ఖమ్మం రూరల్, ఆగస్టు 7: ‘ముందు నా భర్తను చంపెయ్.. ఆ తర్వాతే నాకు కనిపించు. ఎవరితోనైనా యాక్సిడెంట్ చేయించు’ అంటూ తన ప్రియుడికి వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా మెసేజ్లు పంపించిన భార్య ఉదంతం శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదె రాజేశ్వరరావుకు.. 2016లో సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన భవానితో పెళ్లి జరిగింది. వీరి దాంపత్యం జీవితంలో ఇద్దరు కూతుళ్లు జన్మించారు.
రాజేశ్వరరావు తన కుటుంబంతో ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఏదుపులాపురం మున్సిపాలిటీ పరిధి సాయిప్రభాత్ నగర్లో నివాసం ఉంటూ.. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రాజేశ్వరరావు భార్య భవానికి కొరియర్ బాయ్గా పని చేస్తున్న సైదులు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గత నెల 27వ తేదీన రోజువారీగా విధులకు వెళ్లిన రాజేశ్వరరావు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన సమయంలో తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించాడు.
దీనిపై భర్త ఆరా తీసినా ఆమె సమాధానం చెప్పలేదు. ఇంతలోనే అక్కడి నుంచి సంబంధిత వ్యక్తి పారిపోయాడు. ఇక్కడ జరిగిన విషయాన్ని వెంటనే రాజేశ్వరరావు తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో 28వ తేదీన ఇంట్లోనే మాట్లాడుకుందామని చెప్పారు. అయితే 28వ తేదీన ఇంటికి వెళ్లిన రాజేశ్వరరావు తమ గ్రామ సమీపంలోని పెరుమాండ్ల సంకీసలో ఉన్న అన్నను తీసుకురావడానికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తనను అనుసరిస్తున్న విషయాన్ని గ్రహించిన రాజేశ్వరరావు.. ఇంటికి చేరుకొని తన భార్య సెల్ఫోన్ తీసుకొని పరిశీలించాడు.
దీంతో వాట్సప్, ఇన్స్టా, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంల ద్వారా భవాని తన ప్రియుడికి పెట్టిన మెసేజ్లు చూసి భర్త నివ్వెరపోయాడు. ‘నా భర్త చనిపోవాలి. వేరే వ్యక్తితో నా భర్తకు యాక్సిడెంట్ చేయించి, నాకు కనిపించు’ అనే మెసేజ్లు చదివి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఆ మెసేజ్లు ఎవరి ఫోన్కు పెట్టిందని ఆరా తీయగా.. ఖమ్మంలోని ఓ ప్రైవేటు సంస్థలో కొరియర్గా పనిచేస్తున్న సైదులు అని గుర్తించాడు. ఈ విషయాన్ని తన అత్తగారింట్లో తెలియజేసి, ఆమెను పుట్టింటికి పంపించాడు. అనంతరం రాజేశ్వరరావు ఈ నెల ఒకటో తేదీన డోర్నకల్ పోలీస్స్టేషన్లో జరిగిన ఉదంతంపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిని జీరో ఎఫ్ఐఆర్గా నమోదు చేసి, ఖమ్మం రూరల్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. దీనిపై రూరల్ సీఐ ముష్కారాజ్ను వివరణ కోరగా.. కేసు నమోదు చేసి, విచారణ చేపట్టామని పేర్కొన్నారు.