తెలంగాణలో బీసీ సామాజికవర్గ కులాల్లో ఎక్కువగా అణచివేయబడిన కులం రజక. వీళ్లు శ్రమ దోపిడీకి గురై సమాజంలో చిన్నచూపు చూడబడ్డారు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా రజకులు కూడా ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అవకాశాలను కల్పిస్తున్నది. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రజకుల అభివృద్ధి కోసం కృషిచేస్తున్నది.
అనేక సంవత్సరాలు రాష్ర్టాన్ని పరిపాలించిన గత పాలకులు రజకులను పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో రజకులు కులవృత్తిలో ఆర్థికంగా ఎదగడం కోసం లాండ్రి షాపులకు ఉచిత విద్యుత్ను ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని పథకం ఇది.
ఉచిత విద్యుత్తుతో పాటు ఆధునిక ధోబీ ఘాట్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్లు తీసుకుంటున్న చర్యలు రజకులకు మరింత ఉపాధినిచ్చేవిగా మారాయి. వారి ఆలోచనలను అందిపుచ్చుకొని రజకులు మరింత అభివృద్ధి చెందాలి.
అలాగే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని రజక సంఘాలు గతంలో అనేక పోరాటాలు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహి స్తూ రజకుల ఆత్మగౌర వం పెంపొందించేలా చేసింది. మరోవైపు కులవృత్తులు చేసుకునేవారికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం గొప్ప విషయం. తెలంగాణ లోగ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తినే నమ్ముకున్న అనేక రజక కుటుంబాలు తమ రెక్కల కష్టం మీదే జీవనం సాగిస్తున్నాయి. అలాంటి కుటుంబాలకు పూర్తి సబ్సిడీతోని లక్ష రూపాయలు అందించడం ఆహ్వానించదగింది. ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థికసాయాన్ని రజకులు సద్వినియోగం చేసుకొని తమ కులవృత్తికి అవసరమైన మిషనరీని కొనుక్కొని కొంతమేర శ్రమను దూ రం చేసుకోవాలి.
రజక బిడ్డల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేయడంతో పాటు విదేశాల్లో చదువు కోసం ఆర్థికసాయం అందజేస్తున్నది. దీన్ని సద్వినియోగం చేసుకున్న అనేకమంది రజక విద్యార్థులు ఇప్పటికే విదేశాల్లో విద్యనభ్యసిస్తున్నారు. అలాగే రజక కులస్థులకు నామినేటేడ్ పదవులు ఇస్తూ ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రజకులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. రజకుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారి అభివృద్ధికి కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగానే ఉంటారు.
గతంలో రజకుల బాగోగులను గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు లేవంటే అతిశయోక్తి కాదు. అలాంటిది కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నది. రానున్న రోజుల్లో రజకులు కేసీఆర్ వెంట నడవడానికి సిద్ధంగా ఉండాలి.
(వ్యాసకర్త: రాష్ట్ర రజక సంఘాల సమితి యూత్ అధ్యక్షులు)