తెలంగాణ రాష్ట్రమంతా ఉత్కంఠంగా ఎదురుచూసిన 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సకల జనులకు సంతృప్తి కలిగించేలా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కేవలం 9 ఏండ్లలోనే.. దేశ, ప్రపంచ స్థాయి గుర్తింపును అందుకోగలిగింది. అందుకు తెలంగాణ ఉద్యమ రథసారధి, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువస్తున్న అనేక సంక్షేమ ఆవిష్కరణలు కారణం.
తెలంగాణ అనేక త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, వ్యవసాయ రంగాలు నిర్లక్ష్యం చేయబడి నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తీరని నష్టం వాటిల్లింది. ఉమ్మడి పాలనలో తెలంగాణను నామరూపాల్లేకుండా విధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అనే వాస్తవాన్ని సాక్షాత్కరిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి అభివృద్ధికి విశేష కృషి జరుగుతున్నది. మానవీయ పథకాలతో గుణాత్మక మార్పు కోసం.. కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెటే దానికి సాక్ష్యంగా నిలుస్తున్నది. కేంద్రం చేయని పని.. తెలంగాణ చేసి చూ పుతుంది. దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వం పెద్దోళ్లకు పెడుతూ పేదల పట్ల వివక్షకు పాల్పడుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రం సబ్బండ వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పేదలను పెద్దోళ్లుగా మారుస్తు న్నది. తాజా బడ్జెట్ కూడా అదే విధంగా ఉండడం కొండంత
ధైర్యాన్నిచ్చినట్లయింది.
గత సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ.2 లక్షల 56 వేల కోట్లు కాగా.. ఈసారి దాదాపు రూ.3 లక్షల కోట్లకు దగ్గరగా రూ. 2 లక్షల 90 వేల 396 కోట్లు ప్రవేశపెట్టి.. పేదల, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడింది. సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొండంత భరోసానిచ్చింది. తెలంగాణ అంటేనే తెగువ గల నేలగా.. మరోసారి ప్రజానీకానికి ధైర్యాన్నిచ్చింది. తెలంగాణ ప్రగతిని మరింత సుస్థిర పరిచేలా ఆర్థిక భరోసా ఇచ్చింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఓ మాడల్ రాష్ట్రంగా అభివృద్ధ్దిని పరుచుకుంటూ.. సంపదను పెంచుతూ.. పేదలకు పంచుతూ పోతున్నది. ఎటువంటి అంకెల గారడీ లేదు. ఎటువంటి ప్రలోభాలు లేవు. ఖుల్లం ఖుల్లాగా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది. ఒకనాడు వ్యవసాయమంటేనే దండుగ అని భావించే పరిస్థితులు.. కరెంటు కష్టాలు, నీటి సమస్యలతో తల్లడిల్లిన నేల నేడు అన్నపూర్ణగా విరాజిల్లుతున్నది. తెలంగాణ నేల ఇప్పుడంతా పొత్తిళ్లలో నీటిని నింపుకొని నా తెలంగాణ కోటి ఎకరాల పచ్చదనాన్ని పరుచుకున్న మాగాణిగా దర్శనమిస్తున్నది. రైతును రాజు చేయడానికి దేశం చేయని సాహ సం కేసీఆర్ చేసి చూపారు. మొదటి నుంచి కేసీఆర్ సర్కారు రైతును నెత్తిన మోస్తూ గౌరవిస్తున్నది. దీనివల్లే నాడు రైతు ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న తెలంగాణ నేడు దేశానికే అన్నం పెట్టే తెలంగాణగా ఎదిగింది. ఈసారి కూడా రైతాంగానికి కేసీఆర్ పెద్దపీట వేశారు. విద్యుత్ సబ్సిడీలు, వ్యవసాయానికి 26 వేల కోట్లు కేటాయించడంతో పాటు రైతు రుణమాఫీకి రూ.6 వేల కోట్లు కేటాయించి రైతు పక్షపాతి అనిపించుకున్నారు.
ఒకనాడు పేదోళ్లు చదువుకోవడానికి సరైన అవకాశాల్లేని తెలంగాణలో నేడు 1002 గురుకులాల ద్వారా ఐదు లక్షల మంది విద్యార్థులు ఇంగ్లీషు మీడియం విద్యనభ్యసిస్తున్నారు. తద్వారా పేదల ఇండ్లల్లో విజ్ఞాన కాంతులు ప్రకాశిస్తున్నాయి. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడం కోసం విద్యాశాఖకు రూ.19 వేల 90 కోట్లు కేటాయించారు. కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు నేడు ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్యం అందుతున్నది. వైద్యారోగ్యానికి రూ.12 వేల కోట్లు కేటాయించడం ద్వారా ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేసినట్లయింది.
దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పు తెచ్చే పథకం దళితబం దు. ఒకప్పుడు ట్రాక్టర్, కారు డ్రైవర్లుగా ఉన్న దళితులు నేడు వాటికి యాజమానులవుతున్నారు. రూ.10 లక్షల యూనిట్తో దళితులు వ్యాపారవేత్తలుగా మారుతున్నారు. ఈ పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారు. ఎస్సీల సంక్షేమానికి ఎస్సీ ప్రత్యేక నిధి కింద రూ.36 వేల 750 కోట్లు కేటాయించడం శుభపరిణామం. ఎస్టీ ప్రత్యేక నిధి కింద రూ.15 వేల 233 కోట్లు, మహిళాశిశు సంక్షేమానికి రూ.2131 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ.2,200ల కోట్లు కేటాయించి సబ్బండ వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ సర్కారు కట్టుబడి ఉన్నదని నిరూపించారు.
తెలంగాణ ఇప్పటికే అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తూ.. దేశానికి దిక్సూచిగా మారింది. ప్రపంచ స్థాయి పరిశ్రమలకు తెలంగాణ వేదికగా నిలుస్తున్నది. సమైక్య పాలనలో అడుగడుగునా దగా పడ్డ తెలంగాణ నేడు.. అద్భుత శక్తిగా అవతరిస్తున్నది. తెలంగాణోళ్లకు తెలివి లేదంటూ హేళన చేసిన వారు నోర్ల్లు మూసుకునేలా అన్ని హంగులు, ఆధునికతతో తెలంగాణ అన్ని రంగాల్లో రాణిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా దేశంలో గుణాత్మక మార్పుకోసం ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ కదులుతున్నారు. భిన్న మతాలు, కులాలు, సంప్రదాయా లు కలిగిన భారతదేశంలో అన్ని వర్గాల సంక్షేమమే అసలైన దేశ సంపదగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. తెలంగాణ బిడ్డలుగా మనం ఆ పోరులో బీఆర్ఎస్ వెంట ముందుకు సాగాలి.
( వ్యాసకర్త : దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు)
-సంపత్ గడ్డం
78933 03516