ప్రాభవం తగ్గిపోయిన చేనేత కళకు తెలంగాణ ప్రభుత్వం ఊపిరులూదింది. ఆదరణ తగ్గి, ఆదాయం లేక మగ్గం వదిలేసిన కళాకారులను తిరిగి నేత వృత్తి వైపునకు మళ్లించింది. రాయితీ ధరలకు నూలు, రంగులు అందిస్తూ చేనేత దుస్తుల తయారీని ప్రోత్సహిస్తున్నది. చేనేత వస్ర్తాల ప్రదర్శనలను ఏర్పాటుచేసి మార్కెటింగ్లో సహాయం చేస్తున్నది. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ చేనేత కుటుంబాలకు అండగా నిలుస్తున్నది. శతాబ్దాల చరిత్ర గల చేనేత కళకు కొత్త శోభను, ఆధునీకతను తీసుకువచ్చింది.
ఒకప్పుడు నేత పని పద్మశాలీలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. అయితే యంత్రాలు వచ్చాక సంప్రదాయ మగ్గాలు మరుగునపడ్డాయి. 40,50 ఏండ్ల కిందట వందల సంఖ్యల్లో చేనేత కళాకారులు, చేనేత కార్మికులు ఉండేవారు. వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఉన్నవారిలోనూ 60 సంవత్సరాలు దాటిన వారే ఎక్కువగా ఉన్నారు. అయితే కొత్తగా ఈ వృత్తి చేపట్టాలనుకొనేవారికి కొంత అవగాహన కల్పించాలనే కోరికతో వారు ఇంకా చేనేత వృత్తి నిర్వహిస్తూనే ఉన్నారు. ఇన్నేండ్లుగా పోషించిన కళను వదలడానికి సిద్ధంగా లేని వీరి సహకారంతో యువతరానికి చేనేత వృత్తిపై అవగాహన, ఆసక్తి కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మగ్గం వృత్తిని నమ్ముకుంటే జీవితమే లేదని ఈ వృత్తిని వదిలేసిన వారిని తిరిగి ఇటువైపు రప్పించడానికి ఆదాయమార్గాలు చూపిస్తున్నది. పర్యావరణానికి హాని లేని సహజ సిద్ధమైన రంగులు అద్ది వస్ర్తాలు తయారుచేయడం తెలంగాణ చేనేత కార్మికుల ప్రత్యేకత.
చేనేత వస్ర్తాల ప్రదర్శన ద్వారా నేత పనివారు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్లో సహాయం చేస్తున్నది. చేనేతకారులను, చేనేత కళాకారులను ప్రోత్సహించడానికి ఏటా ప్రతిభ అవార్డులు అందిస్తున్నది. చేనేత వృత్తి పట్ల ఆసక్తి గలవారికి శిక్షణ తరగతులను ప్రభుత్వమే నిర్వహిస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. ఇలాంటివారే భవిష్యత్తులో చేనేత కళను రక్షించి స్వయం ఉపాధి పొందుతారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగం అభివృద్ధికి, నేతన్నల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడం సంతోషకరం. పద్మశాలీల పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న దార్శనికతకు నిదర్శనం. ఒకప్పుడు ఆకలి చావులు, భిక్షాటనతో దయనీయంగా ఉన్న చేనేతకారుల జీవితాలను మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంది. చేనేత సంఘాలకు డీసీసీబీల ద్వారా ఆర్థిక సాయం, రుణాలు అందించి మగ్గాల నవీకరణ చేసింది. గుంత మగ్గాల స్థానంలో రూ.38 వేల విలువ కలిగిన ఫ్రేమ్ మగ్గాల ఉచిత పంపిణీకి ప్రణాళికలు రూపొందించింది. చేనేత సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసి ముఖ్యమైనవాటిని త్వరితగతిన పరిష్కరించింది తెలంగాణ ప్రభుత్వం.
నేతన్నలకు ఆరోగ్య కార్డుల ద్వారా రూ.25 వేల పరిమితి వరకు ప్రభుత్వ దవాఖానాల్లో ఉచిత వైద్యసేవలు అందిస్తున్నది. చేనేత మ్యూజియం ఏర్పాటు కోసం హైదరాబాద్ ఉప్పల్లో 500 గజాల స్థలాన్ని కేటాయించింది. మరణించిన చేనేత కార్మికులకు టెస్కో ద్వారా రూ.25 వేల పరిహారాన్ని అందిస్తున్నది. చేనేత మిత్ర పథకం ద్వారా నూలు, రంగులు, రసాయనాలు 40 శాతం మేర రాయితీకి అందిస్తున్నది.
జియో ట్యాగ్ చేసిన చేనేత మగ్గాలపై పనిచేసే కార్మికులకు నెలకు రూ.3 వేలు, మిగతా చేనేత కార్మికులకు రూ.2 వేలు, అనుబంధ కార్మికులకు రూ.1000 వారి బ్యాంక్ ఖాతాలో ప్రతి నెలా జమ చేస్తున్నది. 60-75 ఏండ్ల వయస్సు కలిగిన చేనేత కార్మికులకు చేనేత బీమా పథకం అమలు చేస్తున్నది. పోచంపల్లిలో అతి పెద్ద చేనేత పార్కును తీర్చిదిద్దాలని నిర్ణయించింది. నేతన్నకు చేయూత పథకం ద్వారా కార్మికులు 8 శాతం వేతనాలను జమ చేస్తే ప్రభుత్వం దానికి 16 శాతం వేతనాన్ని జమ చేస్తున్నది. చేనేత రంగం అభివృద్ధి పట్ల, చేనేత కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వ చూపుతున్న చొరవ ఇలాగే ముందుకు సాగాలి. ప్రజలు, రాజకీయ నాయకులు చేనేత వస్ర్తాలను తరచూ ధరిస్తూ చేనేత రంగాన్ని ప్రోత్సహించాలి. ప్రభుత్వం, ప్రజల తోడ్పాటుతో చేనేత వృత్తి మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని చేనేత కార్మికులు ఆశిస్తున్నారు. చేనేత మగ్గం ప్రగతికి చక్రం లాంటిదని అందరూ గ్రహించాలి!
(వ్యాసకర్త: కన్వీనర్, చేనేత ఐక్యవేదిక, సూర్యాపేట జిల్లా)
-కొండా లింగారావు
90104 66272