ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ ఇది. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను త్యజించిన అమరుల యాదిలో జరిగిన అభివృద్ధి వెలుగులు నేడు రాష్ట్రమంతటా కనిపిస్తున్నాయి. దేశ చరిత్రలోనే ఘనకీర్తి కలిగిన తెలంగాణ మట్టిబిడ్డల మనోవేదనకు ముగింపు పడి, త్యాగాల తెలంగాణ బానిస సంకెళ్లను తెంచుకొని స్వరాష్ట్రంలో తలెత్తుకొని సగర్వంగా నిలబడి దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్నది.
దేశ రాజకీయాల్లో విలక్షణమైన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచింది మన తెలంగాణ. ఓ వైపు అభివృద్ధి ఫలాలను సా మాన్య ప్రజలకు అందజేస్తూనే.. మరోవైపు తెలంగాణ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది కేసీఆర్ పాలన. జూన్ 2 వందలాది అమరవీరుల త్యాగాల స్ఫూర్తిని ఎత్తిపట్టి దేశ ప్రజలకు తెలంగాణ జాతి ఘనకీర్తిని చాటిచెప్పే రోజు. ఈ రోజును తెలంగాణ ప్రజలు ప్రతి ఇంటా పండుగలా జరుపుకోవాలని ఈ ఉత్సవాలను కేసీఆర్ ప్రజలకు అంకితం చేశారు.
రాష్ట్రంలో విపక్షాల నిందారోపణలను తిప్పికొడుతూ తెలంగాణ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందివ్వడమే రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆసరా పింఛన్లు లభిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతినెల 44,12,882 మందికి ఆసరా పింఛన్ల ద్వారా ఆర్థిక సహకారం అందిస్తున్నది. రైతుబంధుతో లక్ష లాది మంది రైతులకు రూ.65 వేల కోట్లు నేరుగా వారి ఖాతాల్లోనే జమచేసి దేశంలోనే వ్యవసాయ అనుకూల విధానాలకు మార్గదర్శకంగా నిలిచింది. దేశ సంక్షేమ రంగానికి దిక్సూచిగా తెలంగాణను నిలపడంలో నిద్రలేని రాత్రులు గడుపుతూ నిత్యం ప్రజా సేవ, అభివృద్ధి మాత్రమే ప్రథమ కర్తవ్యంగా ఎంచుకున్న కేసీఆర్ దార్శనికత ముందు దేశంలో ఏ రాజకీయ నాయకుడు నిలువ లేడనేది చారిత్రక సత్యం. 21 రోజుల పాటు తెలంగాణలో జరిగే ఈ పండుగ సందర్భంగా, అబద్ధాలను ప్రచారం చేయడానికి కంకణం కట్టుకున్న ప్రతిపక్షాల కుట్రలను ప్రజల ముందు బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ బిడ్డల త్యాగాల విలువను జూన్ 2 సందర్భంగా గుర్తుచేసుకుంటే, తెలంగాణలోనే ఒక యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా కేసీఆర్ పిలుపు మేరకు 2001 నుంచి 2014 వరకు విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన అనేక జ్ఞాపకాలు ఈ సందర్భంగా మదిలో మెదులుతున్నాయి. స్వరాష్ట్రం కోసం ఎందరో విద్యార్థులు ఉద్యమంలో అసువులు బాసిన సందర్భంలో కేసీఆర్ కార్చిన కన్నీళ్లు, నేటి తెలంగాణ అభివృద్ధి వెలుగులను పంచడానికి కారణభూతమైనట్లుగా భావించవచ్చు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగం మొదలు.. భూక్య ప్రవీణ్, వెల్దండి సుమన్ దాకా నాడు అమరుల పార్థివదేహాలను, వారి కుటుంబాల కన్నీటి గాథను గుండెల కద్దుకొని, గొంతెత్తి నినదించిన రోజులు గుర్తుకొస్తున్నాయి.
వరంగల్ ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా భోజ్య నాయక్ అనే విద్యార్థి మా కండ్లముందు నిప్పంటించుకొని చేసిన ‘జై తెలంగాణ’ నినాదం ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతూనే ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ మొదటినుంచి ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెంట నడిచింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ దీక్షకు పూనుకొని ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో కేసీఆర్ బయల్దేరిన సందర్భంలో అన్ని వర్సిటీల కంటే ముందు కేయూలో విద్యార్థి బహిరంగ సభ నిర్వహించాం. తెలంగాణ రాష్ట్రం కోసం నాడు పలు విద్యార్థి సంఘాలను ఒకే వేదిక మీదకి తీసుకురావడానికి కేసీఆర్ విద్యార్థి నాయకులను వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఉద్యమ సందర్భంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని సాధించిన రాష్ర్టాన్ని సగర్వంగా దేశం ముందు నిలబెట్టిన కేసీఆర్ కృషికి వరంగల్ బిడ్డగా ఈ సందర్భంగా జేజేలు పలుకుతున్నా.
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అమరుల త్యాగాలు భవిషత్ తరాలకు గుర్తుండేలా హైదరాబాద్ నడిబొడ్డున అమరుల స్మారక చిహ్నం ఏర్పాటు చేసింది. దక్కన్ కళాప్రశస్తిని ప్రతిబింబించేలా పక్కన రాష్ట్ర నూతన సచివాలయం, దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఈ స్మారక చిహ్నానికి మరింత వన్నె తెస్తున్నాయి.
అభివృద్ధి అంటే అంకెల గారడి కాదని రుజువు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతున్న పాలన ప్రతీ తెలంగాణ బిడ్డకు గర్వకారణం. కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తూ మరోవైపు బడుగు, బలహీన వర్గాలకు ఆసరాగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడుతున్న తీరు ఆదర్శనీయం. ఏకకాలంలో పలు రంగాల అభివృద్ధిని ఉరుకులు పెట్టిస్తున్న కేసీఆర్ పాలన తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్తున్నది. ఈ నేపథ్యంలో అధికార దాహంతో, పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టే కుట్రలకు తెర లేపుతున్న కాంగ్రెస్, బీజేపీ విధానాలను ప్రజలముందు బట్టబయలు చేద్దాం. అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ అమరుల యాదిలో అభివృద్ధి వెలుగులను పంచుతున్న కేసీఆర్ పాలనను, ఆయన ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకువెళ్దాం. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ర్టాభివృద్ధి స్ఫూర్తిని కొనసాగిద్దాం.
(వ్యాసకర్త: రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్)
డాక్టర్ ,కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
95530 86666