భారత జాతీయ ఉద్యమ చరిత్రలో పూర్వ హైదరాబాద్ స్టేట్ సంస్థానం ప్రజలు నిర్వహించిన పాత్ర చారిత్రాత్మకమైనది. నిజాం పాలిస్తున్న హైదరాబాద్ సంస్థానాన్ని భారతీయ యూనియన్లో విలీనం చేసిన పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయుడు స్వామి రామానంద తీర్థ. ఆనాటి యువతరానికి ఆయన ఆచార్యుడు, మార్గదర్శి, తత్వ బోధకుడు.
వందేహం, మద్గురుం, శాంతం
కాషాయాంబర శోభితం
స్వాతంత్య్ర సమరోల్లాసం
రామానం దాఖ్య నాయకం
హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని ప్రజలు చేసిన పోరాటంలో స్వామి రామానంద తీర్థ ప్రముఖులు. ‘బలి అయిపోతాం గానీ లొంగము’ అంటూ మహాత్మాగాంధీ ప్రబోధించిన సత్యాగ్రహ మార్గంలో ‘సత్యమైన ఆగ్రహం’ వల్ల ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహనీయుడు స్వామీజీ. స్వామీజీ కర్ణాటక రాష్ట్రం జువర్గీ జిల్లాలోని ‘సింధీ’ గ్రామంలో 1903 అక్టోబర్ 3న జన్మించారు. ఆయన తండ్రి బాపూరావు, తల్లి యషూబాయి. స్వామీజీకి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఖేడ్గికర్ వెంకటరావు. స్వామీజీ ప్రాథమిక విద్యను గాణగాపూర్లో చదివారు. సోలాపూర్లోని తిలక్ విద్యాపీఠం నుంచి రాజకీయశాస్త్రంలో ఎం.ఏ. పట్టా పుచ్చుకొన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, హరిజనోద్ధరణకు, దక్షిణ భారత హిందీ ప్రచార సభకు, హైదరాబాద్ స్టేట్ విమోచనకు దీక్ష పూని తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేసి సన్యాసం స్వీకరించారు. కర్ణాటకలో జన్మించి మహారాష్ట్రలో విద్యాభ్యాసం చేసి హైదరాబాద్ సంస్థానం కోసం చివరి క్షణం వరకు సేవలందించారు స్వామీజీ. అంతేకాకుండా ప్రజాసేవ కోసం ముగ్గురు అద్భుతమైన శిష్యులను కూడా అందించారు. వారిలో ఒకరు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్.బి.చవాన్ కాగా మరొకరు కర్ణాటక మాజీ సీఎం పాటిల్. ఇక స్వామీజీకి అత్యంత ప్రియమైన శిష్యుడైన పీవీ నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా, దేశానికి తొలి తెలుగు ప్రధానిగా సేవలందించారు. నవ భారత ఆర్థిక సంస్కర్తగా, స్థితప్రజ్ఞుడిగా పేరుగాంచారు.
స్వాతంత్య్ర భారత అవతరణ తర్వాత సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ రాజనీతిజ్ఞతతో దేశంలోని స్వదేశీ సంస్థానాలన్నీ ఒక్కొక్కటి ఇండియన్ యూనియన్లో విలీనమై తమ అఖండ భారత ఐక్యతను చాటుకొన్న సందర్భంలో అప్పటి హైదరాబాద్ రాజ్యాన్ని ఏలుతున్న నిజాం నవాబ్ విలీనానికి ఒప్పుకోలేదు. కాంగ్రెస్, ఆర్య సమాజ్, కమ్యూనిస్టు, సోషలిస్ట్ యువ కార్యకర్తలను ఆడ, మగ తేడా లేకుండా అరెస్టు చేసి జైళ్లలో ఉంచారు. ఆ విధంగా భారత ప్రభుత్వానికి చాలా జఠిలమైన సమస్యను నిజాం నవాబ్ సృష్టించారు. 1947, ఆగస్టు 15న జవహర్లాల్ నెహ్రూ భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. హైదరాబాద్ స్టేట్లో మాత్రం జాతీయ జెండా ఎగరలేదు. జాతీయ జెండా ఎగరేయబోయిన జమలాపురం కేశవరావు, జీఎస్ మెల్కోటే, దిగంబర్రావు బిందు, దాశరథి కృష్ణమాచార్య, కొండా వెంకటరెడ్డి, పీవీ నరసింహారావు మొదలైన నేతలను నిర్బంధించి వరంగల్, మధిర జైళ్లకు తరలించారు.
తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో పనిచేసే దాదాపు 1200 మంది యువ కార్యకర్తలను సమీకరించి స్టేట్ కాంగ్రెస్ను నెలకొల్పిన రామానంద తీర్థతోపాటు రావి నారాయణ రెడ్డి, జనార్ద్ధన దేశాయ్, రామకృష్ణ దూత్, రాఘవేంద్రరావు, కెప్టెన్ జోషి లాంటి అనేక మందిని శాంతి భద్రతల దృష్ట్యా నిజాం నవాబ్ చంచల్గూడ జైలుకు తరలించి 18 నెలల కఠిన కారాగార శిక్ష విధించారు. నానాటికీ హైదరాబాద్ సంస్థానంలో విషమిస్తున్న పరిస్థితుల దృష్ట్యా అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్, భారత సైన్యాధికారి లెఫ్టినెంట్ జనరల్ మహారాజా రాజేంద్ర సింహజీ నేతృత్వంలో భారత సైన్యం సోలాపూర్, విజయవాడ, అహ్మద్నగర్ల నుంచి మూకుమ్మడిగా 1948 సెప్టెంబర్ 15న సంస్థానాన్ని చుట్టుముట్టాయి. దీన్నే ఆపరేషన్ పోలో (పోలీస్ యాక్షన్) అంటారు. ఇక పరాజయం తప్పదని తెలిసిన నిజాం నవాబు స్వామీ రామానంద తీర్థను, ఇతర నాయకులను విడుదల చేశారు. ప్రజలు ఆనందోత్సాహాలతో నాయకులకు, భారత సైనికులకు అఖండ స్వాగతం పలికారు. సెప్టెంబర్ 17న నిజాం నవాబు తన సైన్యాన్ని ఉపసంహరించుకొని తాను బేషరతుగా భారత యూనియన్లో కలిసిపోతున్నట్టుగా (లొంగిపోతున్నట్టుగా) ప్రకటించారు. ఆ తర్వాత స్వామీ రామానంద తీర్థ 1952, 1957 ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ప్రజలకు సేవలందించారు. ఆ తర్వాత స్వామీజీ రాజకీయాలకు దూరంగా ఉంటూ పేదరికం, భూ సమస్యల నిర్మూలన, దళితుల (హరిజనుల) సేవకు, దక్షిణ భారత హిందీ ప్రచారసభ కార్యక్రమాలకు తన శేష జీవితాన్ని అంకితం చేశారు. హైదరాబాద్ బేగంపేటలోని బ్రాహ్మణవాడి లేన్ నెం.9లో స్థిర నివాసం ఏర్పరుచుకొని ప్రశాంత జీవితం సాగిస్తూ 1972 జనవరి 22న శివైక్యం చెందారు.
స్వామీజీ అనుంగు శిష్యుడైన పీవీ నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా తన విద్యుక్త ధర్మాలను ఎంతో శ్రద్ధగా నిర్వహించారు. స్వామీజీకి సమాధితోపాటు ఆయన సంస్మరణార్థం ‘స్వామి రామానంద తీర్థ మెమోరియల్’ సంస్థను స్థాపించి దేశభక్తి, యోగా, ధ్యానం, ఆయుర్వేదం, మహిళాభ్యున్నతి, అందరికీ విద్య, హరిజనోద్ధరణ వంటి సేవా కార్యక్రమాలను చేపట్టారు. స్వామీజీ భావజాలాన్ని జీవితాంతం ప్రచారం చేసి గురువుకు తగ్గ శిష్యునిగా చరిత్రలో నిలిచారు. స్వామి రామానంద తీర్థ మెమోరియల్ సభ్యులు ఇప్పటికీ స్వామీజీ తత్త ప్రచారం కోసం అనేక సేవా కార్యక్రమాలు, స్వామీజీ పేరిట పాఠశాల నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న ఔషధ, సుగంధ మొక్కలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్ 17న 75వ సమైక్యతా దినోత్సవాన్ని మూడు రోజులపాటు వజ్రోత్సవాలుగా ఘనంగా నిర్వహించింది. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
(వ్యాసకర్త: శాసన మండలి సభ్యురాలు)
– సురభి వాణీదేవి