ప్రభుత్వాధినేత దార్శనికుడు అయితే ప్రభుత్వం విశాల ప్రయోజనాలు ఆశించి పథకాలను అమల్లోకి తెస్తుంది. పథకం ప్రయోజనాలను పరిశీలించకుండా ఏదో ఒక విమర్శ చేసి, అప్రతిష్టపాలు చేయాలనుకోవడం విచారకరం. గత చేదు అనుభవాలను సమగ్రంగా అధ్యయనం చేసిన అనంతరం వ్యవసాయ రంగం పురోగమనం వల్లే రాష్ట్ర ప్రగతి సాధ్యమని సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా పథకాలను అమల్లోకి తెచ్చారు.
ఆరుగాలం కష్టపడి పండించే రైతన్నలు నేడు తెలంగాణలో ఆత్మ గౌరవంతో బతుకుతున్నారు. రైతన్న కష్టం వెలకట్టలేనిది. రైతుకు కులం లేదు మతం లేదు. కష్టించి పండించిన పంటను సమాజానికి అందించడం మినహా. అయితే ఒక పథకం ప్రయోజనాలను నిశితంగా పరిశీలించకుం డా ‘కులం’ కోణంలో సంకుచిత విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కులం’ కోణంలోనే సాధికారికంగా సమాధానం ఇవ్వడం అనివార్యం. భవిష్యత్తును ముందే దర్శించి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన భారీ మార్పు లు… ఆర్థిక చేయూత, కల్పించిన ప్రయోజనాలు రైతు కుటుంబాలలో జీవన భరోసాను నింపాయి. జీవన భద్రతను కల్పించాయి. ఈ చర్యలు దేశంలోనే వరి పండించడంలో తెలంగాణను అగ్ర రాష్ట్రంగా నిలిపాయి.
రాష్ట్రంలో సన్నకారు, చిన్నకారు రైతులు అధికంగా ఉన్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే ఎక్కువ. అందులో బీసీ రైతులు అధికం. ఈ రైతులకు ప్రభుత్వ పరంగా ప్రయోజనాలు అందజేసినప్పుడు కుదేలైన వ్యవసాయ రంగం పురోగమనంలోకి వస్తుంది. గతంలో ప్రభుత్వాలు ఈ వాస్తవ దృక్పథాన్ని గమనించలేదు. ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. గత నిర్లక్ష్యం, వైఫల్యాల నేపథ్యంలో తెలంగాణలో తీరని నష్టాన్ని విషాదాంతాలను చవిచూడాల్సి వచ్చింది. ఇటీవల నిర్వహించిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎమ్.ఐ.టీ), అబ్దుల్ లతీఫ్ పావర్టి ల్యాబ్ సర్వే ప్రకారం 86.5% రైతులు ఈ పథకం పట్ల పూర్తి సంతృప్తి ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకం జీవన భరోసాకు గొప్ప వరం. ఈ పథకం రాష్ట్రంలో ఆరంభించాక అన్ని వర్గాలతోపాటుగా ప్రధానంగా బీసీ రైతులు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. దార్శనికుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని మదించి రూపొందించిన ‘రైతుబంధు’ పథకం సా మాజిక, హరిత, ఆర్థిక విప్లవాలకు బాటలు వేసింది. ఈ పథకం అమలుకు ప్రభుత్వం దూరదృష్టిని అర్థం చేసుకోకుండా, సమాచార లేమితో అర్థ సత్య, అసత్య ప్రచారాలు చేయడం తగదు.
1956లో జమీందారీ వ్యవస్థ రద్దు ,1960లో దున్నేవాడిదే భూమి నినాదం, 1970 భూసంస్కరణలు, 1973 భూ గరిష్ఠ పరిమితి చట్టం, ఆచార్య వినోబా భావే స్ఫూర్తితో పీవీ నరసింహారావు అమలు చేసిన భూ సంస్కరణలు, ఇలా ఆయా సందర్భాలలో వచ్చిన చట్టాల వల్ల రైతులకు కొంత మేలు జరిగింది. కాగా నాటి ప్రభుత్వాలు ప్రాథమిక అవసరాలకు రుణసదుపాయం, మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైఫల్యం చెందాయి. అందువల్ల వ్యవసాయ రంగం అనుకున్నంత ప్రగతి సాధించలేకపోయింది. కాగా నేడు విప్లవాత్మకంగా అమలులోకి తెచ్చిన రైతుబంధు పథకం రైతులకు వరంగా నిలిచింది. వ్యవసాయ పెట్టుబడికి సన్న, చిన్నకారు రైతులకు బాసటగా నిలిచింది. రైతుబంధు సాలీనా ఎకరానికి 10వేల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ అందించడం వలన తెలంగాణ మరొక వ్యవసాయ విప్లవానికి నాంది పలికింది.
