2018 నుంచి ఐదేండ్లలో కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేట్ బ్యాంకులు (యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్, ఐసీఐసీఐ, ఐడీబీఐ) జరిమానాల రూపంలో రూ.35,587 కోట్లు, మినిమమ్ బ్యాలెన్స్ నిల్వ ఉంచనందుకు రూ. 21,044 కోట్ల జరిమానాలు, అధిక ఏటీఎం లావాదేవీల చార్జీల కింద రూ.8,289 కోట్లు , ఎస్ఎంఎస్ సర్వీస్ చార్జీల రూపేణా రూ.6,254 కోట్లు ఖాతాదారుల నుంచి వసూలు చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో ఖాతా గలవారు రూ.500-1000, పట్టణ పాంతాల్లో ఖాతా గలవారు రూ.2000-5000, మెట్రో నగరాల్లోని వారైతే రూ.3000-10000 బ్యాలెన్స్ నిర్వహించాలి. ఈ నిబంధన ఉల్లంఘిస్తే రూ.150 నుంచి రూ.600 వరకు జరిమానా విధిస్తున్నారు. ఎంతమంది ఖాతాదారులు అలాంటి కనీస నిల్వను నిర్వహించగలరు? ఎంత మంది ఇంత భారీ జరిమానాలను భరించగలరు? ఖాతాదారులు నెలకు నిర్దిష్ట సంఖ్యకు మించి ఏటీఎం ద్వారా లావాదేవీలు చేస్తే ప్రతి లావాదేవీకి రూ.21 బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. అలాగే కస్టమర్లకు ఆటోమేటెడ్ ఎస్ఎంఎస్ హెచ్చరికలను పంపడానికీ బ్యాంకులు ఛార్జీలు విధిస్తున్నాయి. ఒకవైపు వివిధ సామాజిక పథకాల కోసం ప్రభుత్వాలు నగదు రహిత బదిలీల కోసం బ్యాంక్ ఖాతాలు తెరవమని ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. మరోవైపు ప్రజలు తమ సొంత డబ్బును ఉపసంహరించుకోవడానికి, నిర్వహించుకోవడానికి జరిమానాకు గురవుతున్నారు. స్థిరమైన ఉద్యోగం లేదా సంపాదన లేనివారు తమ బ్యాంకు లావాదేవీలను పరిమితం చేయలేరు. వారి ఖాతాల్లో డబ్బులున్నప్పుడు నెలలో చాలాసార్లు ఏటీఎంలను ఉపయోగించాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో ఏటీఎం లావాదేవీలపై జరిమానాలు విధించడం ఎంతవరకు న్యాయం?
ఇటీవల ప్రభుత్వరంగ బ్యాంకులు అధిక లాభాలను నమోదు చేశాయి. 2022లో ఏప్రిల్-జూన్ మధ్య ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.15,306 కోట్లు, 2023లో ఏప్రిల్-జూన్ మధ్య రూ.34,774 కోట్ల లాభాలు ఆర్జించాయి. బ్యాంకు ఖాతాదారులపై విపరీతమైన సర్వీస్ చార్జీలు విధించడం, ఔట్ సోర్సింగ్, పర్మినెంట్ వర్క్ కాంట్రాక్ట్ ద్వారా జీతాల ఖర్చు తగ్గించడం, ఉద్యోగులతో భయంకరమైన పరిస్థితుల్లో గంటల తరబడి పని చేయించకోవడం వల్ల బ్యాంకులు ఈ లాభాలు పొందుతున్నాయని వివిధ బ్యాంకుల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీలు, రైతులు తమ అవసరాలకు అప్పులు చేసి వడ్డీతో సహా వాటిని తిరిగి చెల్లించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. దీనికి విరుద్ధంగా బ్యాంకుల్లో ఆదా చేసిన ప్రజల డబ్బును బడా కార్పొరేట్లకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలుగా అందిస్తున్నారు! అదే డబ్బును కార్పొరేట్ల రుణాలను మాఫీ చేయడానికీ ఉపయోగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ గత 9 ఏండ్లలో బడా కార్పొరేట్లకు రూ.14.56 లక్షల కోట్లు రుణమాఫీ చేసినట్టు తెలిపింది. కానీ తాము బ్యాంకుల్లో పొదుపు చేసిన సొమ్మును ప్రజా సంక్షేమం కోసం మాత్రమే ఉపయోగించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
-ఆళవందార్ వేణుమాధవ్
86860 51752