ప్రగతి పథంలో ముందుకు దూసుకెళుతున్నది.
జనాభాపరంగా భారతదేశం ఇటీవల చైనాను అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. వైశాల్యంలో రష్యా, కెనడా, అమెరికా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా తరువాత 7వ స్థానాన్ని ఆక్రమించింది. అనేక సహజ వనరులు ఉన్న గొప్ప దేశం మనది.
అత్యధిక యువశక్తి, శ్రమైక జీవులు, మేధో సంపద కలిగిన దేశం. ప్రపంచంలోని అనేక దేశాలను తన మేధో వలసల ద్వారా సుసంపన్నం చేస్తున్న దేశం. మనం అత్యంత ప్రాచీన సింధూ నాగరికతకు వారసులం. ప్రపంచానికే జ్ఞానబోధ చేసిన తక్షశిల, నలంద, నాగార్జున కొండ విద్యాలయాలు విరాజిల్లిన పుణ్యభూమి మనది. గంగ, యమున, సరస్వతి, నర్మద, బ్రహ్మపుత్ర, మహానది, కావేరి, గోదావరి, కృష్ణా, తపతి తదితర పుణ్య నదులకు నెలవైన పవిత్ర భూమి. ఘనమైన సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు భారత దేశం. ఇంతటి ఘనమైన చారిత్రక నేపథ్యం గల భారతదేశం అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో ఎందుకు పోటీ పడలేక పోతున్నది?
సుదీర్ఘ కాలం సాగిన భారత స్వాతంత్య్ర పోరాటంలో అనేక తరాలు పాల్గొన్నాయి. అనేక ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాల ఫలితంగా చివరికి గాంధీజీ నేతృత్వంలో సాగిన అహింసాయుత పోరాటం ఫలించి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహా నాయకులు దేశ పాలకులుగా కొనసాగిన కాలంలో దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొంతమేరకు సాధించాం. ఆ తర్వాతి కాలంలో పాలకుల నిర్వాకం వల్ల అభివృద్ధి, స్వేచ్ఛ, సమానత్వం క్రమంగా కనుమరుగవుతూ వచ్చాయి! దేశ ప్రజల విశాల ప్రయోజనాలకు భిన్నంగా పాలకులు తమ, తమ పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంలో కొనసాగడమే సర్వస్వంగా భావిస్తూ దిగజారుతూ వస్తున్నారు.
కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారడంలో భారత్ వెనుకబడే ఉన్నది. ఎలాంటి చారిత్రక నేపథ్యం లేని అమెరికా కొన్ని శతాబ్దాల కాలంలోనే తన పకడ్బందీ ప్రణాళికలతో, కఠోర శ్రమతో, పాలన నైపుణ్యంతో ప్రపంచ మేధోశక్తిని ఆకర్షిస్తూ అగ్రదేశంగా ఎదిగి కొనసాగుతున్నది. 1949లో స్వాతంత్య్రం పొంది, కటిక పేదరికంలో మగ్గి, 1980 వరకు భారత్ కంటే వెనుకబడి ఉన్న చైనా గడిచిన 40 ఏండ్ల కాలంలో స్వయంకృషి, స్వీయ ప్రతిభతో శరవేగంగా తనను తాను తీర్చిదిద్దుకుంటూ అగ్రరాజ్యమైన అమెరికాకు సవాల్ విసురుతున్నది. ఏ వనరులు లేని, వలసలతో ఏర్పడిన చిన్న దేశమైన సింగపూర్ నేటికీ మట్టిని, నీటిని సైతం దిగుమతి చేసుకుంటూ అచిరకాలంలో సమర్థ పాలనతో గొప్ప దేశంగా ఎదిగి అనేక దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నది. భారత సహకారంతో స్వాతంత్య్రం పొందిన బంగ్లాదేశ్ పరిమిత వనరులతో 50 సంవత్సరాలలోనే అనేక రంగాల్లో భారత్ కంటే ముందున్నది. రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల దాడికి గురై శ్మశాన వాటికగా మారిన జపాన్ తేరుకొని కఠోర శ్రమ, ప్రణాళికాబద్ధ పాలనతో గతానికి మించిన ప్రగతి సాధించి తలుచుకుంటే ఏదైనా సాధించి తీరుతానని నిరూపించింది.
