తెలంగాణ ఏర్పడిన నాటి నుంచీ కీలకమైన విభజన హామీలు, పారిశ్రామిక రంగంలో న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులు, పథకాలు, ప్రోత్సాహకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఇంకా కొనసాగుతున్నది. తెలంగాణ తన కాళ్ల మీద తాను నిలబడటానికి సాయం అందించాలని ఏండ్లుగా కోరుతున్నా కేంద్రం నుంచి స్పందన రావడం లేదు. నేటికీ వివక్ష చూపుతూనే ఉన్నది, కానీ తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ గట్టిగానే పోరాడుతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు వివక్ష చూపితే స్వరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. కేంద్రం వైఖరి గురించి తెలంగాణ ప్రజల మాటల్లో చెప్పాలంటే కాళ్లల్ల కట్టె పెట్టినట్టు’ ఉంది. ప్రగతిశీల రాష్ర్టాలకు ప్రత్యేక ప్రోత్సాహం లేకపోగా నిరుత్సాహం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా జరుపుకోకముందే, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రపదేశ్కు కట్ట బెట్టింది. ఇది వివక్ష కదా?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనతి కాలంలోనే అనేక రంగాలలో దేశంలోకెల్లా అగ్రగామిగా రూపుదాల్చింది. సంక్షేమంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పాధాన్యతనిస్తోంది. టీఎస్ఐపాస్ వంటి పారిశ్రామిక విధానాన్ని తెచ్చి గత పదేండ్లలో వ్యవసాయం మొదలుకుని ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో రాష్ట్రం ఎంతో పగతి పురోగమిస్తున్నది. కానీ పైసా కూడా సాయం చేయడం లేదు. ఇది ముమ్మాటికీ వివక్షే.
ముఖ్యమంత్రి స్వయంగా ప్రధాన మంత్రికి విన్నవించారు. కానీ లాభం లేకపోయింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24 వేల కోట్ల ప్రత్యేక నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫారసులనూ కేంద్రం బుట్టదాఖలు చేసింది. కొత్త రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపుతో పాటూ ఇతర ప్రోత్సాహకాలను ఇవ్వాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(1) పేర్కొంది. కానీ, చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలేవీ కేంద్రం ఇవ్వలేదు.
విభజన చట్టంలోని హమీలైన బయ్యా రం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల విషయంలో అతీగతీ లేదు. రైల్ కనెక్టివిటీని పెంచే ప్రతిపాదనలు పెండింగ్లోనే పెడుతున్నది. గిరిజన యూనివర్సిటీకి సంబంధించి కంటి తుడుపుగా కేవలం రూ.20 కోట్ల నిధులిచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్ర ఏర్పాటు కంటే ముందే మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును అడ్డుకోవడం ద్వారా తెలంగాణలో ఐటీ పరిశమ అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు ఎన్డీయే పభుత్వం మోకాలడ్డుతోంది. కానీ తెలంగాణ రాష్ట్ర ఐటీ ఎగుమతులు ఎంతగానో పురోగమించాయి.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్, నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు విషయంలో మొండి చేయి చూపుతున్నది కేంద్రం. ఆర్థిక సంఘాల సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం ఆనవాయితీ. 15వ ఆర్థిక సంఘం మన రాష్ర్టానికి ప్రత్యేక గ్రాంటుగా ఇవ్వాలని సిఫార్సు చేసింది. కానీ కేంద్రం ఈ సిఫారసులను పట్టించుకోలేదు.
రాష్ర్టానికి ఇచ్చే నిర్దిష్ట గ్రాంట్లు రూ.2362 కోట్లు విడుదల చేయలేదు. అదే విధంగా సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్లు రూ.3,024 కోట్లు ఇవ్వలేదు. ఈ మొత్తం కలిపి రూ.5,386 కోట్ల నిధులను తెలంగాణకు ఇవ్వకుండా కేంద్రం తొక్కి పెట్టింది. కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి న్యాయబద్దంగా 41 శాతం రాష్ర్టాలకు రావాలి. రాష్ర్టాలకు ఇవ్వాల్సిన ఈ వాటాను కుదించడానికి కేంద్రం సెస్సుల రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటున్నది. సెస్సుల రూపంలో వచ్చే ఆదాయంలో రాష్ర్టాలకు వాటా ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకొని రాష్ర్టాలకు రావాల్సిన ఆదాయంలో 11.4 శాతం ఆదాయానికి కేంద్రం గండి కొడుతున్నది. రాష్ర్టాలకు 41 శాతం రావాల్సిన చోట 29.6 శాతం మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తున్నది. కేంద్రం చేస్తున్న ఈ నిర్వాకాన్ని గతంలో 15వ ఆర్థిక సంఘం తప్పు పట్టింది.
నేడు తెలంగాణ కరువు కాటకాలను అధిగమించి సాగునీటి సమృద్ధిని సాధించింది. కరెంటు కోతల నుంచి 24 గంటల విద్యుత్తు కాంతులలోకి పయనించింది. సంక్షోభ కాలం నుంచి సంక్షేమ యుగంలోకి ప్రవేశించింది. భారత చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం ఒక అద్భుతం. తెలంగాణ రాష్ట్రం బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. దీనికి కారణం ముఖ్యమంత్రి దార్శనికత, అవినీతి రహిత పరిపాలన, బీఆర్ఎస్ సర్కారు అనుసరిస్తున్న పటిష్ఠమైన ఆర్థిక విధానాలు. మోదీ సర్కారు రైతులపైకి కార్లు ఎక్కించి చంపితే, కేసీఆర్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి అందించి, పంట దిగుబడి రూపంలో కాసులు కురిపిస్తున్నది.
రైతులను ఆత్మహత్యల దిశగా తోసిన పాపం గత పాలకులది. రైతులకు అండగా నిలిచి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించిన ఘనత కేసీఆర్ది. దేశంలో, ఎక్కడా లేని విధంగా కేసీఆర్ వినూత్న పథకాలను ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల వివక్ష చూపుతున్నది. మోటార్లకు మీటర్లు పెట్టాలని రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్నది. ఇప్పుడు కొత్తగా ఆ పార్టీ రైతు సభలు పెట్టినా రైతులకు ఒరిగేదేమీ లేదు.
-తీగల అశోక్ కుమార్
79891 14086