రాష్ట్రంలోని చిన్నా, చితకా కమతాలతో పాటుగా వివరాల్ని లోతుగా పరిశీలించినప్పుడు రాష్ట్రంలో 71.47 లక్షల ఎకరాల యజమానులు బీసీ రైతులే కావడం గమనించదగింది. 2018-2022 వరకు లబ్ధిదారుల వివరాలను పరిశీలించినప్పుడు సన్నకారు రైతులు (3 ఎకరాలలోపు) సుమారు 26 లక్షల 50 వేల మంది, చిన్నకారు (35 ఎకరాలలోపు) సుమారు 5 లక్షల 50 వేల మంది లబ్ధి పొందారు. ఇందులో సన్నకారు రైతులు దాదాపు రూ.12,500 కోట్లు, చిన్నకారు రైతులు రూ.8,600 కోట్లు వెరసి రూ.21 వేల కోట్ల ఆర్థిక చేయూత పొందగలిగారు. మిగతా మధ్యస్థ, భారీ రైతులు కూడా లబ్ధి పొందినప్పటికీ, ఇప్పటివరకు ఈ పథకం ద్వారా వెచ్చించిన రూ.57,900 కోట్ల రూపాయలలో అధికంగా మేలు జరిగింది చిన్నకారు, సన్నకారు రైతులే అని గణాంకాలు స్పష్టం చేస్తున్నా యి. ఎస్సీ రైతుల ఆధీనంలో 13.53 లక్షల ఎకరాలు, ఎస్టీల ఆధీనంలో 19.29 లక్షల ఎకరాలు. అలాగే సమాజంలో ఇతరేతర వర్గాలు 44.41లక్షల ఎకరాల వ్యవసాయ భూములు కలిగి ఉన్నారు. ఇప్పటివరకు తాజా లెక్కల ప్రకారం రైతుబంధు ద్వారా 34. 81 లక్షల మెజార్టీ లబ్ధిదారులుగా బీసీ రైతులు ఉండ డం హర్షించదగింది. ఎస్టీ రైతులు 8.24 లక్షలు, ఎస్సీ రైతులు 8.54 లక్షలు, ఇతరులు 13.41 లక్షల రైతులు ఆర్థిక సాయం పొందారు.
ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి అందజేసిన రూ.57,901.46 కోట్లలో బీసీ రైతులకు రూ.27, 792.70 కోట్లు, ఎస్టీ రైతులకు రూ.7,527.19 కోట్లు, ఎస్సీ రైతులకు రూ.5,211.13 కోట్లు ఇతర వర్గాల రైతులకు రూ.17,370.44 కోట్లు రైతుబంధు ద్వారా అందజేయడం గమనించవచ్చు. ఇందులో బీసీ రైతులు అధికంగా లబ్ధిపొందడం గమనించాలి. ఈ పథకం లక్ష్యాన్ని అర్థం చేసుకోకుండా ఇతర ఉన్నత వర్గాల కోసం అమలులోకి తెచ్చారంటూ విమర్శలకు దిగడం విచారకరం. అలా చేసే వ్యాఖ్యలు నిరాధారమైన, సత్యదూరమైన కువిమర్శలు తప్ప మరేమీ కాదు.
ఇందులో నిర్దిష్టమైన సమాచారం గణాంకాలతో సాధికారికంగా చర్చించిన దరిమిలా చెప్పుకోవాల్సింది ‘రైతుబంధు పథకం’ పేద రైతు కుటుంబాలలో వెలుగును నింపింది అని మాత్రమే. అదే సమయంలో మధ్యస్థ, ధనిక రైతులకు కూడా లబ్ధి జరిగి ఉండవచ్చు. అయితే ఈ ధనిక వర్గాల రైతల కోసమే పథకం అమలులోకి వచ్చిందనేది మాత్రం అసత్య ప్రచారమే. రైతుబంధు పథకం అమల్లోకి వచ్చిన అనంతరం పేద రైతు కుటుంబాలలో కనిపిస్తున్న ప్రగతిని గమనించి అయినా అనవసర విమర్శలను మానుకోవడం మంచిదని హితవు.
రైతుబంధు స్ఫూర్తితో కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం అమలులోకి తెచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా రైతుల ఆదరణను పొందలేకపోతున్న ది. ఈ పథకం రైతులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చలేకపోతున్నది. కేంద్ర ప్రభుత్వానికి ఇంతవరకు శాస్త్రీయ పద్ధతిలో రూపొందించిన ఒక జాతీయ వ్యవసాయ విధానం లేకపోవడం విచారకరం. తెలంగాణలో వ్యవసాయ రంగంపై ప్రభుత్వ చర్యలు దేశానికి ఆదర్శం. నేడు ఇక్కడి రైతుబంధు పథకం పేద రైతులకు కల్పవల్లిగా విరాజిల్లుతున్నది. ఇప్పటికే ఈ వాస్తవాన్ని పలు శాస్త్రీయ సర్వేలలో అభివృద్ధ్ది సూచికలు నిర్థారించాయి. ఇది కేంద్రం గమనించాల్సి ఉన్నది. ఆ దిశగా నిర్మాణాత్మకంగా చర్యలు చేపట్టాల్సి ఉన్నది. అప్పుడే దేశంలో గ్రామీణ హరిత, ఆర్థిక వికాసం సాధ్యం.
(వ్యాసకర్త : చైర్మన్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ )
డాక్టర్ వకుళాభరణం
కృష్ణమోహన్రావు