కానీ భారతదేశం ఏ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నదో మచ్చుకు కొన్ని సూచికలు పరిశీలిద్దాం. 2022లో ప్రపంచ ఆకలి సూచిక 121 దేశాలకు గాను మన దేశం 107వ స్థానంలో నిలిచింది. పొరుగు దేశాలైన పాకిస్థాన్ (99), బంగ్లాదేశ్ (84), నేపాల్ (81) కంటే మన దేశం వెనకబడి ఉన్నది. 2021-22లో మానవాభివృద్ధి సూచికలో 191 దేశాలకుగాను మన దేశం 132వ స్థానంలో ఉన్నది. ఆర్థిక మాంద్యంతో విలవిల్లాడిన వెనిజులా(120) మన కంటే మెరుగ్గా ఉన్నది. 2023లో ప్రపంచ శాంతి సూచికలో 163 దేశాలకు గాను మనం 126వ స్థానంలో ఉన్నాం. 2021లో జరిగిన ఒలింపిక్స్లో భారత్ 48వ స్థానంలో నిలిచింది. భారత్ కంటే ఎన్నో రెట్లు చిన్నవైన సెర్బియా, క్యూబా, ఉగాండా, ఉజ్బెకిస్థాన్, పోలెండ్ వంటి దేశాలు భారత్ కంటే మెరుగైన ప్రతిభను కనబరిచాయి.
భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నదని కేంద్ర ప్రభుత్వ పాలకులు చెప్పే మాటలు ప్రజలను మభ్యపెట్టేవే కానీ ఫలితం ఇచ్చేవి కావు. 33 కోట్ల జనాభా గల అమెరికా బడ్జెట్ స్థాయికి, 145 కోట్ల జనాభా ఉన్న భారత్ చేరుకోవాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అప్పటికి అమెరికా బడ్జెట్ ఎంతకు చేరుకుంటుంది?
జనాభాలో భారత్కు దాదాపు సమానంగా ఉన్న చైనా నేటి బడ్జెట్ను భారత్ సమీప భవిష్యత్తులో చేరుకోవడం సాధ్యమేనా? మన కన్నా చాలా చిన్న దేశాల కంటే ఎక్కువ బడ్జెట్ కలిగి ఉన్నామని చెప్పి మనం మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నామని చెప్పడం సంబురపడే విషయం కానే కాదు. తలసరి బడ్జెట్లో మనం మూడో స్థానంలో కాదు కదా పదవ స్థానంలో కూడా లేము.
దేశంలో కురిసే చక్కటి వర్షపాతం వల్ల అవసరాలకు మించి జల సంపద మన నదుల్లో పారుతూనే ఉంది. నీళ్లుండి కూడా 40 కోట్ల ఎకరాల సాగు యోగ్యమైన భూమికి నీళ్లివ్వకపోవడం క్షమించరాని తప్పిదం. నేటికీ అనేక రాష్ర్టాల్లో తాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచే దుస్థితి నెలకొన్నది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలకు కూడా సరిగ్గా నీళ్లు ఇవ్వడం లేదు. వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. అతివృష్టి, అనావృష్టితో దేశం విలవిల్లాడుతున్నది. ప్రకృతి ప్రసాదించిన వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకునే ప్రణాళికలు, ముందుచూపు పాలకుల్లో కానరావడం లేదు. ఈ పరిస్థితి దశాబ్దాలుగా కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఇందుకు మినహాయింపు. కారణం… కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలతో ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించింది.
సిరికొండ మధుసూదనాచారి
(ఎమ్మెల్సీ, తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు)