బయో ఏషియా సదస్సు ద్వారా లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత వృద్ధి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై, సదస్సు విజయవంతం కావడానికి ఏటికేడూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు తీసుకొంటున్న ప్రత్యేక చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కరోనా విలయం తర్వాత ఫార్మా, లైఫ్ సైన్సెస్ పరిశోధనల ప్రాధాన్యం ఏమిటో అందరికీ తెలిసొచ్చింది. అయితే, 8 ఏండ్ల కిందటే లైఫ్ సైన్సెస్ ప్రాధాన్యాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం.. ‘బయో ఏషియా’ సదస్సును ఆ రంగంలో పెట్టుబడులకు ఓ వేదికగా భావించింది.
ఫలితం.. 2004లో ఉమ్మడి ఏపీలో ప్రారంభమైన ‘బయో ఏషియా’ సదస్సు ప్రతీ సంవత్సరం హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నప్పటికీ.. 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పెట్టుబడుల వరద పెరిగింది. 2014 వరకు 11 దఫాల్లో నిర్వహించిన ‘బయో ఏషియా’ సదస్సుల ద్వారా రాష్ర్టానికి రూ. 1,300 కోట్ల పెట్టుబడులు వస్తే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సర్కారు నేతృత్వంలో ఎనిమిది దఫాల్లో నిర్వహించిన ‘బయో ఏషియా’ సదస్సు ద్వారా రూ. 23,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంటే ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడుల కంటే 18 రెట్లు ఎక్కువ. దీనికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పారిశ్రామిక విధానం, కేటీఆర్ ప్రత్యేక కృషి ఎంతగానో తోడ్పాటునందించింది.
‘బయో ఏషియా’ ఎలా పుట్టిందంటే?
బయోటెక్, బయో ఫార్మా కంపెనీలు, పరిశోధనా సంస్థలు, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించడం, పరిష్కారాలను మెరుగుపరచడమే లక్ష్యంగా 2004లో హైదరాబాద్ కేంద్రంగా మొదటి ‘బయో ఏషియా’ ఎడిషన్ ప్రారంభించారు. వైద్య రంగంలో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు మెరుగైన పరిష్కారాలను సూచించడమే లక్ష్యంగా దీన్ని ఆరంభించారు. అయితే, సదస్సు నిర్వహణ, కంపెనీలతో ద్వైపాక్షిక ఒప్పందాల విషయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతగా శ్రద్ధ చూపించలేదు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో 11 ఎడిషన్ల ‘బయో ఏషియా’ సదస్సు జరిగినప్పటికీ, పెట్టుబడులు అంతంత మాత్రంగానే వచ్చాయి. ఫార్మా రంగంలో యువతకు ఉపాధి అవకాశాల ఊసే లేకుండా పోయింది.
ఇక, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12వ ఎడిషన్ను 2015లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. సమర్థమంతమైన అనుకూల వాతావరణాన్ని పరిశ్రమలకు కల్పిస్తే లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో పెట్టుబడులు వస్తాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలు చేపట్టింది. పరిశ్రమల్లో మంచి విధానాలు అవలంభిస్తున్న సంస్థలకు ఏటా అవార్డులు ఇచ్చి ప్రోత్సహించింది. నూతన పారిశ్రామిక విధానంతో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించింది. దీంతో ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో పెద్దయెత్తున పెట్టుబడులు రావడంతో పాటు లక్షలాది మంది యువతకు ఉపాధి లభించింది.
కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ
తెలంగాణ సర్కారు హయాంలో ‘బయో ఏషియా’ సదస్సు నిర్వహణపై ఐటీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కంపెనీ ప్రతినిధులకు స్వయంగా వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్గేట్స్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, డబ్ల్యూహెచ్వో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యస్వామినాథన్ తదితరులతో ప్రత్యేక చర్చా కార్యక్రమాలను కేటీఆర్ స్వయంగా నిర్వహించారు. దీంతో ప్రఖ్యాత ఫార్మా కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపాయి. ఈ ఏడాది మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ‘బయో ఏషియా’ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం పెద్దయెత్తున నిర్వహిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టమ్ విలువను 2028 నాటికి 100 బిలియన్ డాలర్లకు పెంచుతూ.. ఈ రంగంలో ఉద్యోగావకాశాలను 8 లక్షలకు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు కేటీఆర్ తాజాగా వెల్లడించారు.
కేటీ రామారావు అంటే ‘Know Tommorow Ramarao’ (రేపు ఏం జరుగనుందో ముందుగా అంచనా వేసే రామారావు). లైఫ్సైన్సెస్ రంగాన్ని మరింత వృద్ధి చేయడానికి ‘బయో ఏషియా’ సదస్సును సద్వినియోగించుకోవాలన్న ఆయన ఆలోచన అద్భుతం.
– 2017లో బయో ఏషియా సదస్సులో అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్
ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకొని పెట్టుబడులు ఆకర్షించాలంటే హైదరాబాద్లో జరుగుతున్న ‘బయో ఏషియా’ సదస్సును చూసి నేర్చుకోవాలి. వివిధ రాష్ర్టాలకు తెలంగాణ ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నది.
– 2019లో ‘ఇన్వెస్ట్ ఇండియా’ సదస్సులో కేంద్ర ప్రభుత్వం ప్రశంస
కరోనాను భారత్ సమర్థంగా ఎదుర్కొన్నది. దీనికి వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ ఔషధ సంస్థల కృషి, ప్రభుత్వ ప్రోత్సాహకం ఎంతగానో ఉన్నట్టు అర్థమవుతున్నది.
– 2022లో బయో ఏషియా సదస్సులో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్
‘బయో ఏషియా’ సదస్సుల్లో గతంలో ప్రముఖుల మనోభావాలు
టీ హబ్ అద్భుతంబయాలజీకి కంప్యూటింగ్ తోడైతే ఆవిష్కరణల పరంగా ఎన్నో సాధించవచ్చు. భవిష్యత్తు టెక్ వైద్యానిదే. స్టార్టప్లతో వినూత్న మార్పులు తీసుకురావొచ్చు. తెలంగాణలో టీహబ్ అద్భుతం.
-బయో ఏషియా-2021 సదస్సులో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
ప్రపంచానికే టీకాల కేంద్రం
మొత్తం టీకాల్లో 65 శాతం టీకాలు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. జినోమ్ వ్యాలీ అత్యుత్తమమైనది. ప్రపంచానికే టీకాల కేంద్రంగా మారింది.
-బయో ఏషియా-2021 సదస్సులో భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల
గొప్ప విషయం
లైఫ్ సైన్సెస్ రంగంలో మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అవకాశాలను కల్పిస్తుండటం ఎంతో గొప్ప విషయం.
-బయో ఏషియా-2020 సదస్సులో పిరమల్ ఎంటర్ప్రైజెస్ వైస్చైర్పర్సన్ స్వాతి పిరమాల్