ఆర్ రెడ్యూస్
ఆర్ రీయూజ్
ఆర్ రీసైకిల్
నియంత్రణ లేకుండా సహజ వనరులను వినియోగించడం, విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడకం వెరసి నింగి, నీరు, నేల క్రమక్రమంగా కాలుష్య కాసారంగా మారుతున్నాయి. ఫలితంగా భూతాపం పెరుగుతుండటంతో వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పర్యావరణ ముప్పు ముంచుకొస్తున్నది. గతంతో పోల్చితే భూమి సగటు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. భూమి సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ పెరిగితే తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలతో పాటు, భూమిపై మనిషి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఎదురవుతుందని ఐపీసీసీ నివేదికలతో పాటు శాస్త్రవేత్తలు నిత్యం మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ పౌరసమాజంలో మాత్రం ఆశించిన స్థాయిలో మార్పు రావడం లేదు.
మనం వాడే వస్తువులలో చాలావాటిని రీసైకిల్ చేయవచ్చు. ప్లాస్టిక్, కాగితం, కాంక్రీట్, మానవ, జంతు, పశు, పక్షి వ్యర్థాలు ఇలా దేన్నైనా రీసైకిల్ చేసి వాటిని మరో అవసరానికి వినియోగించవచ్చు. కొన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలిసిపోయేందుకు కొన్ని వందల సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే ప్లాస్టిక్ రీసైక్లింగ్, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాల కోసం విస్తృతస్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను రీసైకిల్ చేయడం వల్ల గాలి, నేల, నీటి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పు కారణంగా ఇప్పటికే జంతువులు, పక్షులు క్రమంగా అంతరిస్తున్నాయి. అడవులు తరుగుతున్నాయి. నివాస ప్రాంతాలు పెరుగుతున్నాయి. ఇటీవల అమెరికా మంచులో కూరుకుపోయింది. పాకిస్థాన్ వరదల్లో చిక్కింది. యూరప్ దేశాలను కరువు కాటేస్తున్నది. భారత్లోనూ అతివృష్టి, అనావృష్టి నిత్యకృత్యం అయ్యాయి. వీటిని ప్రజలు గుణపాఠంగా తీసుకోవాలి. ఈ భూగ్రహం కేవలం మనుషులది మాత్రమే కాదు, సమస్త జీవరాశులది అనే చైతన్యం తెచ్చుకోవాలి.
ఈ సమష్టి బాధ్యతలో భాగంగా, ‘మేరీ లైఫ్ మేరా స్వచ్ఛ షహర్’ నినాదంతో రెడ్యూస్, రీయూ జ్, రీసైకిల్ (ఆర్ఆర్ఆర్) పేరుతో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మార్చి 20వ తేదీన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కార్పొరేషన్ పరిధిలోని ప్రజల వద్ద, ఇండ్లలో నిరుపయోగంగా ఉన్న వస్తువులను సేకరించడం, వాటిలో పనికొచ్చే వాటిని తిరిగి వినియోగించడం, అవసరం లేని వాటిని రీసైక్లింగ్ చేసి మరో అవసరానికి వాడాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నాం.
రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ ఉద్దేశం..
