పాకిస్థాన్కు, ప్రజాస్వామ్యానికి ఎప్పుడూ చుక్కెదురే. భారత్తోపాటే స్వాతంత్య్రం పొందిన పొరుగుదేశంలో ఎక్కువకాలం సైనిక పాలనే కొనసాగింది. సైనిక ఆధిపత్యం కింద ఓటు నిరంతరం నలుగుతూనే ఉంది. గత 75 ఏండ్లలో సగభాగం ప్రత్యక్ష సైనిక పాలన కిందే గడిచిపోయింది. మిగిలిన సగభాగంలో కూడా పరోక్ష సైనిక ఆధిపత్యం కిందనే పౌరప్రభుత్వాలు పనిచేశాయి. తాజాగా పాకిస్థాన్లో జరిగిన ఎన్నికల్లో నెలకొన్న ప్రతిష్టంభనను ఈ నేపథ్యంలో నుంచి గమనించాల్సి ఉంది. పైగా చివరి ఐదుగురు ప్రధానమంత్రులు విచారణలకు, శిక్షలకు గురికావడం కూడా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. హోరాహోరీగా, ఉత్కంఠ మధ్య జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. అయితే ప్రస్తుతం రకరకాల కేసుల్లో జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ప్రజల్లో తనపై ఉన్న అభిమానం పూర్తిగా తగ్గలేదని నిరూపించుకున్నారు. 265 స్థానాలు గల జాతీయ చట్టసభలో ఆయన నేతృత్వంలోని పాకిస్థాన్ తెహరీక్ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి చెందిన అభ్యర్థుల్లో వందమంది దాకా విజయం సాధించడం విశేషం. పీటీఐపై నిషేధం విధించడంతో ఆ పార్టీకి చెందినవారంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాల్సి వచ్చింది.
ఇమ్రాన్ పార్టీకి గుర్తింపు లేనందున మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు చెందిన పీఎంఎల్ (ఎన్) 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా ముందుకు రావడం పాక్ రాజకీయ వైచిత్రి.సైన్యం అండదండలతో పోటీ చేసిన నవాజ్ షరీఫ్ పార్టీ మూడోవంతు కంటే తక్కువ స్థానాలకు పరిమితం కావడం, సైన్యం ఏమాత్రం ఇష్టపడని ఇమ్రాన్ పార్టీ అనధికార (స్వతంత్ర) అభ్యర్థులు గణనీయమైన స్థానాలు దక్కించుకోవడం ప్రజలు ఎటువైపు ఉన్నారో తెలియజేస్తున్నది. పాకిస్థాన్ రాజకీయాల్లో ఇప్పటికీ సైన్యం చక్రం తిప్పుతుండటాన్ని ఇది సూచిస్తున్నది. మరో మాజీ ప్రధాని ఆసిఫ్ అలీ జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 56 స్థానాలతో మూడో స్థానంలో నిలిచింది. పొత్తుపై షరీఫ్, జర్దారీ పార్టీల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. సైన్యం కనుసన్నల్లో ఈ రెండు పార్టీలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిలావల్ భుట్టోను ప్రధానిని చేయాలని జర్దారీ డిమాండ్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
పాకిస్థాన్ ఎన్నికలపై అమెరికా, యూరప్ దేశాలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. సైన్యం జోక్యం చేసుకుని రిగ్గింగ్ జరిపించిందని, ఎన్నికల నిర్వహణపై నిజనిర్ధారణ జరిపించాలని పలువురు కాంగ్రెస్ సభ్యులు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు విజ్ఞప్తి చేశారు. భావ ప్రకటనాస్వేచ్ఛపై అనవసరమైన నియంత్రణలు విధిస్తున్నారని, మీడియాపై ఆంక్షలు విధించారని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, కొన్ని పార్టీలు పోటీ చేయలేని పరిస్థితి కల్పించడం ద్వారా సమానావకాశాలను దెబ్బతీశారని యూరోపియన్ యూనియన్ ఆరోపిస్తున్నది. బ్రిటన్ కూడా దాదాపుగా ఇదే తరహాలో స్పందించింది. ఇమ్రాన్ పార్టీ నాయకులు, మద్దతుదారులపై వేధింపులు, అరెస్టులు, సుదీర్ఘ నిర్బంధాలు అమలవుతున్నాయని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం చేసిన ప్రకటన ఎన్నికలు జరిపిన తీరును ప్రశ్నార్థకం చేస్తున్నది. తమ పార్టీని ఎన్నికల పోటీలో లేకుండా సైన్యం కుట్రలు పన్నుతున్నదని, ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, కావాలనే ఫలితాలను ఆలస్యం చేశారని ఆరోపిస్తూ పీటీఐతో పాటు మరికొన్ని పార్టీలు నిరసనలకు దిగాయి. ఎన్నికల్లో అక్రమాలపై ఆందోళన బాట పడతామని ఇమ్రాన్ పార్టీ ప్రకటించడం రాజకీయ అస్థిరత మరికొంతకాలం పాటు కొనసాగుతుందని సూచిస్తున్నది.