హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) పేరుతో ఎయిడ్స్ వ్యాధి నిర్దారణ పరీక్ష, కౌన్సెలింగ్ (ఐసీటీసీ) కేంద్రాలను కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదం అవుతున్నాయి. రేషనలైజేషన్ పేరుతో కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (న్యాకో) ఈ మేరకు చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఈ నెల 5న న్యాకో జారీ చేసిన సర్క్యులర్తో ఆ సంస్థ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఎయిడ్స్ రోగులు సైతం అయోమయానికి గురవుతున్నారు.
ప్రపంచ దేశాలను గడగడలాడించిన మహమ్మారిగా పేరున్న హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో ఉన్న వివక్షలను పారదోలి, రోగుల్లో మానసిక ైస్థెర్యాన్ని, ధైర్యాన్ని నింపడమే ఐసీటీసీ కేంద్రాల పని. వీటిలో కౌన్సెలింగ్ స్కిల్స్తో సుశిక్షితులైన, నిష్ణాతులైన కౌన్సిలర్లు సేవలందిస్తున్నారు. రేషనలైజేషన్ పేరిట ఈ కేంద్రాలను తగ్గించనున్నారు. వ్యాధిగ్రస్తులు పరీక్షలు చేయించుకోవడానికి అందుబాటులో ఐసీటీసీ కేంద్రాలుండవు. దీనితో సదరు హెచ్ఐవీ, అనుమానిత, హై రిస్క్ గ్రూప్, సంక్రమిత వ్యక్తుల ద్వారా చాపకింద నీరులా సమాజంలో ఎయిడ్స్ వ్యాధి మరింత ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉన్నది.
భారతదేశం మొత్తమ్మీద వివిధ రాష్ర్టాల్లో 593 ఐసీటీసీ కేంద్రాలను ఎత్తివేయడానికి రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో 40 సమీకృత సలహా, పరీక్ష కేంద్రాలు (ఐసీటీసీలు) మూతపడనున్నాయి. ఐసీటీసీ కేంద్రాలను ఎత్తివేసి అందులో ఉన్న కౌన్సిలర్, ల్యాబ్ టెక్నీషియన్ సిబ్బందిని ఇతర ప్రాంతాల్లోని ఐసీటీసీ కేంద్రాల్లో సర్దుబాటు చేయనున్నారు.
ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ పరిపాలన, ప్రజా సంక్షేమ పథకాలు ఉండాలని పదేపదే వల్లె వేసే కేంద్రం వాటిని ప్రజలకు అందకుండా హేతుబద్ధీకరణ పేరిట పట్టణాలకే పరిమితం చేయడం పట్ల ఉద్యోగు లు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
2005 నుంచి అంటే దాదా పు ఇరవై ఏండ్లుగా ప్రతి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐసీటీసీలను ఏర్పాటుచేసి హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ, కౌన్సిలింగ్ సేవలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోగులకు హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ, సలహా లు, సూచనలతో పాటు ఇతర అవకాశవాద రోగాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు వివరిస్తూ, కౌన్సిలర్లు తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
జనరల్ వ్యక్తులు, రిస్క్ ఉన్నవారు, ప్రతి గర్భిణీకి, శస్త్ర చికిత్సల సందర్భంగా హెచ్ఐవీ వ్యాధి నిర్ధారణ పరీక్షలను శిక్షణ పొందిన ల్యాబ్ టెక్నీషియన్లు మూడు దశల్లో పలు టెస్ట్ కిట్లతో ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ (ఐసీటీసీ)లలో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో పల్లెల్లోని ఐసీటీసీ కేంద్రాల్లో గల కౌన్సెలర్, ల్యాబ్ టెక్నీషియన్లను ఏరియా, జిల్లా కేంద్ర ఆస్పత్రులలో గల ఐసీటీసీ కేంద్రాల్లో సర్దుబాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ వల్ల పల్లె ప్రాంతాల్లోని రోగులకు వైద్యసేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్ష లు, కౌన్సిలింగ్ సేవలు చేరువలో లభించక రోగులు అనేక అవస్థలు అనుభవించే పరిస్థితి నెలకొననున్నది. ఆర్థికంగా చితికిపోయే దుస్థితి ఎదురుకానున్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభు త్వం పునరాలోచించి సామాజిక ఆరోగ్య కేంద్రాలలో గల ఐసీటీసీ కేంద్రాలను ప్రస్తుత పరిస్థితిలోనే కొనసాగించాలని ఉద్యోగులు, రోగులు, ప్రజాసంఘాల నాయకులు కోరుకుంటున్నారు.
అవసరమైతే దేశంలోని ప్రభుత్వాలు ఐసీటీసీ కేంద్రాలలో పనిచేస్తున్న కౌన్సిలర్లను, ల్యాబ్ టెక్నీషియన్లను జాతీయ ఆరోగ్య మిషన్ కింద వివిధ ఆరోగ్య, కుటుంబ సంక్షేమం పథకాలు అవగాహన, ప్రజా చైతన్య కార్యక్రమాలకు వినియోగించుకోవాలి.
రావుల రాజేశం
98488 11424