రెడ్యూస్ అంటే చెత్తకుప్పల్లోకి చేరే వ్యర్థాలను తగ్గించుకోవడం. ఈ మేరకు మనం వినియోగిస్తున్న వాటిలో దేన్నైనా అవసరం ఉన్నంతవరకే వాడుకోవడం. దీనివల్ల ఆర్థికంగా లాభం చేకూరడంతోపాటు భూమిని కాపాడటంలో మన వంతు సా యం అందించినట్లవుతుంది. భూమ్మీద ఉన్న వారందరూ రాగల ప్రమాదాన్ని పూర్తిగా నివారించకలేకపోయినా, దాని తీవ్రతను తగ్గించవచ్చు. చెత్త తగ్గాలంటే.. ఒకసారి వాడి పారేసే వస్తువుల కంటే, మళ్లీమళ్లీ వాడుకోగల వస్తువులకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. అలాగే మనం వాడిన వాటిని మళ్లీ వాడుకోవటాన్ని (పునర్వినియోగాన్ని) రీయూజ్గా చెప్పవచ్చును. ఉదాహరణకు కొంతమంది బట్టలను, వాహనాలను కొద్ది రోజులు వాడి పక్కన పడేస్తారు. కానీ, వాటి అవసరం ఉన్నవాళ్లు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. అలాగే ఇంట్లో మిగిలిన అన్నం పడేస్తారు. కానీ, ఆ అన్నం బయట చాలా మంది ఆకలి తీరుస్తుంది. పిల్లల చదువుల కోసం పుస్తకాలను కొంటారు. ఆ సంవత్సరం పూర్తవగానే ఆ పుస్తకాలను మూలన పడేయడమో, లేదా పేపర్లు కొనేవాళ్లకు అమ్మడమో చేస్తారు. కానీ, పుస్తకాలు కొనలేని పిల్లలకు వాటిని అందిస్తే ఎంతో మేలు జరుగుతుంది. పేదింటి పిల్లలు పెద్ద చదువులను తక్కువ ఖర్చుతో చదవడానికి పరోక్షంగా మనం సహకారం అందించినట్లు అవుతుంది.
వాడేసిన వస్తువుల రూపం, తీరుతెన్నులను రీసైక్లింగ్ ద్వారా మార్చి మరో అవసరానికి వాడుకోవడం వలన వ్యర్థానికి కొత్త అర్థం చెప్పినట్లు అవుతుంది. ముఖ్యంగా, మనుషుల రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగమనేది విడదీయలేని భాగమై పోయింది. దేశంలో ప్రతి నిమిషం దాదాపు 12-15 లక్షల కొత్త ప్లాస్టిక్ బ్యాగులను వినియోగిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
తక్కువ ఖర్చుతో పాటు, సులభంగా అన్ని అవసరాలకు ఉపయోగపడుతుండటంతో ప్లాస్టిక్ బ్యాగులపై ప్రజలు ఎక్కువగా ఆధారపడుతున్నారు. కానీ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువుల వాడకం వలన పర్యావరణ కాలుష్యం పెరగటమేగాక భూమిపైనున్న జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇప్పటికే యాభై మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న కవర్లు, వస్తువుల వినియోగంపై నిషేధం ఉంది. కానీ ప్రజల భాగస్వామ్యం, సహకారం లేని కారణంగా పూర్తిస్థాయిలో అమలు కావటం లేదు. వాడేసిన ప్లాస్టిక్ను రీ సైకిల్ చేయడం వలన కొత్త ఉత్పత్తి తగ్గుతుంది. మరోవైపు, చెడిపోయిన ఆహార పదార్థాలను సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగించవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇనుప వస్తువులు మొదలైన వాటిని రీ సైకిల్ చేయడం వలన ఏదో ఒక రూపంలో వాటిని మళ్లీ వినియోగంలోకి తీసుకురాగలం.
రీయూజ్ వస్తువుల కోసం..
స్వచ్ఛభారత్ మిషన్-అర్బన్ 2.0లో భాగంగా కార్పొరేషన్ పరిధిలోని 26 వార్డులలో స్థానిక కార్పొరేటర్ల, కాలనీ వాసుల సహకారంతో రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్ (ఆర్ఆర్ఆర్) వస్తువుల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశాం. 15 రోజుల పాటు ఈ కేంద్రాలు కొనసాగుతాయి. ప్రజలు తమ సామాజిక బాధ్యతను గుర్తించి ఆర్ఆర్ఆర్ను ఆదరించడంతోపాటు ఇందులో భాగస్వామ్యం కావాలి. రీయూజ్ చేసే వస్తువుల కోసం కార్పొరేషన్ పరిధిలో ఔట్లెట్లను కూడా ఏర్పాటు చేస్తాం. అవసరం ఉన్న వాళ్లకు ఉచితంగానే వాటిని అందించడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ మహాయజ్ఞంలో అందరమూ భాగస్వాములం అవుదాం. భూమిని రక్షించుకుందాం.
(వ్యాసకర్త: మేయర్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్)
జక్క వెంకట్ రెడ్డి