కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 50 రోజులు కావస్తున్నది. పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. కనుక ఇంకా గెలుపు జోష్ ఉండాల్సిందే. కానీ కాంగ్రెస్ నాయకులెవరినీ చూసినా వారిలో ఆ ఉత్సాహం కరువైంది. ఉత్సాహం కన్నా అసహనమే ఎక్కువగా కనిపిస్తున్నది.
ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమంటే కాంగ్రెస్ నాయకులకు కోపం తన్నుకొస్తున్నది. ముఖ్యమంత్రి సహా ఏ మంత్రిని కదిలించినా ఇదే తంతు. అసలు ఎందుకంత కోపం? ఎందుకంత ఫ్రస్ట్ట్రేషన్? మీరు చెప్పిన హామీలను గుర్తుచేస్తే తప్పా..? ఇప్పుడు కొంతమంది మాత్రమే ప్రశ్నిస్తున్నారు. ఇంకొన్ని రోజులైతే ప్రతిపక్షాలు, మీడియా, మేధావులు, యూట్యూబ్ చానెళ్లు, ప్రజలు అందరూ ప్రశ్నిస్తారు. అప్పుడు వారందరిపైనా ఇదే కోపం చూపిస్తారా? అలాగైతే గత పదేండ్లుగా బీఆర్ఎస్ నాయకులు ఎంత కోపానికి రావాలె? నిజానికి గత పదేండ్లుగా బీఆర్ఎస్ ఎదుర్కొన్నంత ప్రశ్నల దాడిని దేశంలో ఏ ప్రభుత్వం ఎదుర్కోలేదు. అయినా సరే ఆ దాడిని తట్టుకుంటూ పరిపాలన సాగించింది బీఆర్ఎస్.
ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ఈ ప్రశ్నల దాడిని ఎదుర్కోవాల్సిందే. అందుకు కాంగ్రెస్ మినహాయింపు అనుకుంటే అది తప్పే అవుతుంది. నిజానికి 2016లో దేశంలో సోషల్ మీడియా విప్లవం మొదలైంది. ఈ క్రమంలో ఏ అర్హత లేని కొంతమందికి ఇదొక ప్లాట్ఫామ్ అయింది. వాళ్లంతా జర్నలిస్టులమని చెప్పుకొంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామనుకుంటూ యూట్యూబ్ చానెళ్లను స్టార్ట్ చేశారు. వారికి ఆదాయమంటే వ్యూస్ మాత్రమే. మరి వ్యూస్ కావాలంటే ప్రభుత్వాన్ని పొగిడితే రావు. కనుక విమర్శించటమే ముఖ్యం. దానికి ఓ ఫ్యాన్సీ పేరు.. ప్రశ్నించే గొంతుకలమని. అయితే సాంప్రదాయంగా ప్రశ్నిస్తే చూసేవారే లేరు. అందుకే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను బూతులు తిట్టాలి. వ్యంగ్యంగా మాట్లాడాలె. అప్పుడే ఎంటర్టైన్మెంట్ ఉంటది. కొంతమంది అయినా చూస్తారు. గతంలో లేని విధానం కనుక చాలా మంది వ్యూవర్స్ కూడా ఇలాంటి చానెళ్లను చూడటం మొదలుపెట్టారు. సాధారణ న్యూస్ చానెళ్లలో ఇలాంటి స్పైసీ, గాసిప్స్, ఆధారం, ఆలోచన లేని వార్తలు ఉండవు. కనుక కొంతమంది వీటిని చూడటం మొదలుపెట్టారు. వీటికి ఆదరణ పెరిగింది. దీంతో మిగతా మెయిన్స్ట్రీమ్ మీడియా కూడా కొంతవరకు ఈ ప్రభావానికి గురైంది. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా మొత్తం ఏ అంశానికైనా రకరకాల ఉద్దేశాలు ఆపాదిస్తూ, కోడిగుడ్డు మీద ఈకలు పీకుతూ, తప్పుడు ప్రచారాలను షురూ చేస్తున్నాయి. వీటిని అరికట్టడమనేది సాధ్యం కాని స్థాయికి వెళ్లిపోయింది.
అయితే ఈ తరహా ప్రశ్నించే గొంతుకలు మొదలైన నాటి నుంచి తెలంగాణలో బీఆర్ఎస్సే అధికారంలో ఉన్నది. కొత్త తరహా ప్రశ్నలతో, కోడిగుడ్డు మీద ఈకలు పీకే జర్నలిజానికి అసలుసిసలు బాధిత పార్టీగా మారింది బీఆర్ఎస్. నిజానికి దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ఉన్నప్పటికీ తెలంగాణలోని అధికార పార్టీకి మాత్రమే దీని సెగ తగిలింది. మిగతా రాష్ర్టాల్లో మాత్రం పరిస్థితి ఇంత తీవ్రంగా లేదు. ఎంటర్టైన్మెంట్, గాసిప్స్, తిట్లతో కూడిన సోషల్ మీడియా న్యూస్కు సహజంగానే ఆదరణ పెరిగింది. దీంతో మేధావులు, బుద్ధిజీవులు, సంఘజీవులు కూడా తమ యూట్యూబ్ చానెళ్ల కోసం ఇదే తరహా విధానాన్ని ఎన్నుకున్నారు. ప్రభుత్వాన్ని తిట్టేవారికే వ్యూస్ రావటంతో ఇక అందరూ అదే దారి పట్టారు. దీంతో అధికారంలో ఉన్న పార్టీకి స్వేచ్ఛ లేకుండా పోయింది. గతంలో ఒకటి, రెండు హామీలు ఇచ్చి తప్పించుకున్నా పెద్దగా పట్టించుకున్న పరిస్థితి ఉండేది కాదు. ప్రజలు కూడా పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు, చెప్పింది చేయాల్సిందే. లేదంటే ప్రశ్నించే సమూహం ఊరుకోదు. అందుకే బీఆర్ఎస్ను పట్టి పీడించారు. ప్రశ్నలతో వేధించారు. ప్రతిదానికీ తప్పుడు అర్థాలు తీశారు. ఈ దాడంతా అధికార పార్టీ మీదే కావటంతో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ దీన్ని ఎంజాయ్ చేసింది. అలాంటివారిని ప్రోత్సహిస్తూ తమ పార్టీ గెలుపు కోసం వాడుకున్నది.
కానీ, ఇప్పుడు కాంగ్రెస్కు ఆ సెగ ఏమిటో తెలిసివస్తది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రశ్నించే సమూహానికి తమ, పర భేదమేమీ లేదు. వారికి కావాల్సింది వ్యూసే. అవి ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే వ్యూస్ వస్తాయి. ఒకరిద్దరు వారి స్వప్రయోజనాల కోసం అధికారపార్టీకి కొమ్ముకాస్తే వారిని ఇప్పుడున్న సోషల్ మీడియా, ప్రజలు చీల్చిచెండాడటం ఖాయం. కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఇవ్వాల్సిన మరొక గ్యారెంటీ ఏమంటే ఎంత ప్రశ్నించినా సహనం కోల్పోమని, బీఆర్ఎస్ మాదిరిగా ప్రశ్నించే వారికి స్వేచ్ఛనిస్తామని.
-రచ్చ దినేష్
89787 40475